యాత్రికుల సేవలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్: ప్రయాణీకుల్ని కాపాడి, డ్రైవర్ మృతి
ఏలూరు: గోదావరి పుష్కరాలకు వచ్చిన భక్తులకు ఉచిత బస్సు సర్వీసు నడుపుతున్న డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. అంతకుముందే బస్సును సురక్షితంగా నిలిపి, ప్రయాణీకులను కాపాడాడు.
జిల్లా కొవ్వూరులో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కొవ్వూరులో ఉచిత సర్వీసు నడుపుతున్న డ్రైవర్ హనుమంత రావుకు ఛాతి నొప్పి వచ్చింది. కొవ్వూరు ఈజీకే రోడ్డు నుంచి నందమూరు రోడ్డు వైపు వెళ్తుండగా ఛాతినొప్పి ఎక్కువైంది.
తనకు ఛాతి నొప్పి ఎక్కువ కావడంతో డ్రైవర్ వాహనంను పక్కకు నిలిపి వేసి దిగిపోయాడు. అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా కార్యక్రమాలు
గోదావరి పుష్కరాల నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిమానులు గోష్పాద వద్ద స్వచ్చంధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు మంచి నీరు అందిస్తున్నారు. తెలియని వారికి దారి చూపించడం, ట్రాఫిక్ చిక్కులు సరిదిద్దటం వంటివి చేస్తున్నారు.