జనసేనాని రైతు సౌభాగ్య దీక్ష: పవన్ తొలి సారిగా..: సొంత ఎమ్మెల్యేతో టెన్షన్..!
జనసేన అధినేత పవన్ కళ్యాన్ దీక్షకు దిగారు. కాకినాడ కేంద్రంగా రైతులకు మద్దతుగా ఈ దీక్ష చేస్తున్నారు. రౌతు సౌభాగ్య దీక్ష పేరుతో ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసిన తరువాత అనేక అంశాల మీద పోరాటాలు చేసినా..దీక్షకు దిగటం మాత్రం ఇదే తొలిసారి. జగన్ ప్రభుత్వ వైఫల్యాల పైన తీవ్రంగా స్పందిస్తున్న పవన్..ఇప్పుడు ఈ దీక్షా వేదిక ద్వారా తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నారు. అయితే, ఇప్పుడు శాసనసభలో సొంత పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే తీరు పార్టీలో కొత్త టెన్షన్ కు కారణమవుతోంది. ఇంగ్లీషు మీడియం పాఠశాలల పైన ఆయన సభా వేదికగా మఖ్యమంత్రి నిర్ణయాన్ని సమర్ధిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనలో హాట్ టాపిక్ గా మారాయి,
జనసేనాని ఒక రోజు దీక్ష
జనసేనాని పవన్ కళ్యాన్ పార్టీ అధినేత హోదాలో తొలి దీక్ష ప్రారంభిస్తున్నారు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వీరిద్దరి మధ్య రాజకీయంగా తీవ్ర స్థాయిలో వాదోపవదాలు కొనసాగుతున్నాయి. ఇసుక అంశం.. రాజధాని.. ఇంగ్లీషు మీడియం స్కూళ్ల విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీరున పవన్ తీవ్రంగా విమర్శించారు. ఇసక కొరత..భవన నిర్మాణ కార్మికులకు అండగా విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించారు. ఆ తరువాత ఇప్పుడు రైతుల సమస్యల మీద దీక్షకు దిగుతున్నారు. రాయలసీమలోనూ అక్కడ రైతుల పరిస్థితుల పైన పవన్ ప్రభుత్వంపైన విరుచుకుపడ్డారు. ఇక, అసెంబ్లీ సాగుతున్న సమయంలో పవన్ చేస్తన్న ఈ దీక్ష అక్కడ సైతం చర్చ కు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది.
కాకినాడ కేంద్రంగా..
పవన్ కళ్యాన్ చేస్తున్న ఈ దీక్షకు రైతు సౌభాగ్య దీక్ష గా ఖరారు చేసారు. కాకినాడ జేఎన్టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో జనసే న ఏర్పాట్లు చేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి బకాయిలు చెల్లించాలని, మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనే డిమాండ్లపై పవన్ దీక్ష చేస్తున్నారు. నాదెండ్ల మనోహర్, నాగబాబుతో కలసి పవన్ దీక్షా ప్రాంగణానికి చేరుకుని ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభిస్తారు. రాత్రి వరకు దీక్ష కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే అంశం పైన ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చకు వచ్చింది. అయితే, మద్దతు ధరకు సంబంధించి పత్రికల్లో ప్రకటనలు ఇస్తామని.. రైతులు అంతకంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అసవరం లేదని సీఎం ప్రకటించారు. ఇక, ఇప్పుడు రైతుల పక్షాన దీక్షకు దిగిన పవన్..ప్రభుత్వం ముందు ఉంచే డిమాండ్లు ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, ఈ దీక్షకు టీడీపీ నుండి ఎటువంటి స్పందన వస్తుందనే దాని పైన చర్చ సాగుతోంది.
సొంత ఎమ్మెల్యేతో కొత్త టెన్షన్..
అసెంబ్లీలో జనసేనకు ఒకరే ఎమ్మెల్యేగా ఉన్నారు. రాపాక వరప్రసాద్ ఇప్పుడు పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కటం లేదనే అభిప్రాయంతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయన సభలో ఇంగ్లీషు మీడియం పాఠశాలల విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. పవన్ అభిప్రాయానికి విరుద్దంగా ఏకపక్షంగా సీఎం నిర్ణయానికి మద్దతు తెలిపారు. గతంలోనూ బడ్జెట్ పైన ప్రసంగం సమయంలోనే ఇదే రకంగా వ్యవహరించారు. అయితే, పార్టీలో తనకున్న ప్రాధాన్యత గురించి తరువాత మాట్లాడుదామంటూ రాపాక వర ప్రసాద్ చేసిన కామెంట్లు ఇప్పుడు కొత్త చర్చకు కారణమయ్యాయి. అదే సమయంలో తమ పార్టీ అధినేత చేస్తన్న దీక్షకు హాజరు కావటం లేదని ఆయన స్పష్టం చేసారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్న కారణంగానే వెళ్లటం లేదన్నారు. అయితే, రాపాక వైసీపీతో సఖ్యతగా ఉంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో..ఇప్పుడు ఆయన విషయంలో పవన్ ఏ రకంగా వ్యవహరిస్తారనేది జనసేనలో సాగుతున్న హాట్ టాపిక్.