లతా మంగేష్కర్ మరణం పట్ల పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి: ఏమన్నారంటే.?
హైదరాబాద్: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణం పట్ల యావత్ భారతదేశం విషాదంలో మునిగిపోయింది. రాజకీయ, సినీ ప్రముఖులు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. లతా మంగేష్కర్ మృతిపై ప్రముఖ తెలుగు నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
లతా మరణంతో తీవ్ర వేదనకు గురయ్యా: పవన్ కళ్యాణ్
'భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార 'గానకోకిల' లతా మంగేష్కర్ తుదిశ్వాస విడిచారనే విషయం తీవ్ర ఆవేదనను కలిగించింది. లతాజీ అస్తమయం భారతీయ సినీ సంగీతానికి తీరని లోటు. అనారోగ్యం నుంచి కోలుకొని ఇంటికి వెళ్లారు అని తెలుసుకొని స్వస్థత చేకూరింది అనుకొన్నాను. ఇప్పుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చింది' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

లతాజీ స్వరం దైవదత్తం. గాయయజ్ఞం: పవన్ కళ్యాణ్
'లతాజీ పాటకు భాషాబేధం లేదు. ఆ గళం నుంచి వచ్చిన ప్రతి గీతం సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేసింది. వేలాది గీతాలు ఆలపించిన లతాజీ స్వరం దైవదత్తం అనిపిస్తుంది. తెలుగులో కేవలం రెండు పాటలే పాడినా అవి మరచిపోలేనివి. నిదురపోరా తమ్ముడా..., తెల్ల చీరకు... పాటలు శ్రోతలను మెప్పించాయి అంటే లతాజీ గానమే కారణం. ఏడు దశాబ్ధాలుపైబడి సాగిన ఆమె గానయజ్ఞం... బాల్యం నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొని తను నిలిచి గెలిచిన తీరు స్ఫూర్తిదాయకం. దైవభక్తి మెండుగా కలిగిన లతాజీకి సద్గతులు ప్రాప్తించాలని... ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను' అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
లతా మంగేష్కర్ సంగీత ప్రపంచానికి తీరని లోటు: బాలకృష్ణ దిగ్భ్రాంతి
లతా మంగేష్కర్ మరణం పట్ల ప్రముఖ సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ అని, ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటని ఆయన అన్నారు. లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. 7 దశాబ్దాల్లో 30కి పైగా భాషల్లో 30వేల పాటలు పాడటం లతామంగేష్కర్ గానమాధుర్యానికి నిదర్శనమని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

లతా మంగేష్కర్ సేవలను కొనియాడిన బాలకృష్ణ
అంతేగాక, 'దేశంలో లతా మంగేష్కర్ పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు.. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు' అని బాలకృష్ణ కొనియాడారు. భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే... అవార్డులే కాదు విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలందించి ఆమెను గౌరవించాయని బాలయ్య అన్నారు. లతా మంగేష్కర్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుశారు నందమూరి బాలకృష్ణ.