బాబూ! రూ.9 కోట్లు ఏవి, ఎవడబ్బ సొమ్ము.. కడుపుమండి వచ్చా, మోడీతో సిద్ధం: పవన్ కళ్యాణ్
విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో గిరిజన సమస్యలను చూసి కడుపుమండటం వల్లే జనసేన పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేన పోరాట యాత్ర సందర్భంగా ఆయన విశాఖపట్నం పాడేరులో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గిరిజనుల సమస్యలు పట్టించుకోవడం లేదని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.
గిరిజన యువతకు సరైన ఉపాధి మార్గాలు లేకే యువత పక్కదారి పడుతోందని అభిప్రాయపడ్డారు. ఐటీడీఏ ఉపాధి మార్గాలు చూపకపోవడం దారుణమన్నారు. హుకుంపేట మండలం గూడలో మైనింగ్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నా ఆ విషయాన్ని పట్టించుకోవట్లేదన్నారు. అక్రమంగా కొండలు తవ్వితే 2050 నాటికి అరకు ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలన్నారు.
ఒకవేళ జనసేన లేకుంటే
ఇప్పుడు ఒకవేళ జనసేన లేదనుకుంటే మాత్రం, వైసీపీ - టీడీపీలు అవినీతిని, దోపిడీని ఒకరినొకరు పంచుకొని, కడుపులో దాచుకుంటారని పవన్ చెప్పారు. కానీ జనసేన ఈ దోపిడీని అడ్డుకోవడానికి వచ్చిందన్నారు. అవసరమైతే లెఫ్ట్ పార్టీలతో కలిసి ముందుకు సాగుతానని చెప్పారు. అందరిలా దిగజారి తాను ఓట్లు అడిగేందుకు ఇక్కడకు రాలేదన్నారు. ఎన్నికల సమయంలో వచ్చి వెళ్లిపోయేందుకు రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. సామాజిక రాజకీయ చైతన్యం కోసమే వచ్చానని చెప్పారు. సరదా కోసం రాలేదన్నారు.
నాపై లేని ఆరోపణలు చేస్తే...: ఆపరేషన్ గరుడపై స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
ఉత్తరాంధ్రను అడ్డగోలుగా దోచుకుంటుంటే కడుపు మండి వచ్చా
ఉత్తరాంధ్రను అడ్డగోలుగా దోపిడీ చేస్తుంటే కడుపుమండి రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెప్పారు. మన్యం ప్రాంతంలోని గిరిజన గ్రామాలను చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందన్నారు. మాకు ప్రభుత్వాలు ఏమీ ఇవ్వడం లేదని, పైగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ రోజు ఎటు చూసినా యువతకు అవకాశం లేదన్నారు. పాడేరు, అరకు యువత ఎక్కువ మంది గంజాయి వైపు వెళ్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఒకవేళ అది నిజమైతే అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. ఉన్నత విద్యావంతులు ఉన్నారన్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ పని చేస్తుందా అన్నారు. ఈ సందర్భంగా పవన్ మల్లేష్ అనే విద్యార్థిని చూపించారు. ఆయన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారని, అతనికి ఐటీడీఏ సాయమందించాల్సిన బాధ్యత ఉందని, కానీ ప్రతిభ ఉన్న ఇలాంటి గిరిజన యువకుడికి సహకరించలేదని, అప్పుడు వారేం చేస్తారని, కోపంతో ఏం చేయగలరని ప్రశ్నించారు. చదువుకున్న నాకు ఉద్యోగం లేనప్పుడు కడుపు మండి ఏం చేస్తాడన్నారు.
ఆ డబ్బు ఎవడి జేబుల్లోకి వెళ్లింది, ఎవడబ్బ సొమ్ము?
ఓ వైపు వారి పిల్లలకు నాలుగు అయిదు కోట్ల ఖరీదు చేసే కార్లు ఉంటాయని పవన్ అన్నారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. మీరు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారని నిలదీశారు. ఉదాహరణకు మేం రూ.100 కోట్ల ఓ సినిమా తీస్తే ఎంతోమందికి వేతనాలు ఇస్తాం, భోజనాలు పెడతామన్నారు. కానీ రాత్రికి రాత్రి వీళ్లకు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. అవి ఎలా వస్తున్నాయో కూడా చెబుతానన్నారు. పాడేరు నుంచి, ఇతర గ్రామాల నుంచి రాష్ట్ర ఖజానాకు రూ.9 కోట్ల ఆదాయం రావాలని, అది ఎవడి జేబుల్లోకి వెళ్లిందని, అది ఎవడబ్బ సొమ్మని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వీళ్లు కష్టపడ్డారా అని ప్రశ్నించారు. వీళ్లే డబ్బులు తీసుకొని మళ్లీ వీళ్లే ఓట్లు వేయమని అంటారని మండిపడ్డారు.
