ఫ్యాన్స్ కౌంటర్: క్రిస్టల్ క్లియర్.. 2019 కోసం టార్గెట్ పవన్, వెనుక ఎవరైనా ఉన్నారా!?
Recommended Video
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై నటి శ్రీరెడ్డి ఆదివారం ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజా సమస్యలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని, ఎన్నికల కోసమే ఇదంతా అని, ప్రజారాజ్యం పార్టీని ఎందుకు కొనసాగించలేదని ప్రశ్నించారు. అయితే దీనికి జనసేనాని అభిమానులు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు.
'పవన్! మా బాస్ జగన్ను అంటావా, ఒళ్లుదగ్గర పెట్టుకో, చిరంజీవి వాడుకొని'
కేవలం శ్రీరెడ్డి మాత్రమే కాదు.. ఇతర నాయకులు కూడా జనసేనానిని సమస్యలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అని ప్రశ్నిస్తున్నారు. అయితే, ప్రశ్నిస్తానని చెప్పిన తాను మొదటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాననేది పవన్ సమాధానంగా భావించవచ్చు. అమరావతి మొదలు.. నేటి వరకు ఆయన సౌమ్యంగానో, గట్టిగానే నిలదీస్తున్నారని గుర్తు చేస్తున్నారు.
శ్రీరెడ్డికి అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందన
ప్రజా సమస్యలపై పవన్ ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించిన శ్రీరెడ్డికి ఓ నెటిజన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండి కాస్టింగ్ కౌచ్ గురించి మీరు ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగారు. అంటే ఇప్పుడు నీకు ఎవరూ డబ్బులు ఇవ్వడం లేదని కాస్టింగ్ కౌచ్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. శ్రీరెడ్డికి అనుకూలంగా, వ్యతిరేకంగా నెటిజన్లు స్పందిస్తున్నారు.
పవన్ కొత్తగా సమస్యల గురించి మాట్లాడటం లేదు
పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో చాలా క్లియర్గా ఉన్నారని అభిమానులు చెబుతున్నారు. 2014లో నవ్యాంధ్ర భవిష్యత్తు కోసం పోటీ చేయలేదని, ఆయన కొత్తగా ప్రశ్నించడం మొదలు పెట్టలేదని, 2014 ఎన్నికలకు ముందు పార్టీ పెట్టి, టీడీపీ-బీజేపీ తరఫున ప్రచారం చేసి, ఆ పార్టీలు గెలిచిన తర్వాత.. కొన్నాళ్లు వేచి చూసి, ప్రతి సమస్యపై స్పందిస్తున్నారని జనసేన అభిమానులు గుర్తు చేస్తున్నారు.
అమరావతి నుంచి మొదలు
పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికి ఇప్పుడు సమస్యలపై స్పందించడం లేదని, నాలుగేళ్ల క్రితమే అమరావతి రాజధాని మొదలు తన పోరాటం ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు. అయితే అప్పుడు పవన్ను దూరం చేసుకోవడం ఇష్టంలేని టీడీపీ సానుకూలంగా స్పందించిందని, ఇప్పుడు పవన్ మరింత గట్టిగా నిలదీస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఉద్ధానం సమస్య గురించి పవన్ ఈ రోజు మాట్లాడటం లేదని, గతంలోనే లండన్ వెళ్లినప్పుడు ఈ ప్రస్తావన తెచ్చారని, అక్కడి వైద్యులను తీసుకు వచ్చారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి సమస్యల గురించి జనసేనాని ఇప్పుడు పోరాడుతున్నారని చెప్పడం శుద్ధ అబద్దమంటున్నారు.
ఎన్నికల కోసం పర్యటన
ఇక, పర్యటనల విషయానికి వస్తే.. ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్నాడు కాబట్టి, వచ్చే ఎన్నికల కోసం జనసేనను సమాయత్తం చేసేందుకు పర్యటిస్తున్నారని చెబుతున్నారు. సమస్యలపై ఎప్పటి నుంచో పోరాడుతున్న పవన్.. 2019 ఎన్నికల కోసం ఉత్తరాంధ్ర నుంచి పర్యటన ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు, జగన్లు కూడా అప్పుడే ఎన్నికల ప్రచారం పరోక్షంగా ప్రారంభించారని గుర్తు చేస్తున్నారు.
తేలిపోయింది.. శ్రీరెడ్డి టార్గెట్ పవన్!
శ్రీరెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే 2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు. అందుకు ఆమె భిన్న వైఖరి నిదర్శనమని చెబుతున్నారు! ఓ వైపు వైసీపీ అధినేత జగన్ తన బాస్ అని చెబుతూ, మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబును గ్రేట్ అని ప్రశంసించడాన్ని గుర్తు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ కనిపించనున్న నేపథ్యంలో ఆమె పవన్ను టార్గెట్ చేశారని అంటున్నారు. ఆమె వెనుక ఎవరన్నా ఉన్నారా అనే అనుమానాన్ని కూడా నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మామ స్థాపించిన పార్టీని నడుపుతుంటే, జగన్ తండ్రి పేరును ఉపయోగించుకొని ముందుకు సాగుతున్నారని, కానీ పవన్ అలా కాదని అంటున్నారు.