"అన్న"వరం:దివ్యాంగులకు పవన్ కల్యాణ్ తోడ్పాటు...5 లక్షల ఆర్థిక సాయం
జనసేన అధినేత పవన కల్యాణ్ మరోసారి తన మానవీయత చాటుకున్నారు. తమకు సాయం చేయాలంటూ కోరిన దివ్యాంగులకు ఊహించని సాయం అందించి వారి మనసుల్ని గెల్చుకున్నారు.
తాము టీ ట్వంటీ క్రికెట్ టోర్నీ నిర్వహించుకుంటున్నామని సాయం చెయ్యాలని దివ్యాంగులు కోరగా వారికి అప్పటికప్పుడు కు రూ. 5 లక్షలు సాయం అందించారు. బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) సభ్యులైన దివ్యాంగ క్రికెట్ క్రీడాకారులు బుధవారం హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ను కలిశారు.
వారి వినతికి స్పందించిన పవన్ కల్యాణ్ అప్పటికప్పుడు 5 లక్షల రూపాయలకు చెక్కు రాసి ఆ దివ్యాంగ క్రికెటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంగ వైకల్యం అనేది ప్రతిభకు ఏ మాత్రం అడ్డంకి కాదని, ఈ విషయాన్ని దివ్యాంగులైన క్రికెటర్లు నిరూపిస్తున్నారని అన్నారు. ఆత్మస్ధైర్యంతో క్రీడల్లో పాల్గొనడం దివ్యాంగులందరికీ స్ఫూర్తినిస్తుందని ఆయన చెప్పారు.
బోర్డ్ ఆఫ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ (బీడీసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 14 నుంచి 18 వరకూ హైదరాబాద్లో దివ్యాంగుల రెండో జాతీయ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఈ పోటీల్లో 24 రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొననున్నాయి.