పవన్ కళ్యాణ్ చిత్తూరు పర్యటనకు...రాజకీయ ప్రాధాన్యం:ఎందుకంటే?
చిత్తూరు:ఈ నెల 23 న పవన్ కళ్యాణ్ చిత్తూరు నగరంలో పర్యటించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ టూర్ కు ఈసారి అత్యంత రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ వివిధ సమస్యలపై ఆయా ప్రాంతాల్లో పర్యటనలు చేశారు. కానీ ఆ పర్యటనలు వేటికి ఇప్పుడు పవన్ చిత్తూర్ టూర్ కి ఏర్పడినంత పొలిటికల్ ఇంపార్టెన్స్ క్రియేట్ కాలేదు.
Recommended Video
దీనికి ప్రధాన కారణాలు నాలుగు...ఒకటి వివిధ కారణాల వల్ల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ రాజకీయ ప్రాధాన్యం ఈమధ్య కాలంలో బాగా పెరిగిపోవడం, రెండు పవన్ తలపెట్టిన ఈ టూర్ అధికార పార్టీకి ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉండటం...మూడు పవన్ పర్యటించబోయే చిత్తూరు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడం...ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే నాలుగో కారణం పవన్ చిత్తూరు పర్యటనకు ఏ సమస్య గురించి వెళుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం తదనంతర కాలంలో రాష్ట్రాన్ని అంతటిని ప్రభావితం చేసే అవకాశం ఉండటం...అదెలాగో చెప్పుకునే ముందు పవన్ టూర్ గురించి తెలుసుకుందాం.
పవన్...చిత్తూరు టూర్ కు కారణం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు నగరంలో పర్యటించడానికి కారణం అక్కడ చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు...స్థానికంగా పరిష్కారం కావాల్సిన ఈ అంశం చిలికి చిలికి గాలివానగా మారి చివరకు రాజకీయ మలుపు తీసుకుంది. దీంతో సహజంగానే ప్రస్తుతం వివిధ కారణాల వల్ల బాగా వేడెక్కిఉన్న ఎపి రాజకీయ వాతావరణంలోకి పొలిటికల్ గా ప్రభావితం చేసే ఏ అంశం వచ్చినా ఆ అంశానికి కూడా ఆటోమేటిక్ గా అధిక ప్రాధాన్యం ఏర్పడుతోంది. అదే క్రమంలో చిత్తూరు నగర రోడ్డు విస్తరణ పనులకు సంబంధించిన పరిహారం విషయమై ఎపి ప్రభుత్వానికి, స్థానిక జనాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరని నేపథ్యంలో ఆ అంశంపై బాధితులు కొందరు పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించడమే పవన్ కళ్యాణ్ ఈ చిత్తూరు టూర్ కి కారణం.
చిత్తూరు నగరం...పరిస్థితి ఇది!
ఇక పవన్ పర్యటించబోయే చిత్తూరు నగరం విషయానికొస్తే పేరుకు ఇది జిల్లా కేంద్రమే అయినా చిత్తూరులో కనీస వసతులు కూడా ఉండవంటే అబద్దం కాదు. కారణాలేమైనా గత 30 ఏళ్లుగా అవే ఇరుకిరుకు రోడ్లు. మరోవైపు ఇది ఆంధ్రాతో పాటు తమిళనాడు, కర్నాటక సరిహద్దు జిల్లా కావడం, అలాగే తిరుమలకు వెళ్లే భక్తులు అత్యధిక ఈ నగరం గుండానే ప్రయాణం చేయడం వంటి కారణాలతో ఇక్కడ రద్దీ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ క్రమంలో 2012లో ఈ నగరంలో రోడ్ల విస్తరణ ప్రాధాన్యం గుర్తించిన అప్పటి ప్రభుత్వం ఇక్కడి ప్రధాన రహదారులను విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్ ఆమోదించింది. అయితే దానిని అమలు చేయడంలో మాత్రం బాగా జాప్యం జరిగింది.
పనులు మొదలయ్యాయి...పరిహారం కోసం
అయితే ప్రస్తుత ప్రభుత్వం చిత్తూరు నగరంలోని రోడ్లను విస్తరించేందుకు పనులు ప్రారంభించింది...అయితే ఈ విస్తరణ కారణంగా ఇక్కడ భూములు, ఇళ్లు కోల్పోతున్నవాళ్లు తమ పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు చట్ట ప్రకారం నష్టపరిహారం చెల్లించి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించాలని స్టేటస్కో విధించింది. అయితే ఇళ్లు, భూములు కోల్పోతున్నవారికి నగదు రూపంలో పరిహారం ఇప్పుడు చెల్లించడం సాధ్యం కాదని టీడీఆర్ రూపంలో వారిని ఆదుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రభుత్వం ఇచ్చే బాండ్లతో తమకు ప్రయోజనం ఉండదంటున్నారు ఇక్కడి బాధితులు.
చంద్రబాబును కలిసారు...ఆ తర్వాత పవన్ ని
ఈ క్రమంలోనే ఇక్కడి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పోలీసులతో కలిసి రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించేశారు. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబును కూడా కలిశారు... అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో పరిహారం నగదు రూపంలో ఇవ్వడం కుదరదని అయితే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో బాధితుల్లో కొందరు జనసేన అధినేత పవన్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంతేకాదు అలా పవన్ను కలిసిన వారిలో కొందరు అధికార పార్టీ నేతలు కూడా ఉండటం విశేషం. వారి సమస్యల గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈ నెల 23 తేదీన చిత్తూరులో పర్యటిస్తానని, మీకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
పవన్ పర్యటనతో...ఏమవుతుంది?
ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ చిత్తూరు నగర టూర్ వల్ల ఏమవుతుంది?...అంటే సమస్య పరిష్కారం సంగతేమో కాని సమస్య జటిలం అవడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. కారణం ప్రభుత్వం ఇప్పటికే నగదు చెల్లింపులు కష్టమనే విషయం తేల్చేసింది. కానీ బాధితులు మాత్రం నగదు చెల్లింపులకే పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అక్కడ పర్యటించడం వల్ల పవన్ ను బాధితులు తమకు నగదు చెల్లించే విషయమై ప్రభుత్వాన్ని నిలదీయాలని, తమకు అండగా నిలవాలని కోరతారు. దీంతో పవన్ వారి తరుపున ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేయడం అనివార్యమవుతుంది. దీంతో రాజకీయంగా పరిస్థితులు మరింత వేడెక్కే స్థితి ఏర్పడుతుంది.
ఈ సమస్యకు పరిష్కారం...చాలా కీలకం
మరోవైపు చిత్తూరులో రోడ్ల విస్తరణ పనులకు పరిహారం విషయమై తలెత్తిన ఈ సమస్యకు, దానికి చివరకు లభించే పరిష్కారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కారణం ఎపిలో రాబోయే రోజుల్లో ఇదే సమస్య పలు చోట్ల తలెత్తే అవకాశం ఉంది. కాబట్టే ఇక్కడ అమలు చేసిన పరిష్కార మంత్రాన్నే ఆ తరువాత అనివార్యంగా చాలా చోట్ల తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టే కేవలం చిత్తూరు నగరాన్నే దృష్టిలో పెట్టుకొని పరిష్కారం అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వానిది. అందుకే ప్రభుత్వం ఎవరు వచ్చినా రాకపోయినా బాధితులకు తాము చేయాల్సిన న్యాయం చేసితీరతామని, అది తమ బాధ్యత అని ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం.