2019లో ఎందుకు పోటీ చేస్తున్నానో చెప్పిన పవన్, సీఎం అలా అనకుండా ఉండాల్సింది: ఐవైఆర్
అమరావతి/కడప: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆయన తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఎన్నికల్లో పోటీ విషయమై స్పందించారు. 2014లో తెలుగు ప్రజల సుస్థిరత కోసం సహకారం అందించామని, 2019 ఎన్నికలలో సమతుల్యత కోసం పోటీ చేస్తున్నామని చెప్పారు.
తిరగబడిన వ్యూహం!: వైసీపీ మైండ్ గేమ్, దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్, టీడీపీకి కూడా
జనసేనాని 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఆ పార్టీల గెలుపు కోసం ఆయన ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత బీజేపీ ఇచ్చిన ప్రత్యేక హోదా వంటి పలు హామీలు నెరవేరలేదు. దీంతో ఆ పార్టీపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే చంద్రబాబు హయాంలో అవినీతి పెరిగిందంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు.
ఏపీలో పోటీ కోసం పవన్ కళ్యాణ్ సిద్ధం
వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం పవన్ ఒక్కో అడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు రాజధాని ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకున్నారు. జనసేన పార్టీని గ్రామగ్రామానికి విస్తరించే పనిలో భాగంగా ఇప్పటికే జిల్లా సభ్యులను ఎంపిక చేశారు. ప్రజలలో పర్యటిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.
ఇల్లు, కార్యాలయం పనులను పరిశీలించిన పవన్
మంగళగిరి మండలంలోని కాజ గ్రామంలో జాతీయ రహదారి వెంబడి జనసేన కార్యాలయం, తన గృహ నివాస పనులను ఆదివారం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఇంజినీర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తొలుత ఏఎన్యూ వెంబడి రామకృష్ణ వెనిజులా ప్రయివేటు లిమిటెడ్ నిర్వహిస్తున్న బహుళ అంతస్తుల భవన నిర్మాణ సముదాయాలను పరిశీలించారు. ఆ తర్వాత శ్రీ పానకాల లక్ష్మీనర్సింహ స్వామి కాలనీ సమీపంలో కాసేపు ఆగి, ఆ ప్రాంతంలోని భూములను పరిశీలించి నేతల నుంచి ధరల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
చంద్రబాబు వారిని అలా సంబంధించకుండా ఉండాల్సింది
'అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు. రాజకీయంగా ఏ ఒక్క పార్టీకి వారు ప్రచారం చేయడం నిషిద్ధం. ఇది ఎన్నికల సంఘం నిబంధనల కు కూడా విరుద్ధం. ముఖ్యమంత్రి గారు వారిని ఆ విధంగా సంబోధించకుండా ఉండుంటే బాగుండేది' అని ఐవైఆర్ కృష్ణారావు ట్వీట్ చేశారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన క్లిప్పింగ్ను చూపించారు.
చంద్రబాబు ఏమన్నారంటే?
కాగా, అలవికాని హామీలు గుప్పిస్తున్న కోతిమూకలు అధికారంలోకి వస్తే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా మారుతుందని సీఎం చంద్రబాబు రెండు రోజుల క్రితం హెచ్చరించారు. శనివారం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వచ్చారు. ఉండవల్లి గ్రీవెన్స్హాల్లో ఆయనను కలిశారు. తమకు జీతాలు పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని ఉద్దేశించి మాట్లాడారు. టీడీపీ రెండోసారి కూడా ఎన్నికల్లో గెలిచి అధికారంలో ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందని, రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం ఉన్న సంతృప్తి 90 శాతానికి పెంచాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రం సాధిస్తున్న ప్రగతికి మీరు అండగా నిలిస్తే ప్రతిపక్షం అనేది ఉండదని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు వేస్తే 25 ఎంపీ సీట్లు సాధిస్తామని, అప్పుడు ప్రధానిని మనమే నిర్ణయిస్తామని, ఫలితంగా ఏపీకి హోదా, నిధులు వస్తాయని, కేంద్రాని దబాయించి సాధిస్తామని ఆయన చెప్పారు. చంద్రన్న ఉంటేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని గ్రామాల్లో చాటాలని అంగన్వాడీ టీచర్లకు పిలుపిచ్చారు. దీనిని ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు.