పవన్ కళ్యాన్ వద్దకు టీడీపీ నేతలు: దీక్షకు మద్దతు కోరుతూ : పార్టీ తరపున వస్తారంటూ హామీ..!
Recommended Video
టీడీపీ అధినేత చంద్రబాబు ఇసుక సమస్య..భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా నిర్వహించతల పెట్టిన దీక్షకు జనసేన మద్దతు ప్రకటించింది. చంద్రబాబు దీక్షలో పొల్గొని మద్దతు ఇవ్వాల్సిందిగా టీడీపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కోరారు. దీనికి ఆయన అంగీకరించారు. భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా చేస్తున్న పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసారు. చంద్రబాబు దీక్ష కు తమ పార్టీ నుండి ముగ్గురు నేతలు హాజరవుతారని హామీ ఇచ్చారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చంద్రబాబు 14వ తేదీ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటలకు దీక్ష చేయనున్నారు. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాన్ ఇదే అంశం పైన విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ కు టీడీపీ సైతం మద్దతిచ్చింది. దీంతో..ఇప్పుడు పవన్ సైతం టీడీపీకి మద్దతు ప్రకటించారు. అయితే, మిగిలిన పార్టీల నేతలను టీడీపీ ఆహ్వానిస్తోంది. అందులో ఎవరు వస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది.
చంద్రబాబు దీక్షకు బీజేపీ మద్దతు కోరిన టీడీపీ: పవన్ తో నేరుగా చంద్రబాబు..! కొత్త బంధాలకు వేదికగా..!
చంద్రబాబు దీక్షకు మద్దతుగా రండి...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేయనున్న నిరసన దీక్షలో పాల్గొని మద్దతు ప్రకటించాల్సిందిగా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు..వర్ల రామయ్య జనసేన అధినేత పవన్ ను కోరారు. టీడీపీ నేతలు పవన్ కు కలిసారు. చంద్రబాబు రాసిన లేఖ ను అందించారు. ఇసుక సమస్య లో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని..ఇసుక పొరుగు రాష్ట్రాలకు తరలిస్తూ..ఇక్కడ భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలకు కారణం అవుతన్నారని టీడీపీ ఇప్పటికే ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఇదే విషయాన్ని పవన్ కు సైతం టీడీపీ నేతలు వివరించారు. పవన్ కళ్యాన్ ఇప్పటికే ఇదే అంశం పైన ప్రభుత్వం..ముఖ్యమంత్రి జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ప్రభుత్వానికి రెండు వారాల సమయం ఇస్తూ డెడ్ లైన్ విధించారు. ఇప్పుడు రెండు పార్టీల డిమాండ్ ఒక్కటే కావటంతో..టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పవన్ ను కలుపుకొని ముందుకు పోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా పవన్ నిర్వహించిన లాంగ్ మార్చ్ కు మద్దతిచ్చి..ఇప్పుడు తమ దీక్షకు మద్దతివ్వాలని పవన్ ను కోరింది. దీనికి పవన్ సైతం సానుకూలంగా స్పందించక తప్పని పరిస్థితిని టీడీపీ కల్పించింది.
జనసేన నుండి హాజరు..
పవన్ కళ్యాన్ లాంగ్ మార్చ్ కు టీడీపీ నుండి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు..అయ్యన్న పాత్రుడు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పార్టీ పోరాటాలు నిర్వహించినా ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ మద్దతు ఉంటుందని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు. అందులో భాగంగానేనే జనసేనకు ఇసుక అంశం పైన పోరాటంలో మద్దతిచ్చారు. ఇప్పుడు తమ దీక్షకు రావాలంటూ తొలుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను కలిసి అభ్యర్ధించారు. అయితే, కన్నా మాత్రం తాము ఇప్పటికే ఇసుక అంశం మీద పోరాటం చేస్తున్నామని..ఎవరు పోరాటం చేసినా సంఘీభావం తెలుతామంటూ టీడీపీ అధినేత దీక్ష కు సంఘీభావం ప్రకటించారు. ఇక, ఇప్పుడు జనసేన నుండి ఆ పార్టీ నేతలు హాజరు కానున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన పోరాటానికి తమ మద్దతు ఉంటుందని వపన్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, జనసేన నుండి ముగ్గురు నేతలను చంద్రబాబు దీక్షకు మద్దతుగా పంపనున్నట్లు సమాచారం.
కలిసి పోరాటాలు కొనసాగిస్తారా..
2014 ఎన్నికల్లో టీడీపీ..బీజేపీకి మద్దతుగా పవన్ కళ్యాన్ ప్రచారం చేసారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సైతం మూడేళ్ల వరకు కలిసి ప్రయాణం చేసారు. అయితే, జనసేన ప్లీనరీలో ఒక్కసారిగా పవన్ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు..ఆయన తనయుడు లోకేశ్ మీద తీవ్ర ఆరోపణలు చేసారు. అప్పటి నుండి గ్యాప్ మొదలైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరూ విడి విడిగా పోటీ చేయటం కారణంగా వైసీపీ లాభపడిందనే భావనలో రెండు పార్టీల నేతలు ఉన్నారు. అయితే, టీడీపీలో పెరుగుతున్న వలసల నివారించేందుకు..అధికార పక్షం పైన ఒత్తిడి పెంచేందుకు పవన్ తో కలిసి నడవాలని టీడీపీ భావిస్తోంది. అయితే, ఇటు చంద్రబాబు..అటు బీజేపీతో మైత్రి కోరుకుంటున్న పవన్ కు చంద్రబాబుతో కలిస్తే బీజేపీ దగ్గరయ్యే పరిస్థితి లేదు. అయినా..టీడీపీ మాత్రం వ్యూహాత్మకంగా దగ్గరయ్యే ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇందుకు ఇసుక అంశాన్ని వేదికగా మలచుకుంటోంది. టీడీపీకి పవన్ పార్టనర్ అంటూ వైసీపీ ఇప్పటికీ విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో ఈ రెండు పార్టీల భవిష్యత్ అడుగులు ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి.