చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ఎలా ..మహిళల రక్షణకు ఆ పని చెయ్యండి : పవన్ కళ్యాణ్ సలహా
ప్రేమోన్మాది దాడికి బలైన గాజువాక ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి హత్య ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గాజువాకలో విద్యార్థిని హత్య బాధాకరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. చట్టాలు చేసి చేతులు దులుపుకుంటే ఫలితం రాదని పేర్కొన్న పవన్ కళ్యాణ్, 17 ఏళ్ళ ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బాలికపై, ప్రేమోన్మాది దాడి చేసి హత్య చేసిన ఘటన తనకు ఎంతో బాధ కలిగించిందని తెలిపారు.
వరలక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్
ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన ఆ ఆడబిడ్డ తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఆవేదనను ప్రభుత్వ అర్థం చేసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా అన్నారు పవన్ కళ్యాణ్. కొద్ది రోజుల కిందటే విజయవాడలో ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్వినిపై ఓ ఉన్మాది కత్తితో దాడి చేసి హత్య చేసిన ఉదంతాన్ని ఎవరూ మర్చిపోలేదని, ఇప్పుడు గాజువాక లోనూ అదే తరహాలో ఉన్మాదం తో కూడిన హత్య చోటుచేసుకోవడం దారుణమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలకు మీ సమాధానం ఏంటి ? జగన్ సర్కార్ కు ప్రశ్న
విద్యార్థులకు, యువతులకు, మహిళలకు రక్షణ కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరించడం మంచిది కాదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అత్యంత పాశవికంగా ఈ ఘాతుకానికి ఒడిగట్టిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దిశ చట్టం చేశాం, దిశ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేశామని ప్రకటనలు చేసి ప్రచారం చేసుకున్న పాలకులు రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
పాఠశాల స్థాయి నుండి విద్యార్థినులకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చెయ్యాలి
చట్టాలు చేశామని చేతులు దులుపుకుంటే ఫలితం రాదన్నారు పవన్ కళ్యాణ్. దిశ చట్టం ఇప్పటికీ అమల్లోకి రాకపోవడానికి కారణాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రచారాలతో ఫలితం లేదని గ్రహించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు ఆత్మరక్షణ విద్యలు తప్పనిసరి చేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అదేవిధంగా మహిళలకు యువతకు ఆత్మరక్షణ మెలకువలు నేర్పించాలని, దీనికోసం విద్యాశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, హోం శాఖలు సంయుక్తంగా ఇందుకు సంబంధించిన నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
ప్రేమోన్మాది అఖిల్ కు రిమాండ్ విధించిన మెజిస్ట్రేట్
ఇలాంటి ఘటనలకు చేపట్టాల్సిన అవసరం, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మరోవైపు గాజువాక లో మైనర్ బాలిక హత్య కేసులో ప్రధాన నిందితుడు అఖిల్ విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. నిందితుడు సోమవారం ఉదయం పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మెజిస్ట్రేట్ ఈనెల 12వ తేదీ వరకు నిందితులకు రిమాండ్ విధించారు. దీంతో అఖిల్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.