చంద్రబాబు ఒప్పందాన్ని జగన్ గౌరవించాల్సిందే.. మూడు ముక్కలతో నష్టమే- పవన్ కామెంట్స్..
ఏపీలో పలు సమస్యలపై ప్రభుత్వాన్ని ఈ మధ్య తరచుగా ప్రశ్నిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా వైసీపీ సర్కారు ముందు మరో డిమాండ్ ఉంచారు. ఈ డిమాండ్ ను ప్రభుత్వం నెరవేర్చి తీరాల్సిందేనని స్పష్టం చేశారు కూడా. అయితే అది వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీ కాదు టీడీపీ గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం. దీన్ని జగన్ ప్రభుత్వం గౌరవించి తీరాలంటూ పవన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ఒప్పందాలు అమలు చేయబోమంటే కుదరని జనసేనాని స్పష్టం చేశారు.
ఒప్పందం చంద్రబాబుదైనా...
గతంలో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం వివిధ సంస్ధలతో పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇదే కోవలో అమరావతి రైతులతోనూ రాజధాని నిర్మాణం కోసం ఒప్పందం చేసుకుంది. రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాల భూములిస్తే నవ్యాంధ్రకు కొత్త రాజధాని నిర్మాణంతో పాటు భూములిచ్చిన రైతులకు కూడా అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇస్తామని. అయితే రాజధాని నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఫ్లాట్లు ఇవ్వలేక టీడీపీ అభాసుపాలైంది. ఇప్పుడు రాజధాని తరలింపు కోసం జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమం 200 రోజులు దాటింది. దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని జగన్ సర్కారు అమలు చేయాలనే డిమాండ్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరపైకి తెచ్చారు.
రాజధాని మార్పు ఏకపక్షం...
ఏపీ రాజధానిగా అమరావతి నిర్ణయమై రైతులు 34 వేల ఎకరాల భూములు సమర్పించుకున్నాక తమ పాలన వచ్చింది రాజధాని మార్చుకుంటామని ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం వారిని అవమానించడమేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రాజధాని కోసం 200 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమానికి బీజేపీతో కలిసి అండగా ఉంటామని, 29 వేల మంది రైతుల త్యాగాలు వృథాకానివ్వబోమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఓ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తర్వాత పాలకులు అమలు చేయాలని, గత ప్రభుత్వం వేరు, మా ప్రభుత్వం వేరు అనడం సరికాదన్నారు. రైతులు భూములిచ్చింది ప్రభుత్వానికి తప్ప వ్యక్తులకు, పార్టీలకు కాదన్నారు.
మూడు రాజధానులతో వికేంద్రీకరణ కాదు...
రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి ప్రతీ ప్రాంతం అభివృద్ధి చెందాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రాజధానిని ముక్కలు చేయం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ అయినట్లు కాదన్నారు. ఏ జిల్లాను ఎలా అభివృద్ధి చేయాలి, ఏయే రంగాలను ఏ జిల్లాల్లో అభివృద్ధి చేయాలి, అక్కడ ఏర్పాటు చేసే ప్రాజెక్టులు ఏంటనే అంశాలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని పవన్ కోరారు. ప్రస్తుతం అమరావతి రైతులకు ఏటా ఏప్రిల్ లో ఇవ్వాల్సిన కౌలు ఉద్యమాలు చేస్తే కానీ ఇవ్వడం లేదని పవన్ తెలిపారు. ఈసారి కూడా కౌలు చెల్లింపు కోసం జీవో ఇచ్చినా డబ్బులు మాత్రం ఇంకా అందలేదన్నారు.