అందుకే ‘మన నుడి.. మన నది’: పవన్ కళ్యాణ్ పిలుపు
అమరావతి: మన భవితకు ప్రాణాధారమైన మాతృ భాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతామని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరమన్నారు.
మన నుడి.. మన నది..
మాతృ భాషను, నదులను పరిరక్షించుకొనే దిశగా 'మన నుడి... మన నది' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. విషయమై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. నాగరికతకు పుట్టినిల్లు నది. నది లేనిదే సంస్కృతి లేదు. నది నశించాక ఆ సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో కావలసినన్ని రుజువులున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
విషమయం చేస్తున్నాం..
‘నాగరికతకు అమ్మ ఒడి నుడి. భాష లేనిదే సంస్కృతి లేదు. మాతృభాష గతించాక సంస్కృతి మిగలదు. దీనికి చరిత్రలో బోలెడు రుజువులు కనిపిస్తాయి. మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నాం' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ పిలుపు..
‘మన భవితకు ప్రాణాధారమైన అమ్మనుడికీ మనం అతివేగంగా దూరమవుతున్నాం. మాతృ భాష మూలాలను మనమే నరికేసుకుంటున్నాం. మన నుడినీ, మన నదిని కాపాడుకోవాలి. అందుకే విజ్ఞులు, మేధావులతో ఈ అంశంపై చర్చించాం. మాతృ భాషను పరిరక్షించుకోవాలి. మన నదులను కాపాడుకోవాలి' అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలవారినీ భాగస్వాముల్ని చేసేలా ‘మన నుడి... మన నది' కార్యక్రమం చేపడుతున్నాం. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.
తెలంగాణ సమ్మెపై పవన్ కళ్యాణ్
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కార్మిక సంఘాల నేతలు ప్రకటించిన నేపథ్యంలో వారి వినతిని మన్నించి కార్మికులపై సానుభూతితో ఎలాంటి ఆంక్షలు లేకుండా విధుల్లోకి చేర్చుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్కు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా తమ ప్రతినిధుల ద్వారా కార్మిక సంఘాల నాయకులూ కోరారని తెలిపారు. నలభై రోజులకుపైగా సమ్మెలో ఉన్న కార్మికులు తిరిగి విధులకు హాజరయ్యే క్రమంలో వారికి కుటుంబ పెద్దగా రాష్ట్ర సీఎం తగిన భరోసా ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తద్వారా ప్రజా రవాణా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని, ఆపై సానుకూలంగా వారి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాల్సిందిగా కోరుతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు.