ఢిల్లీకి పవన్ కళ్యాణ్: విశాఖ స్టీల్ ప్లాంట్ అంశమే కీలకం, ప్రధానితో భేటీకి ఛాన్స్
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్, సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీతోపాటు కేంద్రమంత్రులు, ఇతర బీజేపీ అగ్రనేతలను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతోపాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై కీలకంగా చర్చించనున్నారు.
ప్రధాని మోడీని కలవనున్న పవన్ కళ్యాణ్: విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై చర్చ
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రధానిని కలిసి ఈ విషయంపై చర్చిస్తానని చెప్పారు. మరోవైపు తిరుపతి ఉపఎన్నికపై బీజేపీ అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశం ఉంది.
కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు కేంద్రంపై మండిపడుతున్న విషయం తెలిసిందే. రాజకీయ పార్టీలతోపాటు కార్మిక సంఘాలు కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తున్నారు కార్మికులు. రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పునరాలోచించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ కూడా రాసింది. ఎన్నో పోరాటాలు, ప్రాణ త్యాగాల తర్వాత వచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం చేస్తే తీవ్ర సమస్యలు వస్తాయని పేర్కొంది.