లాంగ్ మార్చ్కి తరలండి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు(వీడియో)
అమరావతి: విశాఖపట్నంలో ఆదివారం (నవంబర్ 3న) తలపెట్టిన లాంగ్ మార్చ్లో 13 జిల్లాల నుంచీ జనసేన నాయకులు, కార్యకర్తలు, ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. లాంగ్ మార్చ్కి సంఘీభావం తెలిపిన రాజకీయ పక్షాలన్నింటికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
లాంగ్మార్చ్ ముందు పవన్ కళ్యాణ్కు షాక్: జనసేనకు సీనియర్ నేత బాలరాజు గుబ్బై
వీడియో సందేశం
శనివారం హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో లాంగ్ మార్చ్ కి అన్ని వర్గాల మద్దతు కోరుతూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తమ సమస్యపై అన్ని పక్షాలను కలుపుకొని నిరసన కార్యక్రమం చేపట్టాలని భవన నిర్మాణ కార్మికులు విన్నవించిన విషయాన్ని గుర్తు చేశారు.
మద్దతుగా నిలవండి..
‘మంగళగిరి పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు అన్ని పార్టీలతో కలసి నిరసన చేపట్టాలని కోరడం జరిగింది. వారి కోరిక మేరకు లాంగ్ మార్చ్కు అన్ని పక్షాలను ఆహ్వానించాం. సంఘీభావం తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. లాంగ్ మార్చ్కి విశాఖలో ఉన్న ట్రేడ్ యూనియన్ నాయకుల అందరి సహాయ సహకారాలు కోరుతున్నాం. గతంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించి సమస్య వచ్చినప్పుడు నేను ముందుకు వచ్చి మీకు అండగా నిలిచాను. ఇది 35 లక్షల మంది పైచిలుకు భవన నిర్మాణ కార్మికుల సమస్య. వారి సమస్య ట్రేడ్ యూనియన్ నాయకులుగా మీరే ఎక్కువ అర్ధం చేసుకోగలరు. లాంగ్ మార్చ్కి సంఘీభావం తెలిపి సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియపర్చేందుకు ఆలంబనగా నిలవాలని కోరుతున్నాం' అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
అందుకే పవన్ కళ్యాణ్ ర్యాలీ..
ఇసుక కొరతతో ఉపాధి కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్న భవన నిర్మాణ కార్మికుల బాధలు చూడలేకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో లాంగ్ మార్చ్ చేపట్టినట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అన్నారు. గత ప్రభుత్వం ఇసుక విధానంపై అనేక విమర్శలు చేసిన జగన్.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా ఇసుకను అందుబాటులోకి తీసుకురాలేకపోయారని మండిపడ్డారు.
జగన్ సర్కారు తప్పుడు నిర్ణయాల వల్లే..
పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీలో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖలో లాంగ్ మార్చ్ నేపథ్యంలో ఆ పార్టీ నేతలు వీవీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్తో కలిసి ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కారు తప్పుడు నిర్ణయాల వల్ల సుమారు 50 నుంచి 70 లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇసుక విధానం వల్ల భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, వారికి నష్టపరిహారం ఇవ్వాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.