జగన్ ప్రభుత్వానికి ఎందుకంత భయం?: పవన్ కళ్యాణ్, దేవాలయాలపై దాడులు చేస్తే ఎందుకీ ఉదాసీనత?
అమరావతి: ఏపీ సర్కారుపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. పోలీసులు ఎంత బలప్రయోగం చేసి, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రామతీర్థం కొండ దగ్గరకు చేరుకొని ప్రజా నిరసనను తెలియచేసిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, ఉత్తరాంధ్ర సమన్వయ కమిటీ కన్వీనర్, సభ్యులు, నియోజకవర్గాల ఇంచార్జులు, నాయకులు, కార్యకర్తలు అభినందనీయులని అన్నారు.
హక్కులను హరిస్తున్న జగన్ సర్కారు
ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ, నిరసన తెలియజేయడం ప్రతి ఒక్కరి హక్కు. ఇటువంటి హక్కును ఆంధ్రప్రదేశ్లోని జగన్ రెడ్డి ప్రభుత్వం హరించి వేయడం ప్రజాస్వామ్యానికే విఘాతమని వ్యాఖ్యానించారు. జనసేన, బీజేపీలు తలపెట్టిన రామతీర్థ ధర్మ యాత్రను పోలీసులను ఉపయోగించి అడ్డుకోవడానికి ఈ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని మండిపడ్డారు.
జగన్ సర్కారు ఎందుకంత భయం: పవన్ కళ్యాణ్
గత రెండు రోజులుగా జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు బెదిరించడం, హెచ్చరికలు పంపడం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకంత భయపడుతుందో సామాన్యులకు అర్థం కాకుండా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వారినే కాకుండా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా జనసేన నాయకులు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమన్నారు. పోలీసుల అణచివేత ఎంత ఉన్నప్పటికీ శాంతియుతంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి, పోలీసుల నిర్బంధంలో ఉన్న జనసేన శ్రేణులకు అభినందనలు తెలియజేశారు పవన్.
హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఉదాసీనత ఎందుకు?
‘రామతీర్థం క్షేత్రంలో చోటు చేసుకున్న శ్రీ కోదండరామ స్వామి విగ్రహ శిరచ్ఛేధన దుస్సంఘటనను ఖండిస్తూ జనసేన - బీజేపీ సంయుక్తంగా చేపట్టిన ‘రామ తీర్థ ధర్మ యాత్ర'ను ప్రభుత్వం అడ్డుకొంటున్న తీరును ఖండిస్తున్నాం. సోమవారం రాత్రి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులను, నాయకులను, కార్యకర్తలను పోలీసులు హెచ్చరించడం, అరెస్టులు చేస్తామని బెదిరించడం చేస్తూ వచ్చారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి నేతలను, శ్రేణులను గృహ నిర్బంధంలో ఉంచడంతోపాటు కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి అరెస్టులు చేశారు. ఈ చర్యలు అప్రజాస్వామికం. రామతీర్థం క్షేత్రానికి చేరుకొన్న మా పార్టీ ప్రధాన కార్యదర్శులను, కార్యకర్తలను అక్కడ అదుపులోకి తీసుకున్న విషయం మా దృష్టికి చేరింది. పార్టీ మహిళ నేతలను, వీర మహిళ విభాగం సభ్యులను పోలీసులు నిర్బంధించడం గర్హనీయం. నిరసన తెలియచేయడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం అని.. రామ తీర్థ ధర్మ యాత్రను శాంతియుతంగా చేపట్టిన విషయాన్ని పోలీసు శాఖ దృష్టిలో ఉంచుకోవాలి. రాష్ట్రంలో యధేచ్చగా హిందూ ఆలయాలపై దాడులు సాగుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటూ... ఈ విధ్వంసాన్ని పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వైఖరిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది' అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.