బాబుపై పవన్ కళ్యాణ్ ఒత్తిడి! అశోక్ ఆఫర్: 'హోదా'పై ఈసారీ అంతే!!
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయమై జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఇటీవల సూచనలు చేశారు. ప్రెస్ మీట్లో, ట్విట్టర్లో టిడిపి ఎంపీల పైన పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
ఆయన ప్రశ్న ఏపీ సిఎం నారా చంద్రబాబు నాయుడు పైన మరింత ఒత్తిడి పెంచిందని చెప్పవచ్చు. ఆ ఉద్దేశ్యంతోనే చంద్రబాబు కొద్ది రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఏపీకి రావాల్సిన అంశాలపై పట్టుబట్టాలని ఎంపీలకు, పార్టీ కేంద్రమంత్రులకు సూచించారు.
ఆ సమయంలో కేంద్రమంత్రి, టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అసంతృప్తికి గురై, తాను ప్రయత్నం చేస్తానని, లేదంటే తనను అనవద్దని, అవసరమైతే రాజీనామా చేస్తానని చంద్రబాబుకు ఆఫర్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ ఎంపీలను ప్రశ్నించడం వల్లనే, చంద్రబాబు పైన మరింత ఒత్తిడి పెరిగిందని, దాంతో ఆయన ఎంపీలకు గట్టిగా చెప్పారని, మనస్తాపానికి గురైన అశోక్ రాజీనామా చేస్తానని చెప్పి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీకి ప్రత్యేక హోదాను సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దీనిపై బిజెపి కాలయాపన చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, తాము నెరవేరుస్తామని కమలం పార్టీ చెబుతోంది. మరోవైపు, ఏపీ కాంగ్రెస్, టిడిపి, వైసీపీలు ప్రత్యేక హోదా కోసం అప్పుడప్పుడు డిమాండ్ చేస్తున్నాయి.
పవన్ ప్రశ్న, చంద్రబాబు ఒత్తిడి, అశోక్ గజపతి రాజు రాజీనామా ఆఫర్ నేపథ్యంలో.. పార్లమెంటు సమావేశాల్లో ప్ర్తత్యేక హోదా కోసం టిడిపి ఎంపీలు ఎంత వరకు పోరాడుతారనే విషయమై చూడాల్సి ఉంది. అలాగే, కాంగ్రెస్ పార్టీకి ఏపీ నుండి ఎంపీలు లేకపోయినప్పటికీ అధిష్టానాన్ని ఒప్పించి బిజెపిని నిలదీయాల్సి ఉంటుంది.
బిజెపికి కూడా ఏపీ నుండి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఇతర పార్టీల నుండి డిమాండ్ వస్తే సభలో వారు ఏం చేస్తారనేది ప్రశ్నే కావొచ్చు. అయితే, తాము ప్రత్యేక హోదా ఇస్తామని బిజెపి చెబుతున్నందున అదే మాట పల్లె వేసే అవకాశాలు ఉంటాయి.
ప్రత్యేక హోదాపై ఈ సమావేశాల్లో స్పష్టత రాకపోవచ్చు
ఏపీకి ప్రత్యేక హోదా పైన ఈ పార్లమెంటు సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశాలు తక్కువే అని చెప్పవచ్చు. బిజెపి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సుముఖంగానే ఉందని అంటున్నారు. అయితే, బీహార్ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల నుండి డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుతం వెనక్కి తగ్గుతోందని చెబుతున్నారు.
ముఖ్యంగా బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదా పైన స్పష్టత రాకపోవచ్చునని చెబుతున్నారు. బీహార్ ఎన్నికల అనంతరం.. మిగతా రాష్ట్రాలను ఒప్పించే ప్రయత్నం చేసి, ఏపీకి ప్రత్యేక హోదా లేదా ప్రత్యామ్నాయం చూడవచ్చునని చెబుతున్నారు.