అమిత్ షా లేఖ, టీడీపీ-వైసీపీలను దులిపేసిన పవన్ : 'అవినీతిని ప్రశ్నిస్తే బాబు కలరింగ్'
హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా రాసిన తొమ్మిది పేజీల లేఖ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం అన్నారు. హోదా విషయంలో మొదటి నుంచి టీడీపీ, వైసీపీల వ్యవహారశైలి సరిగా లేదని విమర్శించారు.
'మోడీ గ్రాఫ్ తగ్గిందనే, జగన్ లైన్లోకి చంద్రబాబు, ఆ రోజు వైసీపీ ఎంపీల రాజీనామా'
సీపీఎం, సీపీఐ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం సిపిఎం మధు, సీపీఐ రామకృష్ణలతో కలిసి మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎన్నోసార్లు మాట మార్చిందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సరిగా పోరాటం చేయలేదని ఆయన తెలిపారు. టీడీపీ సర్దుకుపోయే ధోరణి వల్లే ఏపీకి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.
అమిత్ షా లేఖపై స్పందించాల్సిన అవసరం లేదు
అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షులు అని, కాబట్టి ఆయన లేఖపై స్పందించాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. బీజేపీ అధ్యక్షులు లేఖ రాస్తే నేను ఎలా స్పందిస్తానని వ్యాఖ్యానించారు. అమిత్ షా లేఖను సీరియస్గా తీసుకోనక్కరలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా వస్తే మాట్లాడవచ్చునని అభిప్రాయపడ్డారు.
హోదా విషయంలో పదేపదే మాట మార్చారు
ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుంచి తాను మాట్లాడుతున్నానని, మిగతా వారు కూడా అలాగే మాట్లాడాలని చెప్పానని పవన్ అన్నారు. టీడీపీ, వైసీపీల వైఖరి సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, హోదా విషయంలో పదేపదే మాట మార్చారన్నారు. బీజేపీతో టీడీపీ కాంప్రమైజ్ కావడం ఏపీని దెబ్బతీసిందన్నారు.
రాజీనామాలు చేసినా నష్టం జరిగిపోయింది
రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పేమిటంటే.. వేల కోట్లు ఖర్చు చేసి పుష్కరాలు నిర్వహించడం సరికాదని పవన్ కళ్యాణ్ అన్నారు. నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేసిందన్నారు. ప్రతిసారి బీజేపీని టీడీపీ వెనుకేసుకు వచ్చిందన్నారు. ఇప్పుడు వారు రాజీనామాలు చేసినా, చేయకపోయినా జరగాల్సిన నష్టం జరిగిందన్నారు. ఇన్ని మాటలు మార్చిన వారు రేపు న్యాయం చేస్తారనే నమ్మకం లేదన్నారు.
అమరావతి ప్రజల రాజధానిలా లేదు
అమరావతి తెలుగుదేశం పార్టీకి చెందిన రాజధానిలా ఉందని పవన్ వ్యాఖ్యానించారు. ప్రజల రాజధానిలా లేదన్నారు. అభివృద్ధి, ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టాల్సింది పుష్కరాల కోసం ఖర్చు చేశారన్నారు. అవినీతి అంశంపై మాట్లాడుతూ.. ఎవరైనా చట్టానికి లోబడి ఉండాలన్నారు. ఎవరూ రాజ్యాంగానికి, చట్టానికి అతీతులు కాదన్నారు.
అవినీతిని ప్రశ్నిస్తే తనపై దాడి చేసినట్లు బాబు కలర్
సీపీఐ రామకృష్ణ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. అవినీతి విషయంలో చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. మీరు చేతకాని దద్దమ్మలా అని మండిపడ్డారు. ఎక్కడ అవినీతి జరిగినా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఇప్పుడు అవినీతి గుర్తుకు వచ్చిందా అని అభిప్రాయపడ్డారు. అవినీతిపై డ్రామాలు వద్దని, ఎవరైనా శిక్షించాల్సిందే అన్నారు. చంద్రబాబు అవినీతిని ప్రశ్నిస్తే ఏపీపై దాడి జరిగినట్లు కలర్ ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
ఏపీ కొత్త రాజకీయం కోరుకుంటోంది
సీపీఎం మధు మాట్లాడుతూ.. బీజేపీ, టీడీపీలు కనీస కర్తవ్యాలు నెరవేర్చలేదన్నారు. అమిత్ షా లేఖ అంతా బుకాయింపు అన్నారు. నాలుగేళ్లుగా టీడీపీ, బీజేపీలు వాస్తవాలను ప్రజలకు చెప్పలేదన్నారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని, ఇలాంటప్పుడు పవన్ వచ్చారని చెప్పారు. రైతులకు సరైన ధర లేదని, భూములను బలవంతంగా లాక్కుంటున్నారన్నారు. తామంతా చివరిదాకా కలిసి ఉంటామన్నారు. యూనివర్సిటీలకు రూ.12వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేస్తే రూ.400 కోట్లు ఇచ్చారన్నారు. బీజేపీ, టీడీపీ నేతలు బాధ్యతలను విస్మరించారన్నారు. వైసీపీ పట్టించుకోలేదన్నారు. ఏపీ కొత్త రాజకీయం కోరుకుంటోందన్నారు. టీడీపీ కనీసం నాలుగేళ్లుగా అఖిలపక్షం వేయలేదన్నారు. హోదా విషయంలో టీడీపీ, బీజేపీ నేరస్తులు అన్నారు. బాబు అవినీతిని ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన దాడి జరిగినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.