మీరు ఓట్లు వేసినా, వేయకపోయినా నేను పోరాడుతా
ఆ తర్వాత ఓట్ల సమయంలో రూ.500, రూ.1000కి వీరికి బానిసల్లా బతకాలా అని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. నేను ఇక్కడకు ఎందుకు వచ్చానంటే.. నాకు మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఇక్కడి దోపిడీని అరికట్టేందుకు, దుర్మార్గాన్ని అరికట్టేందుకే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. నాకు కడుపు మండిందన్నారు. పదిమందికి పట్టుమని ఉద్యోగాలు ఇవ్వరని, కానీ వీరికి ఆస్తులు పెరుగుతాయని, ఇళ్లు పెరుగుతాయన్నారు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నానని, ఇక్కడకు వచ్చి చూడాలన్నారు. మీరు చేస్తున్న అవినీతి, దోపిడీని ఇక్కడకు వచ్చి చూడాలని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.9 కోట్లు ఎక్కడకు పోయాయన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా రోడ్లు లేవన్నారు. చిత్తూరులో హెరిటేజ్ శాఖ లోపలి వరకు రోడ్లు వేయించుకున్నారని ధ్వజమెత్తారు. అందరం కష్టపడుతుంటే, మన ఉమ్మడి శ్రమ, మన ఉమ్మడి చెమటతో వీరు మేడలు, మిద్దెలు కట్టుకుంటున్నారన్నారు. కానీ మనకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.
అరకు బాగు చేస్తే కాశ్మీర్ ఎందుకు?
ఇన్నేళ్లుగా కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోయారని, ఇలాంటి వ్యక్తులు తనకు నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉందని చెబుతుంటారని చంద్రబాబుపై పవన్ నిప్పులు చెరిగారు. మీ నాలుగు దశాబ్దాల అనుభవం.. మట్టి గుంటలో నీరు తాగించి, మలేరియా, ఆంత్రాక్స్ వచ్చేలా చేసిందన్నారు. బాక్సైట్ మైనింగ్ దోపిడీని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందన్నారు. అరకు కాశ్మీర్ లోయ అని చెబుతారని, సుందర ప్రాంతమని చెబుతారని, కానీ అక్కడ దగా చేస్తున్నారన్నారు. నిజంగా ఇక్కడి యువతకు ఉద్యోగాలు కావాలన్నారు. అరకు మంచి టూరిస్ట్ కేంద్రంగా కావాలంటే అందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాశ్మీర్, ఉత్తర భారత దేశానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదన్నారు. మన కాశ్మీర్ ఉందన్నారు.
అరకకు అన్యాయం జరిగితే మోడీ అయినా నేను సిద్ధం
గిరిజనులు ఎప్పటికీ వెట్టి చాకిరీ చేయాలా అని పవన్ ప్రశ్నించారు. వారి భూములు దోపిడీ చేయాలి, వారిని నిలువు దోపిడి చేయాలా అన్నారు. వారికి వ్యాపార మెళకువలు అవసరం లేదా అని ప్రశ్నించారు. కొత్తగా కేంద్రం భూసేకరణ చట్టం తీసుకు వస్తోందని, దాని గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. మీ ఎదుటే చెబుతున్నానని, నేను కేంద్రంపై ఈ విషయంలో నిలదీస్తున్నానని చెప్పారు. మన అరకు మన్యం ప్రాంతానికి అన్యాయం జరిగితే జనసేన, పవన్ కళ్యాణ్ ఉంటుందన్నారు. ఒకవేళ కేంద్రం, నరేంద్ర మోడీ గారు కావొచ్చు, ప్రధాని గారు కావొచ్చు.. దోపిడీ చేస్తే మాత్రం నేను ఉద్యమించేందుకు సిద్ధమన్నారు. అందుకు సిద్ధపడే వచ్చానన్నారు. చంద్రబాబు ప్రకృతిని ఇంతగా విధ్వంసం చేయాలా అన్నారు. కాలుష్య నియంత్రణా మండలి నిబంధనలు కూడా పట్టించుకోరన్నారు. వైసీపీ కూడా అడగడం లేదన్నారు. జనం నుంచి పుట్టిందే జనసేన అన్నారు.