శ్రీశ్రీ జగన్మోహన్.., శత్రువునే: పవన్ కౌంటర్, చంద్రబాబుకు '2' హెచ్చరికలు
అనంతపురం: నేను ఏం మాట్లాడినా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు చెబుతున్నారని, రాజకీయాలు అంటే తిట్టుకోవడం, దుర్భాషాలాడుకోవడమేనా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు వైసిపి అధినేత వైయస్ జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తాను ఎవరికి అనుకూలం కాదన్నారు. తనకు చంద్రబాబు అయినా, శ్రీశ్రీ జగన్మోహన్ రెడ్డి అయినా ఒకటే అన్నారు. తనకు ఏ పార్టీతోను శతృత్వం లేదన్నారు. రాజకీయాలంటే తిట్టుకోవడమనే సంప్రదాయం బలపడిందని, జనసేన పార్టీది విధానాలు, సిద్ధాంతాలపై పోరాటమే తప్ప, వ్యక్తులపై పోరాటం చేయదని చెప్పారు. చంద్రబాబు కానీ, జగన్ పై కానీ వ్యక్తిగత వైరం లేదన్నారు.
ఇదీ జనసేన, మోడీ అపాయింట్మెంట్ కోరా: కొత్త గెటప్లో పవన్, సైటొచ్చింది
నేను ఏ పార్టీకైనా శత్రువునే
ప్రజల సమస్యలు పరిష్కారం కాకుంటే నేను ఏ పార్టీకైనా చాలా పెద్ద శత్రువు అని గొంతు చించుకున్నారు. ఈ దోపిడీ రాజకీయ వ్యవస్థ ఇంకెంత కాలం అన్నారు. మనకు పౌరుషం ఉందా లేదా అని సభికులను ఉద్దేశించి మాట్లాడారు. నేను మీకోసం పోరాడుతున్నానని చెప్పారు. మీ పిల్లల కోసం పోరాడుతున్నానన్నారు.
అలసిపోయాం... విసిగిపోయాం... ఇంకెంతకాలం ఈ మోసాలని ప్రశ్నించారు. ఇక చాలు ఇప్పటికైనా వ్యవస్థ మారాలన్నారు. నేను చేతులు కట్టుకుని కూర్చుంటే గౌరవ మర్యాదలు, డబ్బులు వస్తాయని, అన్నింటినీ ఫణంగా పెట్టి ప్రజా ప్రతినిధిగా వస్తున్నానని చెప్పారు. ఒక జనరేషన్ రాజకీయ నేతలు చేసిన తప్పుల కారణంగా ఈ రోజు ఈ దుస్థితికి దిగజారామన్నారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ కన్నీరు పెట్టకూడదన్నారు.
కానీ ప్రజల సమస్యల కోసం నిలదీస్తున్నానని, దీంతో నేను ఏం చేయకుండానే అందరికీ శత్రువును అవుతున్నానని చెప్పారు.
చంద్రబాబు అయినా, వైయస్ జగన్ అయినా తమ తప్పులు సరిదిద్దుకోకుంటే ఈ పవన్ కళ్యాణ్, ఈ జనసేన ఊరుకోదన్నారు. ఆడబిడ్డల మాన సంరక్షణకు మేం ముందుంటామని చెప్పారు. ఆడపడుచులు నా అక్కాచెల్లెళ్లు అన్నారు. ఆడబిడ్డ, రైతు కన్నీరు పెట్టవద్దన్నారు.
నేను రైతు గురించి మాట్లాడుతున్నప్పుడు జై జవాన్, జై కిసాన్ అంటానని చెప్పారు. అన్నం పెట్టేవాడు రైతు అని, అలాంటి రైతు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాడన్నారు. మనకు కూడు పెట్టే రైతును మనమే చంపుకుంటే ఎలా అన్నారు. అయిదేళ్ల పదవుల పైన మమకారం ఉంది కానీ, ప్రజల పైన, వారి సమస్యల పైన మమకారం లేదా అన్నారు.
అన్నదాత కోసం నేను ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నేను ఈ మాటలను నా గుండె లోతుల్లో నుంచి మాట్లాడుతున్నానని చెప్పారు.
శ్రీశ్రీ జగన్మోహన్.., శత్రువునే: పవన్ కౌంటర్, చంద్రబాబుకు '2' హెచ్చరికలు
అవినీతిపై చంద్రబాబుకు హెచ్చరిక
తెలుగుదేశం ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, అలా ఎందుకు వస్తున్నాయో సరి చేసుకోవాలన్నారు. నేను కుటుంబాన్ని పక్కన పెట్టి, కులాన్ని పక్కన పెట్టి టిడిపి, బిజెపికి మద్దతు పలికానని చెప్పారు. నాకు ఏ కులం, మతం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అన్ని కులాలను, మతాలను సమానంగా చూడాలన్నారు. దోపిడీ రాజకీయాల పైన నిరంతర పోరాటానికి సిద్ధమన్నారు.
కట్టడాలు కడితే సింగపూర్ అభివృద్ధి కాదు
ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం సింగపూర్ తరహా అభివృద్ధి అని చెబుతుంటారని, కానీ సింగపూర్ అంటే ఎత్తైన కట్టడాలు కట్టడం కాదన్నారు. కరప్షన్ లేకపోవడం అన్నారు. అలాంటి రాజకీయం ఉండాలన్నారు. టిడిపి ప్రభుత్వంపై ఎందుకు అవినీతి ఆరోపణలు వస్తున్నాయో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
టీడీపీ మీద ప్రజలకు నమ్మకం పోయిందని, అవినీతి పెరిగిపోతోందని ప్రజలు చెబుతున్నారని, కుటుంబాన్ని కాదని నేను మీకు మద్దతు పలికానని, ఈ రోజు ప్రజలందరితో ఉన్నామని చెప్పాల్సిన ప్రభుత్వంపై ఈ ఆరోపణలు ఎందుకు? వస్తున్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
బంధుప్రీతి, మద్దతుదారుల ప్రీతి వదిలేయాలని, ప్రజలకు అండగా నిలబడాలన్నారు. అమరావతి నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు వేరైపోయినట్టు ప్రజలు భావిస్తున్నారని, ఇలాంటి విభజన రాకుండా జాగ్రత్త పడాలన్నారు.
వేర్పాటువాద హెచ్చరిక
రాజధాని అమరావతి విజయవాడలో ఉండటం వల్ల రాయలసీమ ప్రాంతానికి దూరంగా ఉందని చెబుతున్నారని, దీనిపై టిడిపి ఆలోచించాలన్నారు. ఇలాగే ఉంటే వేర్పాటువాద సమస్యలు వస్తాయన్నారు. దీనిని ఆలోచించాలని చంద్రబాబు ప్రభుత్వానికి హితవు పలికారు. రాజధాని డబ్బున్న వాళ్లకే రాజధానియా, అందరికా చెప్పాలన్నారు. మరో వేర్పాటువాద సమస్య లేకుండా చంద్రబాబు ఆదిలోనే తుంచివేయాలన్నారు.