'పవన్ కళ్యాణ్ అయోమయ నేత': బెదిరిస్తే భయపడతానని బీజేపీ అనుకుంటోంది: చంద్రబాబు
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ అయోమయ నేత అని మంత్రి జవహర్ ఆదివారం ఎద్దేవా చేశారు. అసలు ఆయన తీరు ఎవరికీ అర్థం కావడం లేదన్నారు. కన్నా లక్ష్మీనారాయణ వల్ల బీజేపీకి కొత్తగా ఒరిగేదేమీ లేదని, ఆయన వల్ల బీజేపీకి వచ్చేది సున్నా అన్నారు. జగన్కు ఎవరైనా అండగా వెళ్లడమంటే జైలుకు వెళ్లడమే అన్నారు.
మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలు
ప్రధానమంత్రి కార్యాలయం నేరస్తులను ప్రోత్సహిస్తోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 11 కేసుల్లో ఏ1, ఏ2లుగా ఉన్న వారు పీఎంవో చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ఆయన మహానాడు వేదికపై మాట్లాడారు. అవినీతికి పాల్పడిన గాలి సోదరులతో బీజేపీ జట్టు కట్టిందన్నారు. బెదిరిస్తే నేను భయపడతానని బీజేపీ అనుకుంటోందన్నారు. టీడీపీ ఎవరికీ భయపడదని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను పోరాడి సాధించుకోవాలన్నారు. వ్యక్తిగత విమర్శలకు దిగవద్దని సూచించారు.
తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. అటు తెలంగాణకు ఇవ్వరు, ఇటు ఏపీకి ఇవ్వరని చెప్పారు. కనీసం దక్షిణ భారత దేశానికి కూడా ఇవ్వరని చెప్పారు. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు వెళ్తే నల్ల జెండాలు చూపారన్నారు. దేశంలో బీజేపీ కలుషిత రాజకీయాలు చేస్తోందన్నారు.
మహానాడులో తీర్మానాలు
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడులో ఆదివారం ఏడు తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఏపీకి సంబంధించి 5, తెలంగాణకు సంబంధించి 2 తీర్మానాలు ప్రవేశ పెట్టారు. ఏపీ విభజన చట్టం - పార్లమెంటులో ప్రధాని హామీలు, ప్రత్యేక హోదా అమలు, కేంద్రం నిర్లక్ష్యంపై తీర్మానం ప్రవేశ పెట్టారు. రైతు సాధికారత - లాభసాటి వ్యవసాయం-దేశంలోనే ప్రథమ స్థానంపై తీర్మానం పెట్టారు. టీఆర్ఎస్ పాలనలో కొరవడిన సామాజిక న్యాయంపై మరో తీర్మానం పెట్టారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభంపై తీర్మానం ప్రవేశపెట్టారు. మృతి చెందిన కార్యకర్తలకు మహానాడులో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.