పవన్ కల్యాణ్ గడ్డం పెంచితే నేత కాలేరు, మనుషులు వేరు వారి మనసంతా ఒక్కటే: అమర్నాథ్
అమరావతి రాజధాని మార్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్నది కృత్రిమ ఉద్యమమేనని వైసీపీ నేతలు ఆరోపించారు. అమరావతిలో తమ జాతి, తమ నేతల భూముల కోసమే చంద్రబాబు పోరాడుతున్నారని మండిపడ్డారు. తన వర్గం కోసం పోరాడుతున్న చంద్రబాబు నాయుడు తమ ఉద్యమాన్ని గాంధీ తరహాలో పోల్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖపట్టణంలో వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు.
నైతిక హక్కు లేదు..
అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే రాజధాని మార్పు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తారనే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న వారు ఉత్తరాంధ్రలో అడుగుపెట్టే హక్కు కోల్పోయారని చెప్పారు. చంద్రబాబు నాయుడు, కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కల్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటించే నైతిక హక్కు కోల్పోయారని మండిపడ్డారు.
టీడీపీ కార్యకర్తలా..?
కమ్యునిస్టులు కూడా ఉద్యమంలో భాగస్వామ్యులు కావడం ఏంటో అర్థం కావడంలేదన్నారు. వారు కూడా టీడీపీ కార్యకర్తలుగా మారిపోయారా అని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి అవసరం లేదా అని ప్రశ్నించారు. 8 లక్షల ఎకరాల సాగు కోసం చేపట్టే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏం కావాలి అని అమర్నాథ్ ప్రశ్నించారు. రూ.60 వేల కోట్లతో రాయలసీమకు సాగునీరు తీసుకొచ్చే ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అని అడిగారు. కీలక అంశాలు కాకుండా అమరావతికి రూ.లక్ష కోట్లు కేటాయించాలా అని ప్రశ్నించారు.
వైసీపీ వ్యతిరేక పోరాటమా..?
కమ్యునిస్టులు కూడా చంద్రబాబు నాయుడు సిద్ధాంతాల్లో నడుస్తున్నారాని అమర్ నాథ్ ఆరోపంచారు. పనిలోపనిగా పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించారు. తాము బీజేపీ, టీడీపీతో కలిసి ఉంటే వైసీపీకి లాభం జరిగి ఉండేది కాదని చెప్పడం ఆయన అవివేకానికి నిదర్శమని మండిపడ్డారు. అంటే మీరు వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారా..? రాష్ట్ర ప్రయోజనాలు పట్టావా అని విరుచుకుపడ్డారు.
మనసంతా ఒక్కటే..
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో వారు మనషులు వేరు మనసంతా ఒక్కటేనని అర్థమైందని గుడివాడ అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు వ్యతిరేక ఓట్లు మలుచుకుందామని ప్రయత్నించడంతో కాస్త మేలు జరిగిందని.. కలిసి పోటీ చేస్తే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. జనసేనకు ఒక్క సీటు కూడా రాకపోయేదన్నారు. టీడీపీకి 23కి బదులు 2 లేదంటే 3 సీట్లు వచ్చేవని చెప్పారు.
గడ్డం పెంచితే
గడ్డం పెంచుకున్నంతా మాత్రానా తాను అల్లూరి సీతారామరాజు, చెగువేర అయిపోరని అమర్నాథ్ అన్నారు. గడ్డం పెంచాక నాయకులు కారని, పెంచకపోయినా ప్రజా నేతలు అవుతారనే విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తుంచుకోవాలని సూచించారు.