ప్రజారాజ్యం దెబ్బతిన్న తర్వాత..: ఇతర పార్టీల్లోని కీలక నేతలకు పవన్ కళ్యాణ్ బంపరాఫర్
అమరావతి: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుక్రవారం పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జనసైనికులు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పైన ఫిర్యాదు చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని నాయకులకు జనసేనాని సూచించారు.
'ఫైవ్ ఇయర్ ప్లాన్': పవన్ కళ్యాణ్ 2014 వ్యూహం సక్సెస్
16 ఏళ్ల వయస్సులో రౌడీల్ని తరిమేశా
ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయడం లేదన్నారు. దళితులను వేధిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. టీడీపీ పాలనలో అంచనాలు మించిన అవినీతి జరిగిందన్నారు. తాను ఆకు రౌడీలకు, గాలి రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. తాను ఒక్క సైగ చేస్తే కాళ్లు విరగ్గొట్టి కూర్చోబెడతారని హెచ్చరించారు. పదహారేళ్ల వయస్సులోనే రౌడీలను తన్ని తరిమేశానని చెప్పారు. చింతమనేని లాంటి వ్యక్తుల్ని వెనుకేసుకొస్తున్న టీడీపీకి తాను ఎందుకు అండగా ఉండాలన్నారు. ప్రజల కోసం ఎవరితోనైనా గొడవ పెట్టుకుంటానని చెప్పారు.
జనసేనలోకి నేతలకు ఆహ్వానం
త్వరలోనే పార్టీ పార్లమెంటు స్థాయి కమిటీలు వేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీలోకి నేతలను ఆహ్వానిస్తున్నానని, వారి అవసరం ఉందని చెప్పారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి జనసేనాని స్వాగతం పలుకుతున్నారు. ఇప్పటికే టీడీపీ, వైసీపీ, బీజేపీలకు చెందిన పలువురు జనసేన వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. తన ఆలోచనలు, అనుభవాల నుంచి పుట్టినవే జనసేన పార్టీ ఏడు మూల సిద్ధాంతాలన్నారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్ని అవమానాలను భరించానో, ఎంతమందిని ప్రభావితం చేశానో, ఎన్ని సమావేశాలు పెట్టానో అందరికి తెలుసునని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సమయం అసన్నమైనందున పార్లమెంట్ స్థాయిలో కమిటీలు వేయాలని నిర్ణయించానని చెప్పారు. దీని కోసమే జిల్లా సమీక్ష అన్నారు.
మార్పు కోరుకుంటున్నారు
కులం, మతం, ప్రాంతీయతను నమ్ముకుని తాను రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. మానవత్వం కోసం రాజకీయాల్లోకి వచ్చానని, విభజించు పాలించు అనే సిద్ధాంతం ఏ రూపంలో ఉన్నా తాను వ్యతిరేకిస్తానని చెప్పారు. రాజకీయ నాయకుల మాటలకు, యువత మాటలకు చాలా తేడా కనిపిస్తోందన్నారు. మూడు దశాబ్దాల పాటు సీఎంగా చేయాలని ఒకరు, మరోసారి సీఎంగా చేయాలని మరొకరు కోరుకుంటున్నారని చంద్రబాబు, జగన్లను ఉద్దేశించి అన్నారు. రాజకీయాలతో విసిగిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు.
ప్రజారాజ్యం దెబ్బతిన్న తర్వాత
తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దెబ్బతిన్న అనంతరం ఓ పార్టీ స్థాపించి దాన్ని ఇంతదూరం నడిపించడం చాలా కష్టమైన పని అని పవన్ అన్నారు. తాను నాయకులను నమ్మి పార్టీ పెట్టలేదన్నారు. కేవలం అభిమానులు, సాధారణ కార్యకర్తలని నమ్మే జనసేన పార్టీని స్థాపించానని చెప్పారు. 2014లో జనసేనని స్థాపించినప్పుడు జగన్ సీఎం అవుతున్నాడు నువ్వేం చేస్తావని అన్నారని, కానీ తాను ముఖ్యమంత్రిని కావడానికి రాజకీయాల్లోకి రాలేదని చెప్పారు. రాష్ట్ర విబజన జరిగినప్పుడు ఒక్క నాయకుడు కూడా మనకి అండగా నోరు మెదపలేదన్నారు.
నాతోపాటు బలంగా పోరాడే వారి కోసం చూస్తున్నా
నేను ఎంతో బలంగా పోరాడేందుకు వచ్చానని, తనలా బలంగా పోరాడే వారి కోసం చూస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను అనుకోకుండా కాశీ తువ్వాలు మెడలో వేసుకుంటే అది ఈరోజు ఫ్యాషన్ అయిందని, టీ ఎక్కువగా ఇష్టం ఇప్పుడు అదే టీ గ్లాస్ మన పార్టీ గుర్తయిందని, అంటే మన ఆలోచన ఎంత బలంగా ఉంటే అంత బలంగా మనకు అన్నీ కలిసి వస్తాయని చెప్పారు. కొంతమంది తనతో మీ వద్ద డబ్బులేదు, పార్టీ నడపలేరని చెబుతున్నారని, డబ్బు అవసరమే కానీ, అంతకంటే ముందు గుండెధైర్యం కావాలన్నారు. అనుభవం విషయానికి వస్తే చంద్రబాబుకు, లోకేష్కు పుట్టగానే అనుభవం రాలేదన్నారు.
వ్యక్తిగతంగా విమర్శించలేదు
టీడీపీ నేతలను నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా విమర్శించలేదని, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఒక పరిధిలో మాత్రమే విమర్శలు చేశానని పవన్ చెప్పారు. జగన్లా చంపేయండి, చింపేయండి అనలేదన్నారు. నేతలకు బాధ్యతలు అప్పగించడంపై మాట్లాడుతూ... మీరు ఒక 10 మందిని గుర్తించి బాధ్యతలు ఇచ్చాక, వారి పనితీరు గురించి మీరు నిర్ణయించకండని, నేను చూసుకుంటాను, మీ బాధ్యత వారిని నిర్ణయించడమేనని చెప్పారు.