వారి మరణం కలచివేసింది: ఆదుకుంటానంటూ పవన్ కళ్యాణ్
Recommended Video
విశాఖపట్నం: విశాఖ జిల్లా పాయకరావుపేటలో ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పవన్ సోషల్మీడియా ద్వారా స్పందించారు. వారి మృతి తనను కలచివేసిందని అన్నారు.
'పాయకరావుపేటలో చేపట్టబోయే పోరాట యాత్ర కోసం ఫ్లెక్సీలు కడుతూ ఇద్దరు కార్యకర్తలు విద్యుత్ షాక్తో మృతిచెందారనే వార్త నా మనసుని కలచివేసింది. ఈ దుర్ఘటనలో టి.నాగరాజు, బి.శివ మరణించడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను' అని పవన్ తెలిపారు.
'మృతుల కుటుంబీకులు ఎంత బాధపడుతున్నారో అర్థం చేసుకోగలను. వారి కుటుంబాలను స్వయంగా కలిసి పరామర్శిస్తాను. జనసేన పార్టీ ఆ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటుంది' అని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఇద్దరు కార్యకర్తల మృతి
జనసేన అధినేత పవన్ గురువారం పాయకరావుపేట రానున్న నేపథ్యంలో ఆయన అభిమానులు మంగళవారం అర్ధరాత్రి దాటాక పాయకరావుపేట ప్రధాన రహదారి పక్కన భవనంపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 33కేవీ విద్యుత్ తీగలకు ఫ్లెక్సీ ఇనుప రాడ్స్ తగిలి టి.నాగరాజు(28), భీమవరపు శివ(31) అక్కడికక్కడే మృతిచెందారు. శివ పాయకరావుపేట వాసి కాగా.. నాగరాజు స్వస్థలం తుని. ఈ ఘటనపై ఎస్ఐ ఎల్.రామకృష్ణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.