పరిస్థితి చేజారాక, ఎదుర్కోవాల్సిందే: చంద్రబాబుపై మళ్లీ పవన్ కళ్యాణ్
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రజా విశ్వాసం కోల్పోయారన్నారు. ప్రజల భావోద్వేగాలతో టీడీపీ చెలగాటమాడిందన్నారు.
పరిస్థితులు చేజారిన తర్వాత అవిశ్వాస తీర్మానం విషయమై చంద్రబాబు మేల్కొన్నారని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితులను చంద్రబాబు ఎదుర్కోవాల్సిందే అన్నారు. హోదా ఇస్తానని చెప్పి మోడీ ఇవ్వలేదని మండిపడ్డారు.
అంతకుముందు కూడా పవన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమన్నారు. 25 కోట్ల మంది ఎంపీలను భయపెడితే 5 కోట్ల మంది ప్రజలు భయపడరని చెప్పారు. కేంద్రంపై పోరాటంలో అవసరమైతే ప్రాణాలు అర్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మారుస్తోందని, ఈ వైఖరి సరికాదన్నారు.
ప్రత్యేక హోదా గురించి నాడు సభలో అడిగిన వారి హోదాలు పెరిగాయే తప్ప రాష్ట్రానికి వచ్చిందేమీ లేదన్నారు. నిన్నటి వరకు వైసీపీ తనను టీడీపీ మనిషి అన్నదని, ఇప్పుడు టీడీపీ నేతలు తనను బీజేపీ, జగన్ మనిషిని అంటున్నారని విమర్శించారు.