ఆ చిన్నారి పట్ల పవన్ ఔదార్యం: ఆర్థిక సహాయానికి హామి..
విశాఖపట్నం: విశాఖలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ ను ఓ నిరుపేద కుటుంబం కలిసి సహాయం కోసం అర్థించింది. కండరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తమ ఆరేళ్ల చిన్నారి రేవతికి ఆర్థిక సహాయం చేయాల్సిందిగా కోరింది. దీంతో చలించిన జనసేనాని తనవంతు సహాయం చేస్తానని వారికి హామి ఇచ్చారు. రేవతికి ఆర్థిక సాయంతో పాటు బ్యాటరీతో నడిచే వీల్ చైర్ జనసేన తరుపున ఇస్తామని పవన్ భరోసా ఇచ్చారు.
ఒడిలో కూర్చోబెట్టుకున్న పవన్..
రేవతి వైద్యం కోసం మైసూరుకు వెళ్లేందుకు ఆర్థిక సహాయం చేస్తానని పవన్ వారికి హామి ఇచ్చారు. కండరాల వ్యాధి కావడంతో ఆ చిన్నారి కాళ్లు చేతుల్లో పటుత్వం లేక ఇబ్బందిపడుతోంది. జనసేనాని కలిసిన సందర్భంలో చిన్నారిని రేవతిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఆ పాప ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారాయన.
చిన్నారికి పుట్టకతోనే ఈ వ్యాధి సోకిందని, వైద్యానికి చాలా ఖర్చవుతుందని వైద్యులు చెప్పినట్టుగా రేవతి తల్లిదండ్రులు పవన్ తో చెప్పారు. ప్రతీరోజు ఫిజియోథెరపీ చేయిస్తామని, లేదంటే కండరాలు బిగుసుకుపోయి ఇబ్బంది పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్ తో చిన్నారి ముచ్చట్లు
పవన్ ను కలిసిన సందర్భంగా చిన్నారి రేవతి ఆయనతో పలు విషయాలు పంచుకుంది. గబ్బర్ సింగ్ సినిమా అంటే తనకు ఇష్టమని చెప్పింది. అందులోని పాటలు, డైలాగ్స్ చెప్పి మెప్పించింది. రేవతి పాడిన అన్నమయ్య కీర్తనలు విని పవన్ సంతోషం వ్యక్తం చేశారు. కీర్తనలు ఎవరు నేర్పారు అని పవన్ అడగ్గా.. మా సంగీతం మిస్ చెప్పిందని రేవతి తెలిపింది.
ఆ కల నెరవేరింది
బ్యాటరీ వీల్ ఛైర్, మైసూరు వెళ్ళేందుకు ఆర్థిక సాయం ఇస్తామని పవన్ కల్యాణ్ భరోసా ఇవ్వడంతో మాకు చాలా ఆనందంగా ఉందని రేవతి తల్లిదండ్రులు తెలిపారు. వారికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెబుతున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ని చూడాలన్న మా పాప కల ఈరోజుతో నెరవేరిందని, పాపను ఒడిలో కూర్చోపెట్టుకొని పవన్ ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారని వివరించారు.
ఎవరీ రేవతి?
విజయవాడలో పౌరోహిత్యం చేసుకుంటూ పేదరికంలో బతుకుతున్న సత్తిరాజు విజయకృష్ణ చిన్న కుమార్తె రేవతి. పుట్టుకతోనే ఆ చిన్నారికి మస్క్యులర్ డిస్ట్రఫీ అనే వ్యాధి సోకింది. కాళ్లు, చేతులు బిగుసుకుపోవడం, మెడ ఒక పక్కకు వంగిపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది.
తగిన వైద్యం చేయించకపోతే ఆమె శరీరంలో ఒక్కో అవయవం క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు. దీంతో అంత ఖరీదైన వైద్యం చేయించలేక దాతలను సహాయం కోరుతున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ను కలిశారు. మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంవారు వైద్యం చేయిస్తామన్నారని, కానీ అక్కడికి వెళ్లేందుకు కూడా తమ ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని రేవతి తల్లిదండ్రులు తెలిపారు. పవన్ ఆర్థిక సహాయం చేస్తాననడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.