నాకు బెదిరింపులు: పవన్ షాకింగ్, 'అమరావతికి రైతు త్యాగం అబద్దం'
విశాఖపట్నం: పురాణాల్లో హిరణ్యకశిపుడు మొదలుకొని ప్రతి రాక్షసుడు భూమిని లాక్కుందామనే ఆలోచనే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంపై శుక్రవారం నిప్పులు చెరిగారు. టీడీపీ ప్రభుత్వం భూమి లాక్కుంటోందంటూ వారిని కూడా రాక్షసులతో పోల్చారు. ఏపీ భూనిర్వాసితుల సభలో ఆయన అధికార పార్టీపై మండిపడ్డారు.
జనసేనలోకి స్వామినాయుడు, ఫ్యాన్స్: చిరంజీవితో భేటీ అయ్యాకే? పవన్ హామీ
హిరణ్యకశిపుడు మొదలు ఇప్పటికీ భూమిని లాక్కునే ఆలోచనే అని, రైతును, ఆ భూమిపై ఆధారపడిన కుటుంబాలను రోడ్డు పైకి తెస్తున్నారని విమర్శించారు. ఏపీలో పలు ప్రాజెక్టుల పేరుతో వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నారని, రైతుకు కనీస పరిహారం, పునరావాసం కల్పించడం లేదన్నారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్యాయం చేస్తోందన్నారు.
మహారాష్ట్ర తరహా ఉద్యమం అవసరం
రైతులంతా ఐక్యంగా పోరాడాలని, మహారాష్ట్ర తరహా ఉద్యమం అవసరమని జనసేనాని పిలుపునిచ్చారు. ఐక్య పోరాటం చేస్తే పాలకుల్లో కదలిక వస్తుందన్నారు. అమరావతి భూనిర్వాసితులు, కాకినాడ సెజ్, పోలవరం ముంపు మండలాల్లోని రైతులు, పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డ్ బాధిత రైతులు, సోంపేట బీల భూములు, వంశదార నిర్వాసితులు, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్వాసితులు, భావనపాడు పోర్టు బాధితులు, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్ర ప్రాంత రైతులు ఈ సభకు హాజరయ్యారు. పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు.
ఆ రైతు మాటలు ఆలోచింపచేశాయి
అభివృద్ధి అవసరమేనని, కొంత విధ్వంసంతో కూడుకొని ఉంటుందని, కానీ దానికి నియంత్రణ, క్రమపద్ధతి అవసరమని పవన్ అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కంటే ముందే తాను కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేశానని, దానికి ఎస్ఈజెడ్లు కూడా ఓ కారణమని చెప్పారు. ఇంతకుముందు ఊళ్లో రోడ్లు వేసేవారని, ఇప్పుడు రోడ్ల కోసం ఊళ్లు తీసేస్తున్నారని అప్పట్లో తనతో ఓ రైతు అన్న మాటలు ఆలోచింపచేశాయన్నారు.
టీడీపీతో విభేదించిందే అందుకు
40 ఏళ్ల క్రితం స్టీల్ ప్లాంట్ కోసం 26వేల ఎకరాలు తీసుకొని ఈ రోజుకు పరిహారం, ఉపాధి కల్పించలేదని పవన్ మండిపడ్డారు. వారంతా ఇక్కడి గుళ్లలో ప్రసాదాలు తిని బతుకుతున్నారని, ఇంకొందరు బక్కచిక్కి కడుపు ఆర్చుకుపోయి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మనకి అన్నం పెట్టే రైతు కన్నీరు పెడుతున్నారన్నారు. పాలకులకు, రాజకీయ పార్టీలకు మానవత్వం ఉండవద్దా అని ప్రశ్నించారు. జనసేన ఓట్ల కోసం రాలేదని, రాజకీయాల్లో సమూలమైన మార్పు కోసం వచ్చిందన్నారు. అసలునేను టీడీపీతో విభేదించి వచ్చిందే అమరావతి ప్రాంత రైతుల విషయంలో అన్నారు. 2013లో తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. రాజధాని ప్రాంతమైన ఉండవల్లి నుంచి ఉద్యమం ప్రారంభిద్దామని, రాజకీయ ప్రజా పోరాటంతోనే సాదిద్దామని పిలుపునిచ్చారు.
నాకూ బెదిరింపులు వచ్చాయి
భూమి కోల్పోతున్న రైతులకు న్యాయం చేయమని అడిగితే అభివృద్ధి నిరోధకులు అంటారా అని పవన్ మండిపడ్డారు. విశాఖలో ఇన్నోవా సొల్యూషన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థలకు రూ.35 లక్షలకే ఇచ్చారని, సీఎం గారి తాలూకు అయితే చవకగా ఇస్తారని, వేరేవాళ్లకు రూ.3.5 కోట్లు చెబుతారని మండిపడ్డారు. భూదోపిడీలో దళారులు, ఇన్ సైడ్ ట్రేడర్లు కోట్లు సంపాదిస్తుంటే రైతులు, భూములపై ఆధారపడినవాళ్లు నష్టపోతున్నారన్నారు. అడ్డుకుంటే గూండాలతో బెదిరింపులు అన్నారు. నాకూ బెదిరింపులు వచ్చాయని, కానీ ఇలాంటి బెదిరింపులు, గూండాలకు భయపడేది లేదన్నారు.
మా ఊరికి పవన్ కళ్యాణ్ ఇంటి పేరు పెట్టుకుంటాం
రాజధాని ప్రాంతంలో రైతులు భూసమీకరణకు సహకరించడం లేదని కక్ష సాధిస్తున్నారని ఈ సమావేశానికి వచ్చిన రైతులు ఆరోపించినట్లు జనసేన తెలిపింది. నలుగురు రైతులను కలిసి మాట్లాడుకోనీయడం లేదన్నారు. రైతులు అమరావతికి స్వచ్చంధంగా భూములు ఇచ్చి త్యాగం చేశారని చంద్రబాబు చెబుతున్నారని, అది అబద్దమని రైతులు చెప్పారన్నారు. 'బెదిరించి భూములు తీసుకుంటున్నారని, తమ భూములను కాపాడితే పవన్ కళ్యాణ్ పేరును మా ఊరికి పెట్టుకుంటామని ఉండవల్లి నుంచి వచ్చిన రైతు ఈశ్వర రెడ్డి చెప్పారు. ఈ సమావేశానికి వస్తుంటే ఫోన్ చేసి బెదిరించారన్నారు. తమకు పిచ్చుకగూళ్ల వంటి ఇళ్లు ఇస్తున్నారన్నారు.