మేమున్నాం, పోరాటం తప్పదు: విద్యార్థులకు పవన్ సపోర్ట్
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిగ్రీ విద్యార్థుల సమస్యను ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేయకపోతే పోరాటం చేస్తానని హెచ్చరించారు.
Recommended Video
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిగ్రీ విద్యార్థుల సమస్యను ఏపీ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. వారికి న్యాయం చేయకపోతే పోరాటం చేస్తానని హెచ్చరించారు. ఏపీకి చెందిన ఏజీ బీఎస్సీ విద్యార్థులు మంగళవారం హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ను కలిశారు.
విద్యార్థుల డిమాండ్ సహేతుకమే..
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ అధికారుల నియామకాల్లో గతంలో ఉన్న జీవో.16నే కొనసాగించాలన్న బీఎస్సీ వ్యవసాయ విద్యార్థుల డిమాండ్ సహేతుకమైనదేనని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
3వేల మంది విద్యార్థుల సమస్య కాదు..
ఈ సమస్యను కేవలం రాష్ట్రంలోని 11 వ్యవసాయ కళాశాలల్లోని 3వేల మంది విద్యార్థులదిగా కాక.. లక్షలాది రైతులు, వారి కుటుంబాలకు చెందినదిగా భావిస్తున్నామన్నారు.
లోపం శాపంగా..
జీవో 16ను ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా చంద్రబాబునాయుడు ప్రభుత్వమే జారీ చేసిందనీ, తెలంగాణలో ఇప్పటికీ ఇదే అమలులో ఉందని తెలిపారు. ఇటీవలి జీవో 64 వల్ల సాంకేతిక పరిజ్ఞానం లేనివాళ్లు ఏదొక సర్టిఫికెట్ సంపాదించి ఉద్యోగం చేజిక్కించుకుంటున్నారని విద్యార్థులు పవన్కు వివరించారు.
ప్రతిభకు పట్టం కట్టాలి..
దీంతో స్పందించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. వ్యవసాయం లాభసాటిగా లేదని కొందరు చేనుకు దూరమవుతుంటే, అప్పులపాలై మరికొందరు ఆత్మహత్యలు చేసుకొంటున్నారన్నారు. ఈ దుస్థితి పోవాలంటే నిపుణులైన వ్యవసాయ అధికారుల అండ అవసరమని చెప్పారు. అలాంటి అధికారులు రావాలంటే ప్రతిభకు పట్టం కట్టాలని స్పష్టం చేశారు.
అధికారాలు లేకపోవడం శోచనీయం..
మేలైన వ్యవసాయ విద్య అందాలంటే ఐసీఏఆర్ లాంటి సంస్థల అజమాయిషీ తప్పనిసరనీ, అయితే ఆ సంస్థకు చట్టబద్ధమైన అధికారం కల్పించలేదని చెప్పారు. బీసీసీఐ లాంటి సంస్థలు అనధికారికంగా ఏర్పాటైన రాజ్యమేలుతుంటే ఐసీఏఆర్కు ఆపాటి అధికారాలు లేకపోవడం శోచనీయమన్నారు.
పోరాటం తప్పదు..
తప్పుడు పత్రాలతో వ్యవసాయశాఖలో ఉద్యోగాలు పొందినవారిపై తక్షణ విచారణకు డిమాండ్ చేశారు. సమస్యకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించని పక్షంలో జనసేన తనవంతు పాత్రను పోషిస్తుందని, పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.