సూట్కేస్.. సిమెంట్ కంపెనీలు పెట్టలేదు.. ఆ రోజు మీ సంగతి చూస్తాం.. సీఎం జగన్పై పవన్ ఫైర్
రైతుల కన్నీళ్లు ఆగే వరకు జనసేన పోరాటం చేస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష విరమణ అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సభలో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో తనపై, జనసేనపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా.. బూతులు తిట్టినా భరిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. ఇంకా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..
బూతులను భరిస్తాం
రైతుల కోసం, ఆడ పడచుల కోసం ఎన్ని బూతులనైనా భరిస్తాం. తమపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. మాది అనే రోజు వచ్చిన రోజు వదిలిపెట్టమని 150 మంది ఎమ్మెల్యేలకు చెబుతున్నాం. మీరు తిట్టే తిట్లు మా గుండెల్ని గుంచుకొంటున్నాయి. అవన్నీ మేము గుర్తుపెట్టుకొంటాం. దానికి పర్యవసనాలు ఉంటాయి. 150 మంది ఎమ్మెల్యేలు నిగ్రహంతో వ్యవహరించాలి అని పవన్ కల్యాణ్ అన్నారు.
తెలుగు భాషను రక్షించుకొంటాం
ఇంగ్లీష్ మీడియం తనకు ఇష్టం లేదని చెప్పలేదు. తెలుగు భాషను పరిరక్షించాలన్నదే తన అభిమతం. కానీ వైసీపీ ప్రభుత్వం పవన్ కల్యాణ్ ఇంగ్లీష్ మీడియం వద్దని అసత్య ప్రచారం చేస్తున్నది. మాకు తెలుగు భాషను ఎలా పరిరక్షించుకోవాలో తెలుసు. తిట్టడం మాకు వచ్చు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
సూట్ కేసు కంపెనీలు పెట్టలేదు
నేను కాంట్రాక్టులు చేయలేదు. నేను సూట్ కేసు కంపెనీలు పెట్టలేదు. సిమెంట్ కంపెనీలు పెట్టలేదు. నాకు సినిమాలు తప్ప మరోకటి లేదు. ఓటమి వల్ల నా ఆత్మస్థైర్యం దెబ్బతినలేదు. అధికారం కోసం పాకులాడను. రైతుల కష్టాలు తీరే వరకు పోరాటం చేస్తాను. రైతు సమస్యల పరిష్కారం కోసం గ్రామాలను సందర్శిస్తాను. రైతులకు 1500 రూపాయల గిట్టుబాటు ధర ఇవ్వాలి అని పవన్ కల్యాణ్ సూచించారు.
అధికారం శాశ్వతం కాదు
అధికారం శాశ్వతం కాదు. ప్రజా సమస్యలను పట్టించుకోలేని ఎంతో మంది కాల గర్భంలో కలిసిపోయారు. 150 మంది ఎమ్మెల్యేలు ఎంత. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మా నేతలను బెదిరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలల్లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకొన్నది అని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.