ప్రత్యేక హోదాపై వేచి చూద్దాం: జగన్ పార్టీ బంద్ నేపథ్యంలో పవన్ కళ్యాణ్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భూసేకరణ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కృతజ్డతలు తెలుపుతూ ట్వీట్ చేసిన తర్వాత ఆయన ప్రత్యేక హోదాపై కూడా ట్విట్టర్లో శుక్రవారం రాత్రి స్పందించారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనపై జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తొలిసారిగా స్పందించారు. ఈ విషయంలో మరికొంతకాలం వేచిచూద్దామని సూచించారు. ప్రత్యేక హోదాపై శనివారం వైసీపీ బంద్ ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం పవన్ ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హోదాపై ఇంకొంతకాలం వేచిచూద్దాం. అప్పటికీ న్యాయం జరుగని పక్షంలో దానిని ఎలా సాధించాలో ఆలోచిద్దాం.' అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపిన విషయం తెలిసిందే. భూసేకరణ బిల్లును తాము వెనక్కి తగ్గినట్లు మంత్రి నారాయణ ఉదయం ప్రకటించిన నేపథ్యంలో ఆయన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
రాజధాని నిర్మాణంలో భూసేకరణ ఆపే దిశగా అడుగులు వేస్తున్నందుకు రాష్ట్ర మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, నారాయణ గారు, ఇతర మంత్రి వర్గ సభ్యులు అందరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు అని ఓ ట్వీట్ చేశారు. మరో ట్వీట్లో ముఖ్యంగా రైతుల మనోభావాలను సానుభూతితో పరిశీలించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.