ముద్దులు పెడితే రైతుల ఆకలి తీరుతుందా .. అసెంబ్లీలో చర్చించండి లేదంటే... పవన్ కళ్యాణ్ ఫైర్
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న నిత్యావసర వస్తువుల ధరలపై ట్విట్టర్ వేదికగా వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు రైతు సమస్యలపై వైసిపి ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. రైతుల కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో స్పష్టం చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర అందిస్తామనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా చెప్పాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
టీడీపీ ప్రతిపక్ష హోదాపై వైసీపీ గురి పెట్టిందా? అసెంబ్లీ సమావేశాల్లోనే ఆ పని పూర్తవుతుందా?
రైతు సమస్యల గురించి రైతు సదస్సులో మాట్లాడిన పవన్ కళ్యాణ్
మండపేటలో జనసేన రైతు సదస్సులో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.పాదయాత్రలు చేసి ముద్దులు పెడితే రైతుల కడుపు నిండదని ఆయన ఎద్దేవా చేశారు.రక్తమాంసాలు ధారపోసి రైతులు అహర్నిశలు కృషి చేసి పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలు ఇవ్వడంలేదని జగన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
అసెంబ్లీలో మొదటి మూడు రోజుల్లో చర్చ చేసి రైతులకు న్యాయం చెయ్యాలని డిమాండ్
రైతులకు భరోసా ఇవ్వాలని , రైతులను బ్రతికించాలని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పవన్. అంతేకాదు రైతుల సమస్యల కోసం తాను రాజీలేని పోరాటం చేస్తానని చెప్పిన పవన్ అసెంబ్లీ సమావేశాల్లో రైతు సమస్యలపై మాట్లాడాలని గుర్తు చేశారు. అసెంబ్లీ మొదటి మూడు రోజుల్లో రైతు సమస్యలను పరిష్కరించకపోతే కాకినాడలో నిరాహారదీక్ష చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. రైతులకు కనీస మద్దతు ధరను అందించాలని డిమాండ్ తో పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు.
ముద్దులు పెడితే రైతుల ఆకలి తీరదన్న పవన్
ఇక పవన్ కళ్యాణ్ ఏ విషయం జగన్మోహన్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వేలకోట్ల ఆస్తులు, సొంత ఇళ్ళు ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వ నిధులకోసం ఆశపడుతున్నారని పవన్ పేర్కొన్నారు. ముద్దులు పెడితే ఆకలి తీరదని చురకలంటించారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో ఆర్ధికంగా వెనుకబడినవారికి, రైతు బిడ్డలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని పవన్ తెలిపారు. మొత్తానికి రైతు సమస్యలు పరిష్కరించకుంటే, అసెంబ్లీలో రైతు సమస్యలపై చర్చ జరగకుంటే పవన్ కళ్యాణ్ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి వైసిపి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.
12న రైతు సమస్యల కోసం కాకినాడలో పవన్ నిరాహార దీక్ష
ఈ నెల 12న రాష్ట్ర రైతాంగ సమస్యల పరిష్కారం కోసం చేసే నిరాహార దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పవన్ కోరారు.ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడలో నిరసన దీక్ష చేయనున్నట్టు తెలిపారు. అన్నదాత పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన పేర్కొన్నారు . వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలను పూర్తిగా విస్మరించడంతో ఏపీలో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ దీక్షను విజయవంతం చేసి ప్రభుత్వానికి రైతుల కష్టాలు కనిపించేలా చేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు.