బాబుకు పవన్ కౌంటర్: కౌగిలించుకోవడానికి పిలవలేదు, మునుపెన్నడూ జరగని ప్రయత్నమిది..
హైదరాబాద్: నిధుల లెక్కలు చెప్పాలంటూ పవన్ కల్యాణ్ పెట్టిన డెడ్ లైన్ను అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండూ లెక్కచేయలేదు. పైగా పవన్ మనోడే అంటూ జనసేన కార్యాచరణపై అనుమానాలు కలిగించేలా చేశాడు చంద్రబాబు. ఈ నేపథ్యంలో జేఎఫ్సి తొలి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. జేఎఫ్సి పోరాట పంథా ఎలా ఉండబోతుంది? అన్న దానికి సంబంధించి ఈ సమావేశాల్లో క్లారిటీ రావచ్చేమో అంటున్నారు.
Recommended Video
క్రియాశీలకంగా తొలి అడుగు..: పొద్దున్నే 'అంబేడ్కర్' వద్దకు పవన్, నేటి భేటీలో ఏం తేల్చబోతున్నారు?
బాబుకు జగన్ కౌంటర్:
పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో జేఎఫ్సి గురించి ప్రస్తావిస్తూ దానిపై తనకు అభ్యంతరం లేదన్నారు సీఎం చంద్రబాబు. కానీ ఆ భేటీకి కాంగ్రెస్ నేతల్ని పిలవడంపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. విభజనకు కారణమైన కాంగ్రెస్తో కూర్చొని చర్చలేంటి అన్నది చంద్రబాబు ప్రశ్న.
ఓవైపు పార్టీలకు అతీతంగా జేఎఫ్సి ఉంటుందని చెబుతుంటే.. చంద్రబాబు ఇలా మాట్లాడటం పవన్ కల్యాణ్కు కూడా మంటపుట్టించినట్టే ఉంది. అందుకే జేఎఫ్సి కాంగ్రెస్నేమి కౌగిలించుకోవడం లేదని గట్టి కౌంటర్ ఇచ్చారు పవన్.
వాళ్లనూ పిలిచాం..:
కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలనే ఉధ్దేశంతోనే వారిని కూడా ఆహ్వానించామని పవన్ చెప్పారు. టీడీపీ, వైసీపీ నేతలను కూడా సమావేశానికి ఆహ్వానించామని, కానీ రావడానికి వాళ్లు సుముఖంగా లేరని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను చేయాల్సింది చేస్తున్నానని అన్నారు.
ఇదివరకెప్పుడూ జరగని ప్రయత్నమిది..:
ఏపీలో ఇదివరకెప్పుడూ మేదావులంతా ఒక్క వేదిక పైకి రాలేదని, జేఎఫ్సి తొలిసారిగా ఆ ప్రయత్నం చేయబోతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టే కేంద్రం కూడా వెబ్సైట్లో పెట్టిన వివరాలను చూసుకోవాలని చెప్పినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. అయితే ఏపీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉందని మోడీకి సూచించినట్టు పేర్కొన్నారు.
సబ్ కమిటీలు వేస్తాం..:పవన్
రెండు రోజుల జేఎఫ్సి సమావేశం అనంతరం సబ్ కమిటీలు ఏర్పాటు చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు. కాగా, సమావేశాల అనంతరం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయబోతున్నారనే ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. నేడు, రేపు జరగబోయే సమావేశాల తర్వాత.. జేఎఫ్సి కార్యాచరణపై కమిటీ క్లారిటీ ఇచ్చే అవకాశముంది.