పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అభిమాని హల్చల్, పట్టించుకోని జనసేనాని!
కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తబెలగళ్లో క్వారీ పేలుడు ప్రాంతాన్ని సందర్శించారు. బాధితులను పరామర్శించారు. పవన్ వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు తరలి వచ్చారు. వారిని కట్టడి చేయడం పోలీసులు ముప్పుతిప్పలు పడ్డారు.
పవన్ పర్యటన సందర్భంగా అభిమానులు కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. అభిమానానికి హద్దులు ఉండాలని, మనం ఏ సందర్భంలో వచ్చామో చూసుకోవాలనేది జనసేనాని అభిప్రాయం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పార్టీని పెట్టామని, ప్రజల బాధలు వినే సమయంలో అభిమానులు కాస్త ఓర్పుగా ఉండాలని కూడా ఆయన సూచించిన సందర్భాలు ఉన్నాయి.
అభిమానులపై పవన్ పలుమార్లు ఆగ్రహం
గతంలో అభిమానుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అది అభిమానుల పట్ల ఆయనకు ఉన్న కోపం కాదని, పరిస్థితిని బట్టి నడుచుకోలేక అభిమానులు కొందరు అత్యుత్సాం ప్రదర్శించి ఆయనకు విసుగు తెప్పిస్తారని అంటున్నారు. తాజాగా హత్తిబెళగళ్ పర్యటనలోను ఓ వీరాభిమాని పవన్కు ఆగ్రహం తెప్పించాయట.
అభిమాని హల్చల్
ఓ అభిమాని ఇంటి రేకుల షెడ్డు పైకి ఎక్కిన అతను బాగా అరుస్తూ, జనసేన జెండా ఊపుతూ నినాదాలు చేశాడు. పలువురు వారిస్తున్నా అతను ఆగలేదు. అతను రేకుల షెడ్డు పైనుంచి పడతాడని కొందరు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత అతనిని కిందకు దించారు. అయితే పవన్ మాత్రం అతని తీరు పట్టించుకోకుండా తన మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చామో తెలియకుండా ఇలా ప్రవర్తించడం వల్లే పవన్ పట్టనట్లుగా వ్యవహరించారని అంటున్నారు.
క్వారీని పరిశీలించి, కర్నూలు ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ
పవన్ రాక సందర్భంగా కర్నూలు నగరంలోని టోల్గేట్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు అభిమానులు పెద్దఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం హత్తిబెళగల్కు వెళ్లిన ఆయన ప్రమాదానికి కారణమైన క్వారీని పరిశీలించారు. ఆ తర్వాత కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
యువకులు సమస్యలు తీసుకొస్తున్నారు
హత్తిబెళగల్ క్వారీ పేలుడు ఘటన దురదృష్టకరమని పవన్ అన్నారు. చంద్రబాబు ఈ విషయంలో టీడీపీ నేతలను సమర్థించి ప్రజా సమస్యలను విస్మరించవద్దన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతుంటే గనుల శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులు ఏం చేస్తున్నారన్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 1600 క్వారీలకు అనుమతులు ఇచ్చారని, 600 వరకు అక్రమ క్వారీలు నడుస్తున్నాయని స్థానిక యువత తన దృష్టికి తీసుకొచ్చినట్లు పవన్ తెలిపారు. యువకులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై త్వరలో స్పందిస్తానని చెప్పారు.