అక్కడ జగన్ దూకుడుకు అడ్డు వేయాలి..మీరు దృష్టి పెట్టండి : మాజీ జేడీకి పార్టీలో పవన్ కొత్త బాధ్యతలు..
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు జనసేన అధినేత పవన్ కళ్యాన్ కొత్త బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల ముందు అనేక తర్జన భర్జనల తరువాత మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారు. విశాఖ ఎంపీగా పోటీ చేసారు. ఆ తరువాత పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా లేరు. దీంతో..ఆయన జనసేన వీడుతారనే ప్రచారం సాగింది. కానీ, లక్ష్మీనారాయణ దీని పైన స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తనను ఇక మీ సేవలు చాలు అనే వరకు పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసారు.
పవన్ నియమించిన పార్టీ పోలిట్ బ్యూరోలో...అదే విధంగా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలోనూ మాజీ జేడీకీ స్థానం దక్కలేదు. కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న లక్ష్మీనారాయణ విశాఖ లాంగ్ మార్చ్ ఏర్పాట్లలో మాత్రం చురుగ్గా పాల్గొన్నారు. ఇదే సమయంలో పవన్ మాత్రం ఆయనను విశాఖ లో కొనసాగటానికి ఇష్టపడటం లేదు. ఆయనకు కొత్త బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. అందులో భాగంగా నేరుగా లక్ష్మీనారాయణకే ఆ విషయాన్ని స్పష్టం చేసారు.
Fake news: 'అమరావతిలో పవన్ కళ్యాణ్ ఆమరణ దీక్ష': క్లారిటీ ఇచ్చిన జనసేన
విశాఖలో వద్దు..అక్కడ దృష్టి పెట్టండి
తాజాగా జరిగిన ఎన్నికల్లో విశాఖ నుండి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన సేవలను మరో చోట వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు నాదెండ్ల మనోహర్ మినహా పార్టీ వాయిస్ బలంగా వినిపించే వారు పార్టీలో కరువయ్యారు. ఈ సమయంలో ప్రాంతాల వారీగా బలమైన వాయిస్ వినిపించే వారికి బాధ్యతలు అప్పగించాలని పవన్ భావిస్తున్నారు.
అందులో భాగంగా..సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణను విశాఖ లో కాకుండా..రాయలసీమలో వినియోగించుకోవాలని నిర్ణయించారు. దీంతో..ఆయన మాజీ జేడీకీ ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. రాయలసీమలో పార్టీ తరపున బలంగా మాట్లాడే నాయకుల అవసరం ఉంది. ఆ ప్రాంతంపై దృష్టి పెట్టండి అని లక్ష్మీనారాయణకు జనసేనాని పవన్ కల్యాణ్ సూచించారు.
రాయలసీమ పైనే తొలి నుండి..
లక్ష్మీనారాయణ తొలి నుండి రాయలసీమ సమస్యల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. ఆయన జనసేనలో చేరిన సమయంలో అనంతపురం లేదా హిందూపురం లోక్ సభ స్థానాల్లో ఒక చోట నుండి పోటీ చేస్తారని భావించారు.అయితే, సీబీఐ అధికారిగా పని చేసిన ఆయనకు విశాఖ మొత్తం అర్బన్ ప్రాంతంలో ఉండటంతో అక్కడ పెద్ద సంఖ్యలో ఓట్లు పడతాయని..అదే సమయంలో గాజువాక నుండి పవన్ బరిలో ఉండటం కూడా కలిసి వస్తుందని అంచనా వేసారు.
దీంతో..ఆయనను విశాఖ ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టారు. కానీ, అంచనాలు తప్పాయి. గతంలో రాయలసీమలో తాను పార్టీ కార్యాలయం ప్రారంభిస్తానని.. అనంత నుండి పోటీ చేస్తానని పవన్ చెప్పుకొచ్చారు. కానీ, అమలు చేయలేదు. దీంతో..ఇప్పుడు లక్ష్మీనారాయణ వంటి నాయకుల అవసరం రాయలసీమకు ఉందన్నారు. అక్కడ పార్టీకి మార్గదర్శనం చేయడానికి, ముందుకు నడిపించడానికి బాధ్యతలు తీసుకోవాలని పవన్ ఆయనకు సూచించారు.
జగన్ ప్రభావానికి అడ్డుకట్ట వేయగలరా..
రాయలసీమలో తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. కడప..కర్నూలు జిల్లాలను పూర్తిగా కైవసం చేసుకుంది. ఇక, అనంతలో రెండు..చిత్తూరు లో చంద్రబాబు స్థానం కలిపి కేవలం మూడు స్థానాలు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. ఇక, అక్కడ ఇప్పుడు జగన్ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా..మాజీ జేడీకి జనసేనాని రాయలసీమ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
జేడీ సొంత జిల్లా కర్నూలు. రాయలసీమలో సమస్యల పైన అవగాహన ఉన్న లక్ష్మీనారాయణకు ఇప్పటి నుండే అక్కడ బాధ్యతలు అప్పగిస్తే.. భవిష్యత్ లో మేలు చేస్తుందని పవన్ అంచనగా కనిపిస్తోంది. అయితే, పార్టీలో పవన్ మినహా మరెవరూ అధికార పక్ష నేతల విమర్శలను తిప్పి కొట్టటంలో వెనుకబడి ఉన్నారు. కేవలం లక్ష్మీనారాయణకు రాయలసీమలో బాధ్యతలు అప్పగించినా..అక్కడ వైసీపీని ఎదుర్కోవటం పైనే పవన్ కళ్యాన్ ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.