చిరంజీవిని నాశనం చేశావ్, ఏంచేశాడంటే: పవన్ కళ్యాణ్పై రోజా షాకింగ్, అల్లు అరవింద్పైనా (వీడియో)
Recommended Video
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, మహిళా నేత రోజా గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు. అసలు చిరంజీవిని మోసం చేసిన వారిలో పవన్ కళ్యాణే మొదటి వరుసలో ఉంటారని చెప్పారు.
ఆమె మాట్లాడుతూ.. తన అన్నయ్య చిరంజీవిని మోసం చేసిన వారిని వదిలి పెట్టనని పవన్ కళ్యాణ్ చెబుతున్నారని, కానీ అందులో మీ కుటుంబ సభ్యులే ఉన్నారని ధ్వజమెత్తారు. ఆ తర్వాత ఇతరులు ఉన్నారని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ ఏం చేశారో చెప్పారు.
చిరంజీవిని మోసం చేసిన వారి లిస్ట్ ఇదే!
చిరంజీవిని మోసం చేసిన వారిలో మొదట ఉండేది పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అని రోజా అన్నారు. ఛానల్స్ కూడా ఉన్నాయని చెప్పారు. అలాంటి పవన్ కళ్యాణ్ తన అన్ని చిరంజీవిని మోసం చేసిన వారిని వదిలి పెట్టనని చెప్పడం విడ్డూరమన్నారు.
ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే, క్షమించమని వేడుకో
చిరంజీవి ముఖ్యమంత్రి అవుతాడని భావించి పవన్ కళ్యాణ్ అప్పుడు బాగా ప్రచారం చేశారని రోజా వ్యాఖ్యానించారు. కానీ కేవలం 18 సీట్లు వచ్చి, గెలవకపోయేసరికి ఆయన (పవన్) పాటికి ఆయన సినిమా షూటింగులకు వెళ్లారని ఆరోపించారు. సీట్లు తక్కువ వచ్చినా చిరంజీవి కోసం, ప్రజారాజ్యం కోసం పని చేయలేదన్నారు. చిరంజీవిని గాలికి వదిలేశావు అన్నారు. క్షమించమని నీ అన్నయ్యను వేడుకో అన్నారు.
పవన్ నిన్ను నీవు శిక్షించుకో, చిరంజీవిని నాశనం చేశారు
ఆ రోజు పరుగెత్తుకు వచ్చి యువరాజ్యానికి అధ్యక్షుడిగా వ్యవహరించి, ఎన్నికల తర్వాత చిరంజీవిని వదిలేశావని పవన్ కళ్యాణ్పై రోజా మండిపడ్డారు. అందుకు నిన్ను నీవు శిక్షించుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. మీ రందరూ కలిసి చిరంజీవిని నాశనం చేసి ఇంటికి పంపించి, ఈ రోజు ఎవరో చేశారని వాళ్లను వదిలిపెట్టనని చెప్పడం హాస్యాస్పదం అన్నారు.
ఇక్కడ పుట్టి, నాకు తెలియదు అంటావా
ఈ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకు, చేతలకు సంబంధం లేదని రోజా అన్నారు. కృష్ణానదిలో ఓ బోటు బోల్తా పడిందన్న విషయం ఎక్కడో లండన్లో ఓ విద్యార్థి చెబితే తెలిసిందంటే అంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా అన్నారు. ఒక పార్టీ పెట్టి పెట్టి ప్రజల కోసం పోరాడుతాను, ప్రశ్నిస్తానన్న పెద్ద మనిషి ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో ఉంటూ, నాకు తెలియలేదు, ఎవరో అడిగితే ఆలోచిస్తున్నాను అని చెప్పడం ఏమిటన్నారు.
ఆడవారి మీద గౌరవం లేదా
ఇటీవల పేపర్లో ఓ వార్త వచ్చిందని, ఎక్కువ మంది మహిళలను వ్యభిచార కూపంలోకి దించే దాంట్లో నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అని ఉందని, ఈ విషయం ప్రభుత్వానికి, దానికి మద్దతిస్తున్న పవన్ కళ్యాణ్కు సిగ్గుచేటు అన్నారు. మరి ఆయనకు ఆడవారి మీద గౌరవం లేదా అని ప్రశ్నించారు.
జగన్ నీలా షూటింగ్ గ్యాప్లో రావడం లేదు
తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. పవన్ కళ్యాణ్లా వీలు చిక్కినప్పుడు ప్రజల్లోకి రావడం లేదని రోజా అన్నారు. ఆయనలా షూటింగ్ గ్యాప్లలో వచ్చి సమస్యలపై జగన్ పోరాడటం లేదని ఎద్దేవా చేశారు. జగన్ నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారని, వారి కోసం కొట్లాడుతున్నారని చెప్పారు.