ఎక్కడ చూసినా భూ కబ్జాలు...స్వర్ణాంధ్ర కాదు...దోపిడీ ఆంధ్ర:చంద్రబాబు, జగన్ను చూశారు...పవన్నూ చూడండి
Recommended Video
పశ్చిమ గోదావరి: రాష్ట్రంలో ఎక్కడా చూసినా భూ కబ్జాలు...రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాలు కబ్జా చేశారు...చంద్రబాబు చేసేది స్వర్ణాంధ్ర కాదు.. దోపిడీ ఆంధ్రప్రదేశ్...అని జనసేన అధినేత పవన్కల్యాణ్ టిడిపి ప్రభుత్వంపై మండిపడ్డారు.
పశ్చిమగోదావరి జిల్లాలో రెండోవిడత పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ నిడదవోలు, తాడేపల్లిగూడెంల్లో సోమవారం బహిరంగ సభల్లో ప్రసంగించారు. "లక్ష కోట్లు దోచేశారని చెబుతున్న జగన్ను చూశారు...లక్షన్నర కోట్లు దోచేశారంటున్న చంద్రబాబును చూశారు...ఆ రెండూ దోపిడీ పార్టీలే...పవన్నీ చూడండి...2019 ఎన్నికల్లో ఎవరిని ముఖ్యమంత్రిని చేస్తారో మీ ఇష్టం" అని పవన్ తన ప్రసంగంలో కోరారు.
అదే సాక్ష్యం...అందుకే జనసేన
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ..."రాష్ట్రంలో టిడిపి ఇష్టారాజ్యంగా భూ కబ్జాలకు పాల్పడుతోంది...తెలుగుదేశం పార్టీ నాయకులు చెరువులను సైతం మింగేస్తున్నారు...తాడేపల్లిగూడెంలో 33వ డివిజన్లో చెరువును కబ్జాచేయడమే అందుకు ప్రత్యక్ష సాక్ష్యం"...అని చెప్పారు. జవాబుదారీతనంతో కూడిన రాజకీయ వ్యవస్థను తీసుకురావాలని, రాజకీయ ప్రక్షాళన చేయాలని జనసేన స్థాపించానని పవన్ కళ్యాణ్ తెలిపారు.
టిడిపి నాటకాలు...పవన్ తో కుదరవు
ప్రత్యేక హోదాపై ముందు నుంచీ పోరాడుతున్నట్లు టిడిపి ఎంపీలు పార్లమెంటులో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని పవన్ దుయ్యబట్టారు. వీళ్లు 2016 నుంచి పోరాడితే ప్రత్యేకహోదా వచ్చి ఉండేదన్నారు. ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలన్న సిఎం చంద్రబాబు వందసార్లు మాట మార్చారని విమర్శించారు. ఇక వైసిపి అధ్యక్షుడు జగన్ అసెంబ్లీ నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు. టిడిపి వెన్నుపోటు రాజకీయాలు పవన్తో కుదరవని, తేడా వస్తే కర్ర పట్టుకుని పోరాటం సైతం చేస్తామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
కాపు రిజర్వేషన్లపై...పోరాటం
రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలంటే టిడిపి నాయకులకు లంచాలు, వాటాలివ్వాలని, అందుకే పరిశ్రమలు రావడం లేదని పవన్ ఆరోపించారు. రోడ్లు అత్యంత దారుణంగా తయారైతే సిఎం చంద్రబాబుకు, ఆయన కుమారుడు లోకేష్కు కనిపించడం లేదన్నారు.జనసేన సింబల్ పిడికిలి అని, అంతా కలిసి ఉండాలని జనసేన కోరుకుంటోందన్నారు. వికలాంగుల సంక్షేమం కోసం మెరుగైన విధానాన్ని తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నామన్నారు. కాపు రిజర్వేషన్లపై టిడిపి, వైసిపి దొంగ నాటకాలు ఆడాయని, తొమ్మిదో షెడ్యూల్లో పెట్టే విధంగా తాము పోరాటం చేస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.
పవన్ ను చూడండి...జోరు వానలో ఎదురు చూశారు
ప్రజల తీర్పు ఏదైనా జనసేన జనానికి అండగా పనిచేస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పారు. టిడిపి గూండాలకు, రౌడీలకు తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. 2019లో జనసేన అధికారంలోకి వచ్చాక అవినీతిపై అన్నీ తేలుస్తామని ఆయన హెచ్చరించారు. ఇదిలా వుంటే రాష్ట్రంలో కొన్ని రోజులగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో జోరువానలో సైతం పవన్ కోసం జనం ఎదురుచూస్తూ ఉండటం గమనార్హం.