మంచి సందేశంతోపాటు పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతోపాటు తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. దీపాన్ని పరబ్రహ్మ తేజస్సుగా, మనోవికాసానికి రూపంగా భావిస్తారని.. అటువంటి దీపాన్ని ఆరాధించే రోజు దీపావళి అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
కులమతాలకు అతీతంగా భారతీయులు అందరూ ఆనందంగా.. ఉత్సాహంగా జరుపుకునే పండగ ఈ దీపావళి అని అన్నారు. ఈ శుభతరుణంలో దేశ ప్రజలు, తెలుగు వారందరికీ తన తరపున, జనసేన పార్టీ తరపున దీపావళి శుభాకాంక్షలు అంటూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కార్మిక, కర్షక, రైతుల జీవితాలలో ఈ దీపకాంతులు కొత్త కాంతులు తేవాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. వర్ష రుతువు కారణంగా వచ్చే క్రిమి కీటకాదులు అనారోగ్యానికి కారణమవుతుంటాయి. వాటిని పారద్రోలడానికి దీపాలు వెలిగించడం, బాణాసంచా కాల్చడం ఆరోగ్యదాయకమని మనం భావిస్తాము. అందువల్ల పర్యావరణానికి హాని చేయని మోతాదులోనే బాణాసంచా కాలుద్దాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఈ దీపావళిని ఆరోగ్య దీపావళిగా జరుపుకుందామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
దీపావళి విశిష్టత: పూజ ఎప్పుడు జరపుకోవాలంటే..
చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్ళు, ఈ దివ్య దీపావళి సోయగాలు. ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజమాసంలో అమవాస్య రోజున దీపావళి వస్తుంది.దీపావలి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్థశి రోజున నరక చతుర్థశిగా జరుపుకుంటారు.
ఆ రోజు మంగళ స్నానాలు చేస్తారు.హారతులు తీసుకుంటారు.ఈ పండగకు కూతుళ్ళను ,అల్లుళ్ళని ఇంటికి ఆహ్వానిస్తారు,వారికి కానుకలు ఇచ్చి గౌరవిస్తారు. దీపావళి పండుగ కేవలం హిందువులే కాకుండా అన్ని మాతల వారు అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో దీపావళికి ప్రథమ స్థానం ఉంది.దక్షిణాది ప్రాంతాలకంటే ఉత్తర భారత దేశాల్లో ఈ పండుగను అంత్యంత వైభవంగా ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటారు.
ఈ సంవత్సరం నరక చతుర్దశి - హారతులు అక్టోబర్ 27 ఆదివారం రోజు చతుర్దశి ఘడియలు మధ్యాహ్నం 12 :23 నిమిషాల వరకు ఉన్నాయి. శాస్త్ర ప్రకారం సూర్యోదయానికి పూర్వం 4 గంటల నుండి 6 లోపు హారతులు తీసుకోవాలి. వీలు పడని వారు ఉదయం 7:30 నిమిషాలలోపు తీసుకోవచ్చును. ( దీపావళి లక్ష్మీ పూజలు ) దీపావళి లక్ష్మి పూజలు ఆశ్వీయుజ అమావాస్య రాత్రి వేల ఉన్న ఘడియలలో మాత్రమే లక్ష్మి పూజలు జరుపుకోవాలి. అదేరోజు అనగా 27 అక్టోబర్ ఆదివారం 2019 రోజున మధ్యాహ్నం 12 :24 నిమిషాల నుండి ప్రారంభం అయ్యి మరుసటి రోజు అనగా 28 సోమవారం ఉదయం 9 :08 వరకు మాత్రమే అమావాస్య ఘడియలు ఉన్నాయి కాబట్టి దీపావళి లక్ష్మి పూజలు ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి జరుపుకోవాలి. తేదీ 28 సోమవారం రోజు కేదారవ్రతము జరిపించుకోవచ్చును గమనిక :- ఈ సంవత్సరం "విశాఖ కార్తె" పండగకు లేదు కాబట్టి కొత్త అల్లుళ్ళను కూతుళ్ళను పండగకు ఇంటికి రమ్మని ఆహ్వానిస్తూ పిలుసుకోవచ్చును.