యుద్దం ప్రకటించిన పవన్ కళ్యాణ్... నా పోరాటంలో చావడానికైనా సిద్దమే
తన తల్లిని దూషించిన ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇందుకు ప్రత్యక్షంగా,పరోక్షంగా బాధ్యులైన వారందరిపై యుద్దం ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆయన శ్రీరెడ్డి ఉదంతం, తదనంతర పరిణామాలపై తన మనోభావాలను వెల్లడించారు. తాను సినీ నటుడు, రాజకీయ నేత కావడానికి, వీటన్నింటికీ ముందు ఒక కొడుకుని అన్నారు. ఒక కొడుకుగా తాను తన తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే, దానికంటే చావడం మేలన్నారు.
ఈ పోరాటంలో తాను ఏ క్షణంలో అయినా చనిపోవచ్చని, అందుకే ఇప్పటివరకు తనకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే తన పోరాటం సమాజంలోని పీడిత,తాడిత ప్రజల కోసమనే విషయాన్ని, బలవంతులైన నేతలను కాపాడుతున్న వ్యవస్థ మీద అనే విషయాన్ని అభిమానులు గుర్తించాలన్నారు. తన తల్లిని ఉద్దేశించి శ్రీ రెడ్డి అసభ్యకరమైన మాటలతో దూషించడం, దాన్ని కొన్ని ఛానెల్స్ పదే పదే చూపించడం దురదృష్టకరమని పవన్ఆవేదన వ్యక్తం చేశారు.
అంతేకాదు ఈ ఉదంతానికి సంబంధించి చంద్రబాబు, లోకేష్, మీడియా సంస్థలపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు, విమర్శలు చేశారు. చంద్రబాబు నుద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే చట్టబద్దంగా వ్యభిచారం చేస్తున్న మీడియాలను నియంత్రించడం ముఖ్యమన్నారు.
పవన్ గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు వరుసగా ట్విట్టర్ లో పెడుతూ వస్తున్న పోస్ట్ లను బట్టి ఆయన తన తల్లిపై శ్రీ రెడ్డి దూషణల పర్వం, తదనంతర పరిణామాలపై ఆయన తీవ్రంగా కలత చెంది నిద్రలేని రాత్రి గడిపినట్లు అర్థమవుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి గురువారం అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో పోస్ట్ లు చేయడం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ శుక్రవారం ఉదయం వరకు పోస్ట్ లు పెడుతూనే ఉన్నారు. ఇలా ఆయన పది పోస్ట్ లు పెట్టినట్లుగా తెలుస్తోంది.
ఈ పది పోస్ట్ లలో పవన్ కళ్యాణ్ చాలా సవివరంగా తాను చేయదల్చుకున్న పోరాటం గురించి, వ్యక్తుల గురించి, కుట్రల గురించి, మీడియా గురించి ప్రత్యక్షంగా,పరోక్షంగా వివరిస్తూనే వ్యాఖ్యలు చేశారు. పైగా తానే ప్రకటించినట్లు చావడానికైనా సిద్దమనే ప్రకటనతో పవన్ ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించినట్లు అర్ధమవుతోంది. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ చేసిన పోస్టులు...లభ్యత ఉన్నంత వరకు ఇవి.
గురువారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో చేసిన పోస్ట్...ఎపి ప్రత్యేక హోదా కోసం పోరాటంపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లలో ఎవరు గందరగోళ పరుస్తున్నారో, ఎవరు విశ్వాసం కలిగిస్తున్నారో ప్రజలకు తెలుసంటూ ఈ ట్వీట్లను ప్రారంభించారు.
నా తల్లి గౌరవాన్ని నేను కాపాడలేకుంటే నేను చావడం మేలు అంటూ తన వ్యాఖ్యలతో కూడిన రెండుఫోటో పిక్ లు పోస్ట్ చేశారు.
ఏ క్షణం అయినా చావడానికి సిద్దంగా ఉన్నా...పవన్ కళ్యాణ్
సచివాలయం ను వేదికగా చేసుకొని లోకేష్, అతని స్నేహితులు, కొన్ని మీడియా సంస్థలు తన మీద తన కుటుంబం మీద నిరవధిక కుట్ర చేస్తున్నట్లుగా పవన్ ఆరోపించారు. అంతేకాకుండా ఇందుకోసం పది కోట్లు ఖర్చు పెట్టి మరీ తన తల్లిని అసభ్యంగా తిట్టించారని ఆరోపణలు చేశారు.
టీవి 9 ఓనర్ శ్రీనిరాజు ఆ రూ. 10 కోట్లు ఇచ్చారని, ఇందులో వర్మ, టీవి 9 ఓనర్ రవి ప్రకాష్, లోకేష్, అతడి స్నేహితుడు కిలారి రాజేష్ కుట్ర చేశారని, ఆ విషయం మీకు తెలియదా అని చంద్రబాబుని ప్రశ్నించారు.
నన్న, వృద్దురాలైన తన తల్లిని దూషించినట్లు చంద్రబాబును, లోకేష్ ను, బాలకృష్ణను తిడితే ఆ వీడియోలను ఇప్పటివరకు ప్రసారం చేసిన విధంగా పదేపదే ప్రసారం చేయగలరా అని ప్రశ్నించారు.
ఒకప్పుడు దొరలు అంటే భూస్వాములు కానీ ఇప్పుడు దొరలంటే ఈ మీడియా ఆసాములు ..వారు చెప్పిందే వేదం ,వారి పాడిందే నాదం..అని మరో కామెంట్ లో పేర్కొన్నారు.
లోకేష్ టివి 5 సాంబశివరావును చాలా ఆప్యాయంగా అంకుల్ అని పిలుస్తారని, ఆ విషయం చెప్పడం మరచిపోయానని పవన్ కళ్యాణ్ అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి....చట్టబద్దంగా వ్యభిచారం చేస్తున్న ఈ మీడియాను నియంత్రించడం ప్రత్యేక హోదా పోరాటం కంటే ముఖ్యమని, మరి మీ ప్రాధాన్యత ఏమిటి? మీరు మీడియాను నియంత్రిస్తారా?...అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.