వైయస్ తప్పే బాబు చేస్తున్నారు, తెలంగాణలో పోటీపై డైలమాలో.. క్లారిటీ ఇస్తా: పవన్ కళ్యాణ్
విశాఖపట్నం: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడం వల్ల డైలమాలో పడ్డానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ రద్దయి నెల రోజులు దాటింది. ఆ మరుసటి రోజే టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన మహాకూటమి సీట్ల లెక్కింపుపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. బీజేపీ పలువురు అభ్యర్థులను ప్రకటించింది.
Recommended Video
ఎన్నికలకు మరో నెల రోజులు కూడా లేవు. అయినప్పటికీ జనసేనలో ఎలాంటి కలయిక లేదు. ఇది చర్చనీయాంశంగా మారింది. దీనిపై జనసేనాని మాట్లాడారు. మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఎన్నికల్లో పోటీ అంశంపై స్పందించారు.
23 స్థానాల్లో పోటీ చేయాలనుకున్నాను కానీ
అసెంబ్లీ రద్దు కాకుండా సాధారణంగానే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరిగితే తెలంగాణలో 23 స్థానాల్లో పోటీ చేయాలని భావించినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ఖమ్మం, మహబూబ్నగర్, మల్కాజిగిరి లోకసభ స్థానాల్లో పోటీ చేయాలని భావించినట్లు తెలిపారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహించలేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్పై నా దృష్టి
ఆంధ్రప్రదేశ్లో తన అవసరం ఉందని, నవ్యాంధ్రలో రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయడం, వివక్ష చూపిస్తున్నారని, అందుకే ప్రస్తుతం తన దృష్టి అంతా ఏపీ పైనే పెట్టానని తెలిపారు. జనసేన తెలంగాణలో పోటీ చేస్తే అక్కడ ప్రచారం కోసం తిరగవలసి ఉంటుందని, స్వతంత్రంగా పోరాటం చేయాలనుకుంటున్న పలు సామాజిక సంఘాల వారు జనసేన మద్దతు కోరుతున్నారని చెప్పారు. ఈ విషయమై రెండు మూడు రోజుల్లో నిర్ణయిస్తామని చెప్పారు.
పవన్ కళ్యాణ్పై మద్దతు, పోటీ కోసం ఒత్తిడి
కాగా, తెలంగాణలో ముందస్తు నేపథ్యంలో పోటీ వద్దని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. కానీ తెలంగాణ జనసైనికుల నుంచి, జనసేన నాయకుల నుంచి, పవన్ మద్దతు కోరుకుంటున్న పార్టీలు, సామాజిక సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తోందని తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన వారికి మద్దతు, పోటీపై రెండు మూడు రోజుల్లో హైదరాబాదులో చెబుతానని అన్నారు.
వైయస్ చేసిన తప్పునే చంద్రబాబు చేస్తున్నారు
ఇదిలా ఉండగా, ఏపీలో చంద్రబాబు పాలనపై జనసేనాని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. జనసేన అధికారంలోకి వస్తే బాక్సైట్ తవ్వకాలను నిలిపేస్తామన్నారు. స్పష్టమైన విధానం తీసుకొస్తామన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో బాక్సైట్ తవ్వకాలు జరిగినప్పుడు గిరిజన ప్రాంత సలహా కమిటీ ఛైర్మన్గా ఉన్న బాలరాజు అదే పార్టీలోనే ఉంటూ వ్యతిరేకించారని, అలాంటి వ్యక్తి జనసేనలోకి రావడం ఆనందమన్నారు. ఆ రోజుల్లో అరకుకు 150 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి నాటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిసి సమస్యలపై ఎలా పోరాడారో గుర్తించానని చెప్పారు. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా వంతాడలో కొండలను పిండి చేయటం గమనించానని పవన్ అన్నారు. రియల్టైం గవర్నెన్స్ గురించి మాట్లాడే చంద్రబాబుకు అక్రమ తవ్వకాల సంగతి తెలియకపోవడం విడ్డూరమన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి చేసిందే పెద్ద తప్పును, చంద్రబాబు కొనసాగిస్తున్నారని, ఇది ఇంకా పెద్ద తప్పు అన్నారు. పవన్ ఆశయాలు నచ్చి తాను జనసేనలో చేరానని, ఆయన మార్పు కోసం కృషి చేస్తున్నారని పసుపులేటి బాలరాజు అన్నారు.
పాలన చేయకుండా 2019లో పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం
చిల్డ్రన్ కేర్, షేర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శనివారం జనసేనానిని కలిశారు. తమ సమస్యలపై చిన్నారులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. దీనిపై పవన్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో స్పందించారు. అక్రమ మైనింగ్, ఇసుక మాఫియా, అనాథ పాఠశాలల ఆస్తుల ఆక్రమణ వంటి దందాలు పెరుగుతుంటే, చంద్రబాబు 2019లో తనకు మద్దతిచ్చే పక్షాలతో పొత్తు పెట్టుకునే పనుల్లో తీరికలేకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు. అధికారులు చిన్నారుల సమస్యపై దృష్టి సారించాలన్నారు. టీడీపీ మద్దతుదారుల నుచి అనాథల ఆశ్రమాన్ని కాపాడాలన్నారు.