ఇక వదిలేయండి, జగన్ ఇంటి ఆడపడుచుల్ని లాగకండి: పవన్ కళ్యాణ్
Recommended Video
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను తనను బాధించాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఉదయం సోషల్ మీడియా వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తాను ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లనని, రాజకీయాలకు ఎవరి వ్యక్తిగత జీవితాలను ఉపయోగించుకోనని చెప్పారు.
పవన్ కళ్యాణ్పై జగన్ వ్యాఖ్యలు, కాపునాడు తీవ్ర హెచ్చరిక
ప్రజలకు సంబంధించిన పబ్లిక్ పాలసీల పైనే నేను ఇతర పార్టీలతో విబేధిస్తానని తెలిపారు. ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని తాను అందరినీ కోరుతున్నానని చెప్పారు. 'అందరికీ నా విజ్ఞప్తి' (మై అప్పీల్ టు ఆల్) అని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. పవన్ తొలుత కొన్ని అక్షరదోషాలతో ట్వీట్ చేశారు. ఆ తర్వాత సరిదిద్ది తిరిగి మళ్లీ పోస్ట్ చేశారు.
జగన్ మాటలు చాలామందిని బాధించాయి
'ఈ మధ్యన శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు న్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలామందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్లను. అది రాజకీయ లబ్ధి కోసం అసలు వాడను. ప్రజలకు సంబంధించిన పబ్లిక్ పాలసీల మీదే మిగతా పార్టీలతో విభేదిస్తాను. నాకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు' అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
జగన్ ఇంటి ఆడపడుచులను లాగకండి
పవన్ కళ్యాణ్ ట్వీట్లో ఇంకా.. 'ఈ తరుణంలో ఎవరన్నా శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని కానీ వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కానీ, వారి ఇంటి ఆడపడుచులను కాని ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను' అని పేర్కొన్నారు. కాగా, పవన్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడనే విమర్శలపై కొందరు జగన్ పైన కూడా వ్యక్తిగతంగా దాడి చేస్తుండటంతో పవన్ ఈ విజ్ఞప్తి చేశారు.
పవన్ కళ్యాణ్ మాటల్లో తప్పేముంది?
అంతకుముందు, జగన్ అపరిపక్వ రాజకీయ నేత అని జనసేన నేతలు మండిపడ్డారు. ఆయనకు అసహనం తగ్గాలని, ఆయన నోట మంచి మాటలు రావాలని దేవుణ్ని ప్రార్థిద్దామంటూ జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరం, మరో నేత ముత్తంశెట్టి కృష్ణారావులు అన్నారు. పవన్ చట్టబద్ధంగా విడాకులు తీసుకునే వివాహం చేసుకున్నారన్నారు. ఆయన వ్యక్తిగత విషయాలపై జగన్ విమర్శలకు దిగడం సరికాదని చెప్పారు. అసెంబ్లీలో ఉండి పోరాడకుండా జగన్ పారిపోయారని పవన్ చేసిన విమర్శలో తప్పేముందన్నారు.
సహించేది లేదని హెచ్చరిక
ఇతరులపై విమర్శలు చేస్తున్నప్పుడు హుందాగా వ్యవహరించాలని జగన్కు జనసేన నేతలు సూచించారు. తమ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న అనూహ్యమైన స్పందన చూసి తట్టుకోలేక జగన్ వ్యక్తిగత విమర్శలకు దిగుతూ అభాసుపాలవుతున్నారన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి వేదిక అయిన చట్ట సభలను వదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం పాకులాడుతున్నారనే ఉద్దేశంతోనే అసెంబ్లీ నుంచి జగన్ పారిపోయారని పవన్ విమర్శించారన్నారు. ప్రజల సమస్యలను గాలి కొదిలేసి తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి అసెంబ్లీ వదిలి బయటకు రావడం పారిపోవడం కాదా అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న పవన్ పైన వ్యక్తిగత విమర్శలకు దిగితే సహించేదిలేదని హెచ్చరించారు.