ఉండవల్లి అరుణ్ చెప్పింది నిజం.. అందుకే నా ఫ్యాన్స్ జనసేనకు ఓటేయలేదు: పవన్ కల్యాణ్
''ఒక రోగి బాగుపడాలని డాక్టర్ ఎలా కోరుకుంటాడో... అనేక రుత్మతలున్న ఈ సమాజాం మెరుగుపడాలని నేను కూడా కోరుకుంటాను. బేసిగ్గా కీడెంచి మేలెంచేవాణ్ని కాబట్టి.. జరగబోయే విపత్తులను ముందే ఊహించి హెచ్చరించాను. అమరావతి విషయంలో నా ఊహే నిజమైంది. రాజధాని వివాదం కేవలం రెండు కులాల మధ్య గొడవలా తయారైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాట నూరుశాతం నిజం. అయితే ఈ పరిస్థితుల్ని మార్చేసి, సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడం జనసేన పార్టీకి మాత్రమే సాధ్యం''అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఆదివారం వివిధ నియోజకవర్గాల జనసేన కార్యకర్తలతో ఆయన భేటీ అయ్యారు. బీజేపీతో పొత్తు, బీజేపీని ఢీకొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఏపీలో కుల రాజకీయాలు, తన అభిమానులను ఉద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
2వేలకు ఓటు అమ్ముకున్న ప్రజలకు.. 2వేల కోట్లు తిన్న చంద్రబాబు పీఏను ప్రశ్నించే హక్కులేదు: పవన్ కల్యాణ్
జనసేన ఉద్యమ పార్టీ కాదు..
‘‘సమాజంలో కుళ్లును కడిగేయడానికే జనసేన పార్టీ పుట్టింది. అలాగని ఇదేదో ఉద్యమ పార్టీ కానేకాదు. నేను రాజకీయ అధికారం కోరుకోని వ్యక్తిని కాను. కచ్చితంగా అందుకే పార్టీ పెట్టాను. ప్రజల్ని నావైపుకు తిప్పుకునే రాజకీయాలే చేస్తాను. నిజంగా ఆశయాలను మాత్రమే ప్రజలకు చెప్పాలనుకుంటే సింపుల్ గా ఒక స్వచ్ఛంద సంస్థను పెట్టేవాణ్ని. అధికారంలోకి రావాలన్న కోరిక ఉంది కాబట్టే రాజకీయ పార్టీ పెట్టాను. ఇందులో కుళ్లుకుతంత్రాలు ఉంటాయని తెలిసే ముందుకొచ్చాను.
నా అభిమానులు లొంగిపోయారు..
2014 నుంచి నన్ను నేను తయారుచేసే పనిలో బిజీగా ఉండిపోయాను. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతే నాకు అసలు సత్యాలు బోధపడ్డాయి. ఎవరు మనవాళ్లో, ఎవరు కాదో అర్థమైంది. ఈమధ్యే కర్నూలుకు వెళ్లినప్పుడు నాకెవరో చెప్పారు.. ప్రతి వార్డులో ఐదుగురు జనసేన కార్యకర్తలుంటే.. కనీసం 500 మంది అభిమానులు ఉంటారని, కానీ వాళ్లెవరూ పార్టీకి ఓటేయలేదని గుర్తుచేశారు. నా అభిమానులు ప్రలోభాలకు లొంగిపోయారు కాబట్టే జనసేనకు ఓట్లేయలేదు. నేను పర్యటనలకు వెళ్లినప్పుడల్లా జేజేలు పలికిన అభిమానులు.. తీరా ఎన్నికలప్పుడు మాత్రం కులం, వర్గం, భయాలు, ప్రలోభాలకు లొంగిపోయి వేరేవాళ్లకు ఓట్లేశారు. అయితే పార్టీ కోసం నిలబడ్డవాళ్లు మాత్రం చాలా బలంగా పనిచేస్తుండటం చాలా నమ్మకం కలిగించింది. నా ఆశయాలు సాధిస్తాననే ధైర్యం కలుగుతుంది.
ఏపీలో కులాలే కీలకం..
రాష్ట్ర రాజకీయాల్లో కులాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. కుల వ్యవస్థ బలంగా వేళ్లూనుకుపోయి ఉండటం చాలా దురదృష్టకరం. ఈ మురికి కూపాన్ని శుద్ధి చేయాడానికే నేను జనసేన పార్టీని పెట్టాను. దీనికి కులం, మతం, ప్రాంతీయతలకు తావు లేకుండా రాజకీయాలు చేయాలన్నదే నా అభిమతం. ఇండియాతోపాటు విదేశాలపైనా అధ్యయనం చేశాను. పార్టీ నిర్మాణానికి సంబందించి మనకింకా నాలుగేళ్ల సమయం ఉంది. రివ్యూ మీటింగ్స్ అయిపోయిన తర్వాత మండల కమిటీలు వేసి, సభ్యులకు ట్రైనింగ్ ఇస్తాం.
బీజేపీతోనే కొలిసి నడుస్తాం..
జనసేనతో బీజేపీ పొత్తు అనగానే పార్టీలోనే చాలా మంది కంగారుపడ్డారు. మైనార్టీలకు వ్యతిరేకం అయిపోతాంకదాని భయపడ్డారు. వాళ్లందరికీ నేను కూర్చోబెట్టి అన్నీ చెప్పాను. మన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరితో కలిసి పనిచేయాలన్న కోణంలోనే నేను నిర్ణయాలు తీసుకుంటాను తప్ప.. ఓ మతం ఓట్లు పడవనో, కొన్ని కులాల వాళ్లు దూరమైపోతారనో నేను భయపడను. సమాజానికి, దేశానికి మాత్రమే అనుకూలంగా ఉంటాను. ఈ సిద్ధాంతాలు నచ్చినవాళ్లు పార్టీలో ఉంటారు లేనివాళ్లు వెళ్లిపోతారు. ఈ మాత్రం స్పష్టత లేకుంటే రాజకీయాలు చాలా కష్టం. నా ఒక్కడి కోసమే అయితే సినిమాలు సరిపోతాయి. కానీ సమాజాన్ని బాగు చెయ్యాలి కాబట్టే పార్టీ పెట్టాను. అంబేద్కర్, గాంధీ, నేతాజీ అడుగుజాడల్లో నడిచేవాడిని. డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు.. డబ్బుల కోసమే మళ్లీ సినిమాల్లోకి వెళ్లాను.
ఢిల్లీలో ఆప్.. ఏపీలో జనసేన..
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయాన్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. జనసేనతో కలిసి నడుస్తూ చాలా బలంగా ఉన్న బీజేపీని ఆప్ ఢీకొట్టిందంటే నేను నమ్మలేకపోయా. మొన్న ఢిల్లీకి వెళ్లినప్పుడు చూసిందేంటే.. ప్రజలకు అవసరమైన పనుల్ని ఆప్ గుర్తించిందికాబట్టే, పనిచేసింది కాబట్టే జనం ఓట్లేశారు. ఓటర్లకు ఆప్ ఒక్కపైసా పంచలేదు. అదే ఆంధ్రప్రదేశ్లో మాత్రం.. సేవ చెయ్యడానికి జనసేన సిద్ధంగా ఉన్నా ప్రజలు మాత్రం సిద్ధంగా లేరు. అయితే దీనికి మనం కుంగిపోవాల్సినపనిలేదు. మన విలువల్ని నిర్దేశించాల్సింది సమూహమో, సమాజమో కాదు.. ధర్మం మాత్రమే. ఆ ధర్మమే జనసేనకు అండగా ఉంటుంది''అని పవన్ కల్యాణ్ వివరించారు.