సిఎం చూస్తున్నారా?...లేక ఆయనే రెచ్చగొడుతున్నారా?;విదేశాలకు వెళ్తే ఇలా అన్నారు:పవన్ కళ్యాణ్
పశ్చిమగోదావరి:పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటన సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు ఎపి రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.
ఎవరు ఎవరితోనే పడుకుంటే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా?: దెందులూరులో జనసేనాని (ఫోటోలు)
జిల్లాలోని టిడిపి ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే కలకలం రేపగా తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఒకప్పుడు పచ్చగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లా నేడు కాలుష్యం పెరిగిపోయి దారుణంగా తయారైందని, ఇదంతా ముఖ్యమంత్రి చూస్తున్నారా?...లేక ఆయనే చేస్తున్నారా?...అంటూ పవన్ చేసిన ప్రసంగం దుమారం రేపుతోంది. పవన్ ఇంకా ఏమన్నారంటే?...
పవన్ కళ్యాణ్...విమర్శల వర్షం
రాష్ట్రంలో ఎక్కడా లేని భయాందోళన పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొందని జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఈ జిల్లాలో పవన్కల్యాణ్ మలి విడత ప్రజాపోరాట యాత్ర కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ టిడిపి ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు, విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అయితే తాజాగా శుక్రవారం సిఎం చంద్రబాబు నుద్దేశించి పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
అధికారులు...భయపడుతున్నారు
తనకు తెలిసి పశ్చిమగోదావరి జిల్లా పచ్చగా ఉండేదని...కానీ ఇప్పుడు ఇక్కడ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. ఇక డెల్టా ప్రాంతమంతా చేపల చెరువులుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ రాజకీయ నాయకుల వల్ల ప్రభుత్వాధికారులు కూడా భయపడే పరిస్థితి నెలకొందని పవన్ దుయ్యబట్టారు. ఈ విషయమై తనకు చాలా మంది అధికారులు ఫిర్యాదు చేశారని చెప్పారు.
ముఖ్యమంత్రి చూస్తున్నారా?...చేస్తున్నారా?
ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారా?...లేక ఆయనే రెచ్చగొడుతున్నారో తనకు అర్థం కావట్లేదని అన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతినడానికి రాజకీయ నాయకులే కారణమని తేల్చిచెప్పారు. నేతలపై ముఖ్యమంత్రికి కంట్రోల్ లేకపోతే...ప్రజలు తిరుగుబాటు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?...అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
వాటాలు అడుగుతున్నారని...అని చెప్పారు
తాను లండన్ వెళ్లినప్పుడు అక్కడ వ్యాపారవేత్తలను కలవడం జరిగిందని...వారిని మీరు ఏపీకి ఎందుకు రావడం లేదని అడిగితే...మీ రాజకీయ నాయకులు వాటా అడుగుతున్నారని తనతో చెప్పారని పవన్ గుర్తుచేసుకున్నారు. మన రాజకీయ నేతల వల్ల పెట్టుబడులు కూడా రావడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని...ఎవరైనా రౌడీయిజం చేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. వాళ్లు స్పందించకుంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పారు. తెలంగాణాలో పోటీ చేసే విషయమై ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఆలోచిస్తామని పవన్ చెప్పుకొచ్చారు.