ఎదురుపడిన చంద్రబాబు-పవన్ కళ్యాణ్: 'నేను చిరంజీవిని కాదని వస్తే, మీరేం చేశారు!'
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఎదురెదురుగా తారసపడ్డారు. ఓ పెళ్లి నిశ్చితార్థ వేడుకలో వీరు ఇరువురు ఎదురుపడ్డారు. ఈ వేడుకకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కూడా హాజరయ్యారు.
భారతిపై కేసులు ఉండేవా, మావి సరే, మీ ఎన్నికల మాటేమిటి: వైవీ, వంగవీటి రాధా ఇష్యూపై..
వియ్యమందిన వైసీపీ, టీడీపీ నేతలు
తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత తోట త్రిమూర్తులు, కృష్ణా జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను సోదరుడి మధ్య వియ్యం కుదిరింది. ఈ వేడుకకు వారు హాజరయ్యారు. ఉదయభాను సోదరుడు రవి కూతురు ప్రత్యూషతో త్రిమూర్తులు కొడుకు పృథ్వీరాజ్కు గురువారం నిశ్చితార్థం జరిగింది.
హాజరైన ప్రముఖులు
ఈ నిశ్చితార్థ వేడుకకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, పలువురు మంత్రులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తదితరులు హాజరయ్యారు.
వేడుకలో పవన్, చంద్రబాబు
ఈ వేడుకలో ఎదురుపడ్డారని, చంద్రబాబు, పవన్లు చిరునవ్వుతో పలకరించుకున్నట్లుగా తెలుస్తోంది. 2014లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్... ఇటీవల టీడీపీపై నిప్పులు చెరుగుతోన్న విషయం తెలిసిందే. చంద్రబాబును, నారా లోకేష్ను ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరు ఎదురుపడటం ఆసక్తిని రేపింది.
చిరంజీవి ఉన్న పార్టీని కాదనుకొని
కాగా, చంద్రబాబుపై ఇదేనా మీ అనుభవం అంటూ జనసేన పార్టీ ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను పొందుపర్చింది. 'నాకు జీవితాన్ని ఇచ్చిన నా అన్నయ్య చిరంజీవి గారు ఉన్న కాంగ్రెస్ పార్టీని కాదనుకొని టీడీపీకి మద్దతు ఇస్తే ఈ రోజు వారు కాంగ్రెస్ పార్టీతో కలిశారు. ఇదేనా మీ అనుభవం ముఖ్యమంత్రి గారూ' అని పవన్ పేర్కొన్న వ్యాఖ్యలను జనసేన పేర్కొంది. ఇదిలా ఉండగా, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో శుక్రవారం సాయంత్రం చేరారు. అంతకుముందు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నాదెండ్ల తనకు అన్నలాంటి వాడని చెప్పారు. పలుమార్లు కలిశారని, ఇష్టం వచ్చినప్పుడు పార్టీలోకి రావాలని చెప్పానని అన్నారు. బలమైన ఆలోచన, లోతైన విశ్లేషణ ఉన్న వ్యక్తి అన్నారు.