భారత్ మాతాకీ జై: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక..! చిరు అప్పుడేనా?
విజయవాడ: మెగా సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్లు ఒకేరోజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా బిజెపిని బలపరుస్తున్నట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు, చిరంజీవి రిటైర్మెంట్ గురించి మాట్లాడటం చర్చనీయాంశమైంది.
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆదివారం వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. 2019లో పోటీ చేస్తానని చెప్పడం ద్వారా ఆయన మరో మూడేళ్ల పాటు రాజకీయాలకు తాను దూరమేనని చెప్పారని అంటున్నారు.
అప్పటి దాకా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రనే పోషిస్తారని చెప్పవచ్చు. ప్రశ్నించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఆయన బయటకు వస్తారని అభిమానులు, ఇతరులు భావిస్తున్నారు. గత రెండేళ్లలో ఆయన బయటకు వచ్చి వివిధ సందర్భాలలో ప్రశ్నించిన సందర్భాలున్నాయి.
ఇక, పవన్ కళ్యాణ్ ఇంకా బిజెపి వైపే ఉన్నారని ఆయన మాటల ద్వారా తేటతెల్లమవుతోందని అంటున్నారు. మంచి వ్యక్తి ప్రధానిగా ఉండాలనే ఉద్దేశ్యంతో నరేంద్ర మోడీకి మద్దతిచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రత్యేక హోదా తనకు గుర్తుందని చెప్పారు. కానీ బిజెపిని టార్గెట్ చేయలేదు. హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇటీవల చర్చనీయాంశమైన భారత్ మాతాకీ జై నినాదం పైన కూడా ఆయన ఆచితూచి స్పందించారు. ఇలాంటి వివాదాలు హాస్యాస్పదమని, దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా దేశభక్తి ముఖ్యమని, దేశంలో ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, మతాలు ఉన్నప్పటికీ దేశమంటే మాతృభూమి అని, భారత్ మాతాకీ జై అనడంలే తప్పేమీ లేదన్నారు. పై వ్యాఖ్యలను చూస్తుంటే పవన్ కళ్యాణ్ బిజెపికి ఇంకా ఫేవర్గానే ఉన్నట్లు తెలుస్తోందంటున్నారు.
ఇక, బిజెపి కూడా 2019 నాటికి జనసేనతో పొత్తు అయితేనే బెటర్ అనే ఆలోచన చేస్తోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ను పార్టీలో చేర్పించుకోవడం కంటే.. ఆయన బయట ఉండి మద్దతిస్తేనే బాగుంటుందని భావిస్తోంది. అలా ఉంటే 2019 నాటికి బిజెపి మరింత బలపడుతుందని భావిస్తున్నారని తెలుస్తోంది.
మరోవైపు, చిరంజీవి చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలు కూడా చర్చనీయంశంగా మారాయి. సరైనోడు ఆడియో విజయోత్సవ సభ ఆదివారం విశాఖలో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. విశాఖ ప్రజల మనస్తత్వం ఈ వేడుకకు రప్పించిందని, రిటైర్మెంట్ ఉంటే తాను ఇక్కడే నివాసం ఏర్పరుచుకుంటానని చెప్పారు.
సినిమాలు లేదా రాజకీయాల్లో రిటైర్మెంట్ అనే దానికి అర్థం లేదని గుర్తు చేస్తున్నారు. పండు ముసలివాళ్లు కూడా రెండింటిలోను కొనసాగుతారు.
సినిమాల్లో నటించకపోయినప్పటికీ రాజకీయాల్లో మాత్రం కొనసాగే అవకాశముంటుంది. కానీ చిరంజీవి రిటైర్మెంట్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చిరంజీవిలో అప్పుడే రిటైర్మెంట్ ఆలోచన ఎందుకు వచ్చిందనే చర్చ జరుగుతోంది. అంటే రాజకీయాలకు కూడా ఆయన రిటైర్ ఇస్తారా అనే చర్చ సాగుతోంది.