బాబూ! మీకు అండగా ఉంటా: ఐటీ సోదాలపై పవన్ కళ్యాణ్ మెలిక! మళ్లీ చిరంజీవి ప్రస్తావన
ధవళేశ్వరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఆదాయపన్ను శాఖ సోదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. చేయాల్సిన తప్పులు చేసి డొంకలో దాక్కుంటే పిడుగుపాటు తప్పదని హెచ్చరించారు. నేను అన్నింటికి తెగించి వచ్చిన వాడినని చెప్పారు. మేం సున్నిహితంగా, మెత్తగా ఉంటామేమో కానీ ఊరుకునేది లేదన్నారు. చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ తమకు ఆదర్శమని చెప్పారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదన్నారు.
నన్ను గుర్తుంచుకోండి: అభిమానులకు పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు చురకలు
మనం గెలిపించిన ఓ ఎమ్మెల్యే (చింతమనేని ప్రభాకర్) పవన్ ఇక్కడ సభ ఎలా పెడతారో చూస్తానని హెచ్చరించారని మండిపడ్డారు. 2014లోనే తమకు బలం ఉందన్నారు. ఓ మహిళను, వనజాక్షి అనే ఎమ్మార్వోను జుత్తు పట్టుకొని కొడితే పట్టుకోలేదన్నారు. దళితతేజం అని చెబుతున్నారని, కానీ ఎక్కడ అన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తిని కొనసాగించడం లేదన్నారు. నారా లోకేష్ అనుభవం ఎంత, ఆయన వయస్సు ఎంత, లోకేష్ సోదరిని వనజాక్షిలా అవమానిస్తే మీరు ఊరుకుంటారా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
మోడీ అయినా పోరాడుతా
బీజేపీ అంటే భారతీయ జగన్ పవన్ పార్టీ అని చెబుతారని, కానీ ఆ బీజేపీని మొదట దుమ్మెత్తిపోసింది మేమే అని పవన్ చెప్పారు. కాకినాడకు వచ్చి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని నేను విమర్శిస్తే, దానిని వేడి చేసుకొని తింటామన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారని విమర్శించారు. నేను ఆ రోజు మాట్లాడితే చంద్రబాబు మాట్లాడలేదని, ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ ప్రధాని కాబట్టి గౌరవం ఇస్తామని చెప్పారు. అన్యాయం జరిగితే తాను ఎలాంటి వ్యక్తి పైన అయినా పోరాడుతానని చెప్పారు. బీజేపీనే నేనెప్పుడు వెనుకేసుకు రాలేదన్నారు.
మీ ఆఫీసులో సోదాలు చేస్తే నేను మీకు అండగా ఉంటా!
ప్రభుత్వ కార్యాలయాల మీద, చీఫ్ సెక్రటరీ పైన దాడి చేస్తే, మీ పైన (చంద్రబాబు) దాడి చేస్తే రాష్ట్ర ప్రజల కోసం మేం మీకు అండగా ఉంటామని పవన్ చెప్పారు. కానీ ఎక్కడో ఐటీ సోదాలు జరిగితే, వ్యాపారస్తులైన మీ ఎంపీల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగితే మీపై దాడి ఎలా అవుతుందని ప్రశ్నించారు. చాలా అంశాల్లో టీడీపీతో విభేదించినప్పటికీ, ప్రభుత్వ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగితే మీకు అండగా ఉంటానని చంద్రబాబుకు చెబుతున్నానని అన్నారు.
చెయ్యాల్సిందంతా చేసి మాట్లాడుతావా?
చెయ్యాల్సిన స్కాంలు చేసి, చెయ్యాల్సిన దోపిడీలు చేసి ఐటీ స్కాంల పైన చంద్రబాబు మాట్లాడితే ఎలా అని పవన్ అన్నారు. కచ్చితంగా దోపిడీ చేశారన్నారు. ప్రత్యేక హోదాపై గతంలో చంద్రబాబు ఒక్కసారి అడగలేదని చెప్పారు. హోదాపై నిజంగానే బాధ ఉంటే తనను పిలువొచ్చు కదా అన్నారు. నేను లక్షలాది మంది సమక్షంలో మాట్లాడుతున్నానని, హోదాపై అఖిలపక్షం పెట్టండని, అందరం కలిసి ఢిల్లీపై పోరాడుదామన్నారు.
ఆరోపణలపై క్లీన్గా బయటకు రా, డొంకలో దాక్కుంటే పిడుగుపాటే
తనపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు క్లీన్గా బయటకు రావాలని పవన్ అన్నారు. చేయాల్సిన తప్పులు చేసి డొంకలో దాక్కుంటే పిడుగుపాటు తప్పదని హెచ్చరించారు. నాకు ప్రధాని అంటే భయమేం లేదని అన్నారు. గౌరవం ఉంటుంది కానీ పోరాడేందుకు సిద్ధమన్నారు. ఢిల్లీ వీధుల్లో పోరాటం చేద్దామని సవాల్ చేశారు. నేను బాధ్యత కలిగిన వ్యక్తిని అని చెప్పారు. బీజేపీని మొదట కడిగేసింది, ఏకిసింది జనసేన అన్నారు. మోడీ మాకేమైనా బంధువా అన్నారు. తప్పు చేయకుంటే మీరు ఎందుకు భయపడుతున్నారని, ప్రధానిని ప్రత్యేక హోదాపై నిలదీద్దాం రండి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై టీడీపీ మాట మార్చిందన్నారు.
అన్నయ్య చిరంజీవిని వదిలేసి వచ్చా
ఓ ఎమ్మెల్యే పదిమంది గూండాలను పెట్టుకుంటే, లక్షలాది మంది అభిమానులతో తాను కడప, అనంతపురం, గోదావరి జిల్లాకు రాగలనని, ప్రజాప్రతినిధులు బాధ్యతగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. నేను బెదిరింపులకు భయపడి పారిపోయే వ్యక్తిని కాదని చెప్పారు. దోపిడీలు, దారుణాలపై చంద్రబాబు మాట్లాడలేకపోతున్నారన్నారు. తాను తన సొంత అన్నయ్య చిరంజీవిని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడ సెజ్ అంశంపై మాట్లాడారు. ఎక్కడకు వెళ్లినా వ్యక్తులు, కుటుంబాలు బాగుపడుతున్నారు కానీ, సమాజం బాగుపడటం లేదన్నారు. అన్యాయం జరుగుతోందని కారల్ మార్క్స్, మావో వచ్చి చెప్పాలా అన్నారు. మీ రాజకీయ వ్యవస్థకు తెలియదా అన్నారు. ఇలాంటప్పుడు ప్రజాపోరాటాలు ఎందుకు రావన్నారు. ఆయుధాలతో వస్తే మేం బెదిరేది లేదని చెప్పారు. హింస వల్ల పరిష్కారం ఉండదన్నారు. సీఎం కావాలనుకుంటున్న లోకేష్ ప్రజా సమస్యలు తెలుసుకుంటే మంచిదన్నారు.