వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు మద్దతిచ్చా, 2009లో పార్టీ నిలబడకపోతే.: పవన్ వార్నింగ్
విశాఖపట్నం: తెలుగుదేశం ప్రభుత్వంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు నాయుడు తన కొడుకు నారా లోకేష్కే ఉపాధి కల్పించారని, రాష్ట్రంలో ఇంకెవరికీ కల్పించలేదని దుయ్యబట్టారు. జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు ఇసుక మాఫియాకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రోజుకు సుమారు 6లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని అన్నారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా యలమంచిలిలో పవన్ కళ్యాణ్ తన పోరాట యాత్రను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
చట్టాలు బలవంతులకు బలహీనంగా..
చట్టాలు బలవంతులపై బలహీనంగా పనిచేస్తాయని అన్నారు. ప్రజల సమస్యలు తీరితే తనకు వచ్చిన జ్వరం దానికదే తగ్గిపోతుందని పవన్ అన్నారు. ఏటికొప్పాక బొమ్మల తయారీ ఎన్నో వందల కుటుంబాలకు జీవనాధారమని, అలాంటి కళకు అవసరమైన అంకుడి కర్రను అడవి నుంచి తీసుకోకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని, కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇసుకు మాఫియాపై మాత్రం కేసులుండవని అన్నారు. ఇలాంటి అన్యాయాలను ప్రశ్నించడానికే వచ్చానని పవన్ తెలిపారు. ఇక్కడ రైల్వే బ్రిడ్జీ ఇంకా పూర్తికానేలేదని అన్నారు.
బీజేపీ అలా.. చంద్రబాబులా డొంకతిరుగుడు కాదు
విభజన ముందు పదేళ్లు హోదా ఇస్తామన్న బీజేపీ.. ఇప్పుడు మాట కూడా మాట్లాడటం లేదని పవన్ అన్నారు. ఇప్పటికి కూడా హోదా ఇవ్వలేదని అన్నారు. కాకినాడ, అనంతపురంలో హోదాపై తాను మాట్లాడితే.. చంద్రబాబు మాత్రం హోదా అవసరం లేదని అన్నారని చెప్పారు. అప్పుడు బాబు ప్యాకేజీ మంచిదన్నారని గుర్తు చేశారు. హోదా ఇవ్వరని తనకు తెలుసని, హోదాకు చట్టబద్దత లేదని అన్నారు. ప్యాకేజీ ఇస్తారని చంద్రబాబు.. బీజేపీ నేతలను మెడపై పెట్టుకుని ఊరేగించారని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో తనది బీజేపీ స్క్రిప్టు అని అంటున్నారని, చంద్రబాబులా తనకు డొంకతిరుగుడు మాటలు రావని పవన్ అన్నారు.
చొక్కా పట్టుకునేందుకు..
తనకు ఓట్లు, ఎమ్మెల్యేల భయాలు లేవని పవన్ స్పష్టం చేశారు. యలమంచిలి యువతకు విద్యా, ఉద్యోగాలు కావాలని అన్నారు. సెజ్(ప్రత్యేక ఆర్థిక మండళ్లు)ల కోసం వేల ఎకరాలు తక్కువ ధరకే కేటాయిస్తే కొందరు పరిశ్రమలు పెట్టడం లేదని, కొందరు పరిశ్రమలుపెట్టినా స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. చదువుకున్న మత్స్యకార యువతకు ఉద్యోగావకాశాలు లేవని అన్నారు. పరిశ్రమల కాలుష్యంతో చేపలు చచ్చిపోయి వారికి ఉన్న ఉపాధి కూడా లేకుండా పోతోందని అన్నారు. అందుకే యువత చొక్కా పట్టుకునే అడిగేందుకు సిద్ధమయ్యారని అన్నారు. రాజకీయ వ్యవస్థ మారాలని అన్నారు.
చంద్రబాబులా వెన్నుపోటు తెలియదు
పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చిత్తశుద్ధిగా ఉంటారని అనుకున్నానని, కానీ అలా జరగలేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. చంద్రబాబులా వెన్నుపోటుపొడిచే వ్యక్తిని కాదని, ఏమీ ఆశించకుండానే చంద్రబాబుకు మద్దతిచ్చి టీడీపీ ప్రభుత్వ ఏర్పాటుకు కారణమయ్యామని చెప్పారు. ప్రజల సమస్యలు పట్టించుకోకపోవడంతోనే మీలో ఒకడిగా జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ చెప్పారు. అధికార, ప్రతిపక్షాలు దొందూ దొందేనని అన్నారు.
