పంచ భూతాలను కాపాడుకుందాం అంటున్న పవన్ కళ్యాణ్.. పర్యావరణాన్ని కాపాడే వారేరి ?
మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలమని,అలాంటి పర్యావరణ పరిరక్షణ అవసరమని పర్యావరణ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మానవాళికి పిలుపునిచ్చారు. పంచభూతాలను కాపాడుకుందామని పవన్ పేర్కొన్నారు. కానీ పర్యావరణ పరిరక్షణకు అటు ప్రజలు,ఇటు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నది అసలు ప్రశ్న. పర్యావరణ పరిరక్షణా దినం సందర్భంగా ఎందరు పర్యావరణ ప్రాధాన్యత చెప్పినా , కాపాడాల్సిన అవసరం చెప్పినా ప్రజల్లో మార్పు మాత్రం కనిపించటం లేదు.
పర్యావరణ పరిరక్షణ విషయంలో మనుషుల తీరు మారుతుందా ?
ప్రస్తుతం దేశం కరోనాతో అల్లకల్లోలంగా మారుతున్న సమయంలో ప్రకృతిని కాపాడుకోవాలి అన్న భావన కొందరిలో కలుగుతుంది. పర్యావరణాన్ని పరిరక్షిస్తే ఇలాంటి ఉపద్రవాలు మానవుల మీద ప్రభావం చూపించవనేది ఒక వాదన. పర్యావరణాన్ని పరిరక్షిస్తే ప్రకృతి ప్రకోపానికి బలికాకుండా ఉంటామనేది పర్యావరణ వేత్తల అభిప్రాయం. కానీ అభివృద్ధి చెందుతున్న నాగరికతతోపాటు, ప్రకృతి వినాశనం, పర్యావరణ విధ్వంసం కూడా కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ వంటి మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మనుషులలో మాత్రం పర్యావరణాన్ని కాపాడుకోవాలి అన్న ఆలోచన రావడం లేదు. ఎవరు ఎంతగా చెప్పినా మనుషుల తీరు మారటం లేదు.
మానవ మనుగడకు పంచ భూతాలే ఆధారం .. కాపాడుకుందాం : పవన్ పిలుపు
జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం సందర్భంగా పంచభూతాలను కాపాడుకుందామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ జనసేన పార్టీ మూల సిద్ధాంతమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. మానవ మనుగడకు పంచభూతాలే ఆధారమని పేర్కొన్నారు.అంతేకాదు పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన పార్టీ కాంక్షిస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ తన లేఖలో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించవలసిన రోజు ఇది అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
కరోనా శాంతిస్తే మన నది మన నుడి ప్రారంభిస్తామని వెల్లడి
ఇక జనసేన పార్టీ తలపెట్టిన మన నది-మన నుడి కార్యక్రమాన్ని కరోనా పరిస్థితుల నుండి బయటపడిన తరువాత రెండు తెలుగు రాష్ట్రాలలో అమలు చేస్తామని పేర్కొన్నారు. పర్యావరణానికి మేలు చేసే మొక్కలు నాటడం, పర్యావరణానికి హాని చేసే పరిశ్రమలపై పోరాటం సాగించడం తమ బాధ్యతగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. మనకు ఆరోగ్య ప్రదాయిని అయిన పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని పవన్ కళ్యాణ్ కోరారు. పర్యావరణం మన కంటికి కనిపించని విలువైన సంపద అని, ఈ సంపదను భావి తరాలకు అందించాలి అని తన అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
చక్కని పర్యావరణం ఉంటే ఆస్పత్రుల అవసరం ఉండదు అన్న పవన్
నింగి, నీరు, నేల, నిప్పు, గాలి తో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడే మానవజాతి శోభిల్లుతుంది అని పవన్ పేర్కొన్నారు. చక్కని పర్యావరణం ఉన్నచోట ఆసుపత్రుల అవసరం ఉండదని పవన్ కళ్యాణ్ చెప్పారు ఇక అంతే కాదు మన అడవులు, కొండలు, నదులను మనమే కాపాడుకోవాలి అంటూ పవన్ పేర్కొన్నారు.పర్యావరణ ప్రేమికులందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్.
మారకుంటే మానవ మనుగడకే ముప్పు .. ప్రజలు మారతారా ?
ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు పర్యావరణ ప్రేమికులు ఎంతగా చెబుతున్నా పర్యావరణ పరిరక్షణ అంశాన్ని ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఫలితంగానే ప్రకృతి ప్రకోపాలకు గురవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాయు కాలుష్యం, నీటి కాలుష్యం మాత్రమే కాదు విపరీతంగా ప్లాస్టిక్ వాడకం, మొక్కలను పెంచకపోవడం, ఉన్న చెట్లను నరికి వేయడం, నదులను, జల వనరులను కాపాడుకోకపోవడం వంటి అనేక కారణాలు పర్యావరణ విధ్వంస కారకాలు . ఇక పవన్ కళ్యాణ్ వంటి సెలబ్రిటీలు, పర్యావరణ ప్రేమికులు పర్యావరణాన్ని కాపాడాలని చేస్తున్న సూచనలను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే పర్యావరణానికి వాటిల్లే ముప్పు మానవ మనుగడకు ముప్పుగా పరిణమిస్తోంది అని చెప్పడం నిర్వివాదాంశం.