నేనేమీ సరదా కోసం పెళ్లిళ్లు చేసుకోలేదు: పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్పై ఘాటు విమర్శలు
అమరావతి: తనపై వ్యక్తిగత విమర్శలు చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో జనసేనాని మాట్లాడారు.
పవన్ నాయుడూ..మీకు పెళ్లిళ్ల మీద మక్కువ: జగన్ కు ప్రజాసేవ పిచ్చి..పది సార్లు తాట తీస్తారు
తెలుగు దండగ.. ఇంగ్లీషు పండగా అని మార్చుకుంటూ పోతే..
‘పొట్టి శ్రీరాములు గారి బలిదానంతో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి అసలు చరిత్ర తెలుసా?. 2015 - 16 లో తమిళనాడులో బలమైన తెలుగు భాష ఉద్యమం జరిగింది. అక్కడ ఇప్పటికీ తెలుగు మీడియం ఉంది. ఇంగ్లీష్ గ్లోబల్ లాంగ్వేజ్. ఎవరూ కాదనలేదు. కానీ ఒక్కసారి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలోకి మార్చాలంటే హేతుబద్దత ఉండాలి. 90 వేల మంది ఉపాధ్యాయులకు ట్రైయినింగ్ ఇవ్వకుండా, ఇంగ్లీషులో వారికి ప్రావీణ్యం కల్పించకుండా ఒకేసారి ఇంగ్లీషు మీడియంలోకి మార్చేస్తాను అంటే ఎలా..?. తెలుగు దండగ.. ఇంగ్లీషు పండగా అని మార్చుకుంటూ పోతే.. అటు ఇంగ్లీషు రాక ఇటు తెలుగు సరిగా రాక విద్యార్ధులు రెండింటికి చెడ్డ రేవడిలా తయారవుతారు. వారికి జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు. అప్పుడు జగన్ రెడ్డి కానీ, 150 మంది ఎమ్మెల్యేలు కానీ ఉండరు' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
సీఎం హోదాలో ఉండి సిగ్గులేకుండా ఇలాంటి వ్యాఖ్యాలా?
‘మన మాతృ భాష అయిన తెలుగును కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడితే.. కనీసం సిగ్గులేకుండా ఆయన స్థాయికి మర్యాద ఇవ్వకుండా విమర్శిస్తారు' అని పవన్ కళ్యాణ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
కేంద్రంలో పెద్దలే తగ్గారు.. మీరు మాత్రం..
‘దక్షిణాది రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇంగ్లీషు ముక్క లేకుండా స్పష్టంగా వారి మాతృభాషల్లో మాట్లాడుతుంటే- మన తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణలో తుర్దు, ఆంధ్రలో టింగ్లీషు మాట్లాడుతున్నాం. ఇప్పటికి కూడా పరిపూర్ణమైన తెలుగు మాట్లాడే పరిస్థితుల్లో మనం లేం. హిందీ భాషను దక్షిణాదిపైన రుద్దాలని కేంద్ర పెద్దలు చూస్తే.. దానిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో వాళ్లు వెనక్కి తగ్గారు. ఆ స్థాయి వ్యక్తులు ప్రజల మనోభావాలను గౌరవిస్తున్నామని చెప్పి వెనక్కి తగ్గారు. ప్రజలు నొచ్చుకోకుండా ఎంతో పద్దతిగా మాట్లాడారు. మీరు మాత్రం హేతుబద్దత లేకుండా విద్యార్ధుల జీవితాలతో ఆడుకుంటున్నారు. మీకు అంతగా ఇంగ్లీషు మీడియంపై ప్రేమ ఉంటే తిరుపతిలో సుప్రభాతం కూడా ఇంగ్లీషులో చదివించండి. జనసేన పార్టీ కోరుకుంటుంది ఒక్కటే. ముందు అధ్యాపకులను సిద్ధం చేయండి, పైలెట్ ప్రాజెక్టుగా ఏదో ఒక ప్రాంతంలో అమలు చేసి ఫలితాలను బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి' అని సీఎం జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ సూచించారు.
పెళ్లిళ్లు సరదా కోసం... జగన్ జైలులో ఉన్నారు అందుకేనా?
‘ప్రతిదానికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారు, తానేమీ సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదని, కుదర్లేదు కాబట్టే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. అయినా నేను ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు బాధ? మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్లే మీరు రెండేళ్లు జైల్లో ఉన్నారా?' అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
జగన్ సీఎంగా ఉన్నంత వరకే..
‘ఇసుక పాలసీ దగ్గర నుంచి రివర్స్ టెండరింగ్ వరకు పద్దతి పాడు లేకుండా చేశారు. జగన్ రెడ్డి అండ చూసుకొని 150 మంది ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. పాము శివుడి మెడలో ఉన్నంత వరకే గౌరవం. అలాగే ఒక్కసారి జగన్ గారి పరిస్థితి అటుఇటు అయితే మీ అందరి భవిష్యత్తు ఏంటో ఆలోచించి మాట్లాడండి. ఎలా పడితే అలా మాట్లాడితే భరించడానికి తాము తెలుగుదేశం పార్టీ కాదు జనసేన పార్టీ గుర్తు పెట్టకోండి. జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలకు భయపడేది లేదు. అవసరమైతే విజయవాడ నడిబొడ్డున చూసుకుంటాం' అంటూ పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయ లబ్ధి కోసం కాదు..
ఆ తర్వాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ‘భవన నిర్మాణ కార్మికుల తరఫున జనసేన పార్టీ చేస్తున్న పోరాటం ఇంతటితో ఆగిపోదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పార్టీపరంగా చర్యలు తీసుకున్నాం. ప్రభుత్వానికి ఓ గడువు ఇచ్చాం. రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని విశాఖ సభలో అధ్యక్షులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ రోజు గవర్నర్ గారిని కలసి జనసేన పార్టీ తరఫున ఓ నివేదిక కూడా అందచేశారు. ఇసుక పాలసీలో లోటుపాట్లపై అధ్యయనం చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ అందులో వివరించారు. 15,16 తేదీల్లో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో భవన నిర్మాణ కార్మికుల కోపం జనసైనికులు, నాయకులు శిభిరాలు ఏర్పాటు చేసి ఆహారం అందించాలని ఇప్పటికే అధ్యక్షులు పిలుపు ఇచ్చారు. ఇది రాజకీయ లబ్ది కోసం చేసే కార్యక్రమం కాదు. ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడాలి, వారికి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ఆత్మహత్యలకు పాల్పడిన అందరికీ పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం ఇళ్లు కట్టుకునే వారి నుంచి వసూలు చేసిన సెస్ నుంచి పరిహారం అందచేయాలి' అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ పాల్గొన్నారు