2019లో జనసేన ప్రభుత్వం
ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన పోరాడుతూనే ఉంటుందని పవన్ అన్నారు. 2019లో ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలో చెరుకు రైతులకు మద్దతు లభిస్తోందని, కానీ, ఇక్కడ మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కో-ఆపరేటివ్ సంస్థ అయిన విజయాడైరీని చంపేసి.. హెరిటేజ్ డైరీని తీసుకొచ్చారని పవన్ మండిపడ్డారు. ప్రైవేటు కంపెనీలు, వ్యక్తుల లాభం కోసం కో-ఆపరేటివ్ సిస్టంను చంపేస్తున్నారని ధ్వజమెత్తారు.
షుగర్ ఫ్యాక్టరీలను మూసేసి కార్మికులను నిరుద్యోగులను చేస్తున్నారని మండిపడ్డారు. రైతు గళం వినిపించడానికే వచ్చానని పవన్ చెప్పారు.
2009లో పార్టీ నిలబడకపోతే.. మరో పార్టీతో..
2009లో పెట్టిన పార్టీ నిలబడకపోతే.. మరో పార్టీతో మీ ముందుకు వచ్చానని.. అన్నింటికీ సిద్దపడే వచ్చానని పవన్ చెప్పారు. ఏపీ ప్రజలకు మంచి చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రూ.25కోట్లు పన్ను కట్టేవాడినని, అవన్నీ వదులుకుని వచ్చానని తెలిపారు. గిరిజనులకు మంచినీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించడం లేదని మండిపడ్డారు. జనసేన వెంట యువత ఉంటోందని నిరుద్యోగ భృతిని చంద్రబాబు ప్రకటించారని, అయినా ఇప్పటికీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. అందులో ఎన్నో కొర్రీలు పెట్టారని, ఆడపిల్లలకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని అన్నారు.
తరిమికొడతారంటూ పవన్ హెచ్చరిక
హుధుద్ తుఫాను బాధితుల కోసం భవనాలు కట్టారని, ఇంకా ఎవరికీ ఇవ్వలేదని, వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేసిన వారికే వాటిని కేటాయిస్తారట అని పవన్ మండిపడ్డారు. ఇలాంటి దగుల్బాజీ రాజకీయాలంటే తనకు అసహ్యమని అన్నారు. టీడీపీ జెండా పట్టుకుంటేనే బీసీ కార్పొరేషన్ రుణాలు ఇస్తారట అని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పనులు చేస్తే తరిమికొడతారని హెచ్చరించారు. రుణాలిచ్చేందుకు జన్మభూమి కమిటీలు అనుమతులివ్వడం ఏంటని ప్రశ్నించారు. నీ అబ్బ సొమ్మా? జన్మభూమి కమిటీలెందుకని ప్రశ్నించారు. ఇలాగే చేస్తే తెలంగాణలోలానే ఇక్కడ కూడా టీడీపీ లేకుండా పోతుందని అన్నారు.
ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినా..
ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినా ఆ విషయం వదిలేసి ఏపీని బాగుచేస్తారని చంద్రబాబుకు మద్దతిస్తే.. ఇప్పుడు దోపిడీకి తెరతీశారని పవన్ ఆరోపించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతిలో నీళ్లు రావడం లేదని అన్నారు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు విలువ ఇవ్వలేదు కానీ.. ఇప్పుడు ఆయన జపం చేస్తున్నారని మండిపడ్డారు. బతికున్నప్పుడు అన్నం పెట్టరు కానీ.. ఇప్పుడు పిండం పెడతారా? అని ప్రశ్నించారు. టీడీపీకి సాయం చేస్తే జనసేనను ఇప్పుడు బెదిరిస్తున్నారని అన్నారు. టీడీపీలో మార్పు రాదని, అందుకే యువత ముందుకు రావాలని అన్నారు.
నిబద్ధతో పనిచేస్తా..
2019లో జనసేన ప్రభుత్వం వస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా అన్నింటికీ తెగించే మీముందుకు వచ్చానని చెప్పారు. ఒక్కరోజులో సమస్యలు పరిష్కారం కావని, కానీ, తాను నిబద్ధత పనిచేస్తానని చెప్పారు. సీఎం సీఎం అంటే తాను ముఖ్యమంత్రిని కాననని, గ్రామ గ్రామాలకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని జనసైనికులకు పవన్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడాలని అన్నారు. మత్స్యకారులు ఇచ్చిన వలలో వేసి ప్రభుత్వం అవినీతి, అధర్మ పాలనను ఎండగట్టాలని పవన్ పిలుపునిచ్చారు.