'లోకేష్ అంటే గజగజ, పవన్ కళ్యాణ్కు పెళ్లిళ్లపై అవగాహన లేదు'
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ చెప్పినట్లుగా జనసేన పిడికిలి గుర్తు ఐక్యతకు చిహ్నం కాదని, తిరుగుబాటుకు చిహ్నం అన్నారు.
Recommended Video
మోడీకి రూ.20 కోట్లు ఇస్తే జీవీఎల్కు పదవి, భారతి ఏమో కానీ.. రోజా మాత్రం: టీడీపీ నేత తీవ్రవ్యాఖ్య
నవ్యాంధ్ర ప్రదేశ్ అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి పదవి కావాలని అనుకుంటే రాజకీయ నాయకుడికి ఓర్పు, సహనం, నేర్పు అవసరమని చెప్పారు. పవన్ కళ్యాణ్కు మెంటల్ బ్యాలెన్స్ తప్పిందన్నారు. జనం కూడా అలాగే భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.
లోకేష్ను చూసి గజగజ వణుకుతున్నారు
మంత్రి నారా లోకేష్ను చూసి పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని చూసి వణికిపోతున్నారని జూపూడి ప్రభాకర రావు అన్నారు. లోకేష్ను చూసి పవన్ కళ్యాణ్ గజగజ వణుకుతున్నారని వ్యాఖ్యానించారు. నారా లోకేష్ తనకు అప్పగించిన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని జూపూడి అన్నారు. తాత ముఖ్యమంత్రి అయినా, తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటికీ అధికారులతో లేదా కార్యకర్తలతో హుందాగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.
లోకేష్ సీఎం కావాలనుకుంటున్నట్లు ఎప్పుడైనా చెప్పారా?
ముఖ్యమంత్రి కావడానికి లోకేష్కు అంత తొందర ఎందుకు.. మీ తాత ఎన్టీఆర్ 60 ఏళ్ల వయస్సులో సీఎం అయ్యారని మంత్రిని ఉద్దేశించి జనసేనాని చెబుతున్నారని, కానీ అసలు లోకేష్ సీఎం కావాలనుకుంటున్నట్లు ఎప్పుడైనా చెప్పారా అని నిలదీసారు.
లోకేష్ గురించి తెలియదా?
2014 నుంచి 2018 వరకు లోకేష్తో కలిసి ఉన్నారని, అలాంటి వ్యక్తి గురించి మీకు తెలియదా అని పవన్ను జూపూడి అడిగారు. లోకేష్కు సంబంధించిన విషయమై వితండవాదాన్ని మానుకోవాలని సూచించారు. ఆయనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. సీఎం పదవి అంటే వడ్డించే విస్తరి కాదన్నారు. అలాగే ఉర్రూతలూగించే ప్రసంగాలు, ఆవేశంతో ఊగిపోవడం కాదని పవన్కు చురకలు అంటించారు.
పెళ్లిళ్లపై పవన్కు అవగాహన లేదు
చంద్రబాబు, జగన్, పవన్లలో ఎవరిని సీఎం చేస్తారని రాష్ట్ర ప్రజలను జనసేనాని అడుగుతున్నారని, ప్రజలు వచ్చే ఎన్నికల్లో నిర్ణయిస్తారని జూపూడి చెప్పారు. సమాజంపై, భారతీయ సంస్కృతిపై, కుటుంబ వ్యవస్థపై, పెళ్లిళ్లపై పవన్కు అవగాహన లేదన్నారు. అవగాహన ఉన్న నాయకుడిలా కనిపిస్తారని, అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తారన్నారు. హోదా ఇవ్వని ప్ఱధాని మోడీని అడగకుండా చంద్రబాబును అడగడం ఏమిటన్నారు. హోదాపై యూటర్న్ తీసుకున్నది చంద్రబాబు కాదని, మోడీ అన్నారు. పార్లమెంటులో అవిశ్వాసం పెడితే తాను ఢీల్లీకి వచ్చి మద్దతు కూడగడతానని పవన్ చెప్పారని, కానీ అప్పుడు ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు.