దళిత మహిళపై దాడి: పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్, నిందితుల అరెస్ట్
విశాఖపట్నం: జిల్లాలోని పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో తన స్వస్థలాన్ని కాపాడేందుకు ప్రయత్నించిన దళిత మహిళపై జరిగిన దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులుగా భావిస్తున్న వారు ఆమెను హింసించారని మండిపడ్డారు.
ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
షాకింగ్: ప్రశ్నించినందుకు మహిళను వివస్త్రను చేసిన దుండగులు
బాధ కలిగింది...
అధికార తెలుగుదేశం పార్టీ నేతలే ఈ దారుణానికి ఒడిగట్టారని రిపోర్టులు చెబుతున్నాయని పవన్ అన్నారు. ఈ ఘటన గురించి విన్న తర్వాత తాను చాలా బాధపడ్డానని తెలిపారు.
ప్రజల్లోకి చెడు సంకేతాలు
ఈ దారుణానికి ఒడిగట్టినవారిపై పోలీసులు, ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోకుంటే ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు.
కారంచెడు లాంటి ఘటనలు వద్దు
ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు కారంచేడు, చుండూరు ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు.
జాగ్రత్తగా వహించాలి
అదేసమయంలో సున్నితమైన అంశాలపై స్పందించేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహిరించాలని ఆయన కోరారు. లేకపోతే ప్రజల్లో ఉన్న సామరస్యం దెబ్బతింటుందన్నారు.
రోహిత్ వేముల విషయంలో..
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో దళిత విద్యార్థి రోహిత్ వేముల మరణం దేశవ్యాప్తంగా ఎంతటి ఉద్రిక్తతను రేకెత్తించిందో ఆలోచించుకోవాలని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
కులం రంగు పులమొద్దు..
మహిళల గౌరవాన్ని కాపాడాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాననీ, అలాగే, వ్యక్తిగతంగా కొందరు చేసే పనులకు కులం రంగు పులుముతున్నారని... ఇది మంచి పద్ధతి కాదని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా కోరారు.
నేను వస్తే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..
తానే నేరుగా వస్తే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని పవన్ అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించడంతోపాటు బాధితురాలికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి..
ఇలాంటి ఘటనలపై మీడియా సంచలనాల కోసం కాకుండా, బాధ్యతయుతంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.
నిందితుల అరెస్ట్
జెర్రిపోతులపాలెంలో ఎస్సీ మహిళల పట్ల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన కేసులో శుక్రవారం పోలీసులు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ఎస్సీ,ఎస్టీ కేసుల సహాయ పోలీసుకమిషనర్ కె.ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉప ఎంపీపీ మడక పార్వతి, ఆమె భర్త అప్పలరాజు, సాలాపు గంగమ్మ, సాలాపు జోగారావు, వడిశల శ్రీను, రాపర్తి గంగరాజు, మడక రామునాయుడులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ పీవో చట్టంతో పాటు ఐపీసీ 354, 323, తదితర కేసులు నమోదు చేశామన్నారు. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం ఏడుగురిని శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు.