ఆవేశం ఎందుకు వస్తుందంటే, అలా చేస్తే మీవాళ్ల నాకు ఓటేయరు: పవన్ కళ్యాణ్, గాజువాక నుంచి పోటీపై
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల టీడీపీ, వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై విశాఖపట్నం పాడేరు సభలో కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత సాయంత్రం టీజీ.. తిరిగి మీడియా ముందుకు వచ్చారు. పవన్ ఆవేశం తగ్గించుకోవాలని సూచించారు. దీనిపై పవన్ రెండు రోజుల క్రితం మరోసారి కౌంటర్ ఇచ్చారు. టీజీ పేరు ఎక్కడా చెప్పలేదు. కానీ ఆ వ్యాఖ్యలు ఆయనను ఉద్దేశించేనని చెబుతున్నారు.
ఏదో మీటింగ్లో ఉండి స్క్రోలింగ్ చూసి పవన్ కళ్యాణ్ స్పందించారని, తాను ఏం మాట్లాడానో పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలని, ఓ పెద్దమనిషిగా భవిష్యత్తులో ఎదగబోయే నాయకుడికి (పవన్ కళ్యాణ్) తాను చెప్పేది ఒక్కటేనని, మీరు ప్రశాంతంగా, చక్కగా ఆలోచించి స్పందించాలని, అప్పుడే భవిష్యత్తు ఉంటుందని టీజీ వెంకటేష్ అన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు ఆవేశం ఉండవచ్చునని, కానీ నాయకుడికి ఆవేశం ఉంటే దెబ్బతింటారని, వారిపై ఆధారపడిన వారు దెబ్బతింటారని టీజీ చెప్పారు. దీనిపై జనసేనాని విశాఖపట్నం నాయకుల సమావేశంలో స్పందించారు.
కడుపు నిండిన వాడికి ఆవేశం ఎందుకు ఉంటుంది
తనకు కోపం ఉందని, ఆవేదన ఉందని, కానీ ఈ మధ్య ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు (టీజీ వెంకటేష్ను ఉద్దేశించి) మాట్లాడుతూ తనను ఆవేశం తగ్గించుకోవాలని చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆవేశంతో మాట్లాడుతాడు.. ఆవేశంతో మాట్లాడుతాడని.. తనను అంటుంటారని, ఆవేశం అనేది ఎవరికి ఉంటుందని, అసలు ఆవేదన ఉన్నవాడికే ఆవేశం ఉంటుందని తెలుసుకోవాలని టీజీ వెంకటేష్కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కడుపు నిండిన వాడికి ఆవేశం ఎందుకు ఉంటుందని, అలాంటి వారు మెత్తగానే మాట్లాడుతారన్నారు. తన కడుపు మాత్రం దహించుకుపోతుందని చెప్పారు. అన్యాయాలు, అక్రమాలు చూస్తుంటే కడుపు దహిస్తోందన్నారు.
సమూహానికి కోపం వస్తే ఉద్యమం
నాకు ఆవేదన కారణంగా ఆవేశం వస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. నేను కడుపు నిండిన వ్యక్తిని కాదన్నారు. నేను ఇంకా డబ్బులు సంపాదించగలనేమో కానీ, తనకు విపరీతమైన కోపం (ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశ్యం) ఉందని చెప్పారు. దానిని ఓ బలమైన రాజకీయ రూపంలోకి తీసుకు వచ్చానని చెప్పారు. ఒక మనిషికి కోపం వస్తే అది వ్యక్తిగతమవుతుంది, ఒక సమూహానికి కోపం వస్తే అది ఉద్యమం అవుతుందని జల్సా సినిమాలో ఓ డైలాగ్ ఉందని పవన్ అన్నారు.
నాకు వ్యక్తిగతంగా అన్యాయం జరగలేదు
మన ఆవేదనను ఏపీ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలనే పార్టీ స్థాపించానని, తాను అభిమానులు, యువత ఉన్నారనే నమ్మకంతోనే పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ అన్నారు. నాకు వ్యక్తిగతంగా అన్యాయం, అక్రమంగా జరగలేదని, జరిగినా వ్యక్తిగతంగా ఎదుర్కొంటానని చెప్పారు. తనకు ఇంతమంది అభిమానులు ఉన్నారని, ఇలాంటి వారు ఉన్నప్పటికీ దీనిని రాష్ట్రాభివృద్ధి కోసం ఉపయోగించకుంటే నిష్ప్రయోజనమే అన్నారు.
సినిమాలకు పేరు వచ్చాక రాజకీయాల్లోకి రాలేదు
మనకు రాజకీయాలు కొత్త కావొచ్చునని, కానీ తనకు మాత్రం కొత్త కాదని చెప్పారు. సినిమాల్లోకి రాకముందే తనకు రాజకీయాలు ఆసక్తి అన్నారు. నాకు సినిమాల్లో పేరు వచ్చాక రాజకీయాల్లోకి రాలేదన్నారు. మొదటి నుంచి వచ్చి సేవ చేయాలనేది తన కోరిక అన్నారు. పార్టీలోకి నేతలు, వారి అనుచర వర్గం వచ్చి వెళ్లిపోవచ్చు కానీ, అభిమానులు, యువత తన వెంటే ఉంటుందని, వారికి ప్రత్యేక అధికారాలు ఇచ్చానని చెప్పారు.
గాజువాక నుంచి పోటీ చేయమని అడగ్గా
అభిమానులు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... అన్ని ప్రాంతాల నుంచి అడుగుతున్నారని, భగవంతుడు ఎలా చెబితే అలా అన్నారు. జనసేన ఎన్నికల కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పదవి అలంకారం కాదని, అలా అయితే 2009లోనే పోటీ చేసేవాడినని చెప్పారు. అందరూ క్షేమంగా ఉండాలన్నారు. మీకు దెబ్బ తలిగినా.. మీ ఇంట్లోవాళ్లు.. పవన్ కళ్యాణ్ మీటింగ్కు వెళ్లడం వల్ల దెబ్బ తగిలిందని, నాకు ఓటు వేయరని చెప్పారు. కాబట్టి అందరూ బాగా ఉండాలన్నారు. జనసేనకు ఓటేస్తానని బయట చెప్పవద్దని, మౌనంగా ఓటేయాలన్నారు.