జనసేన ఉత్సాహం: పవన్ కళ్యాణ్ ఆవేశంలో అర్థముంది, బీజేపీ మౌనం
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఆయన ఆవేశంలో అర్థం ఉందని కొందరు, రాజకీయమని ఇంకొందరు చెబుతుండగా.. మరికొందరు పవన్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. ముఖ్యంగా లోక్సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ పవన్ వ్యాఖ్యలను స్వాగతించారు.
గురువారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. రైతుల భూములు బలవంతంగా లాక్కుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని ప్రకటించారు. పవన్ విమర్శలు, హెచ్చరికలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి.
మద్దతిచ్చిన పార్టీకే ఆయన సవాళ్లు విసరడం పైన చర్చ జరుగుతోంది. శుక్రవారం నాడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రభుత్వానికి చివాట్లు పెట్టారు. అయితే, తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేదని, దిగజారుడు రాజకీయాలకు పాల్పడనని, పాలకుల లోపంతో భవిష్యత్తు తరాలపై ఇబ్బంది పడవద్దనేదే తన ఉద్దేశ్యమన్నారు. ప్రత్యేక హోదా పైన బీజేపీకి కూడా చురకలంటించారు.
జనసేన
పవన్ కళ్యాణ్ మరోసారి రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో పాటు... ఇక నుండి తాను రైతుల తరఫున న్యాయం జరిగే వరకు పోరాడుతానని చెప్పారు. ఇది జనసేన క్యాడర్కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.
తెలుగుదేశం పార్టీ
తమ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్ పైన టీడీపీ నేతలు భిన్నంగా స్పందించారు. మంత్రి నారాయణ వంటి వారు ఘాటుగా స్పందించారు. గాలి ముద్దుకృష్ణమ నచ్చ చెబుతామన్నారు. ఇక అచ్చెన్నాయుడు వంటి నేతలు ఆయన రాజకీయాలకు కొత్త అని, ఆయనకు తెలియదని చెప్పారు. అయితే, రాజధాని విషయంలో వెనక్కి పోయే పరిస్థితి మాత్రం లేదని సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.
వైయస్సార్ కాంగ్రెస్
రాజధాని ప్రాంతంలో పవన్ పర్యటనను.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి కుట్రపూరితమైనదిగానే భావిస్తోంది. జగన్ను కార్నర్ చేసే ఉద్దేశ్యంతో ఈ పర్యటన అని భావించింది.
స్వాగతించిన లోక్సత్తా, బీజేపీ మౌనం
లోక్సత్తా పార్టీ నేత జయప్రకాశ్ నారాయణ.. రాజధాని ప్రాంతంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను స్వాగతించారు. అయితే, బీజేపీ మాత్రం దీనిపై ఇంకా మౌనం దాల్చిందనే చెప్పవచ్చు. అయితే, ఎంపీ హరిబాబు మాత్రం పవన్ వ్యాఖ్యలను స్వాగతించారు.
పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ పర్యటన ఉద్దేశ్యపూర్వకంగానే జరిగిందని కొందరు భావిస్తున్నారు. చంద్రబాబు లేదా బీజేపీ ప్లాన్లో భాగంగా ఇది జరగవచ్చునని అంటున్నారు. అయితే, ఆయన వ్యాఖ్యలను బట్టి అలా కనిపించడం లేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఆవేశంలో, ఆగ్రహంలో అర్థముందని, ప్రభుత్వం రైతుల ఆవేదనను అర్థం చేసుకోకపోవడంతో ఆయన రంగంలోకి దిగారని అంటున్నారు. రైతులు కూడా పవన్ పైన విశ్వాసం వ్యక్తం చేశారు. పవన్తో తమకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని వారు గురువారం చెప్పారు. రైతుల ఆవేదన స్వయంగా చూసిన పవన్... ఆవేశంతో ఊగిపోయారని, అందులో అర్థముందని చెబుతున్నారు.